బైబిల్లో అసంబద్ధాల? అసంభవం (Rationale of Bible Bandaram) - part 1

Click HERE for eBook. Password is 'rajnagarcoc'


తొలి పలుకు
హైస్కూలు దాకా చదువుకున్నవారికి నేను చెప్పేది అనుభవపూర్వకంగా అర్థమౌతుంది. అంతవరకు రానివారికి వివరణలో సంగతి సమస్య లేకుండా తెలిసిపోతుంది. దీనికై పాఠశాల పరిధులలో ఒక (Language Book) భాషా పుస్తకాన్ని ఉదాహరణగా తీసికొందాం. ఓ కుర్రవాడు పదో క్లాసు ఇంగ్లీషు నేర్చుకోవాలన్నాడనుకో: ఆ ఇంగ్లీషు (Text) పుస్తకంలో, కొందరు వ్రాసిన వ్యాసాలతో గద్య భాగం (Prose) మరికొందరు వ్రాసిన పద్యాలతో పద్య భాగం (Poetry) ఉంటాయ్.

ఇలా అనేకులు వ్రాసిన ఆయా రచనలన్నిటికి కలిపి ఒకే (General purpose) సాధారణమైన ఉద్దేశముంటుంది. అదేమంటే - “పదో తరగతి అంతస్తులో విద్యార్థులకు ఇంగ్లీషు నేర్పించడం.” అయితే ఆ పుస్తకంలో చేర్చబడ్డ ఒక్కొక్క రచనకు ప్రత్యేకంగా (Special purpose) ఒక్కొక్క ఉద్దేశం, చర్చనీయాంశం (Theme), పూర్వ చరిత్ర (Background), రచనా శైలి (Style of writing), వ్రాయవలసిన అవసరత లేక పరిస్థితి (Need for writing), వగైరాలుంటాయ్! 

ఇలాటి పుస్తకాన్ని విద్యార్థులకు నేర్పించిన (బోధించిన) తరువాత దానిపై రావలసిన కనీసపు జ్ఞానం వారికి లభించిందో లేదో, (దానికై నియమింపబడిన) ఉపాధ్యాయులు పరీక్షిస్తారు. ఇలా విద్యార్థులను పరీక్షించేటప్పుడు ఏవో కొన్ని ప్రశ్నలను మాత్రమేగాక మాటలకు అర్థాలు, సమయ సందర్భాలు, వ్యాకరణం, వగైరా వగైరాలను ఆ విద్యార్థుల నడుగుతారు. వాటికి తగినట్టుగా సమాధానం వ్రాయగలిగితే - ఆ విద్యార్థికి ఆ పుస్తకంలో ఎంతో కొంత శాతంవరకు జ్ఞానం లభించినట్టు ఎంచబడుతుంది. అలా వ్రాయలేని విద్యార్ధిని, ఆ పుస్తకంలో అవసరమైన జ్ఞానం కూడా లేదని ఫెయిల్ చేస్తారు; కదూ?

మరి ఆ పుస్తకాన్ని ఉపదేశించే ఉపాధ్యాయుడుగా ఒకడు ఉండాలంటే - ఆ విద్యార్థికంటె మాత్రమే కాదు, ఆ తరగతి విద్యార్థులందరికంటె యింకా ఎంతో ఎక్కువగా విషయాలు తెలిసినవాడై ఉండాలి. ఒకవేళ దానిపై ఎవడైనా (Critic) విమర్శకుడుగా ఉండగోరితే, దాన్ని ఉపదేశించే ఉపాధ్యాయునికంటె, అతడు మించిన జ్ఞానియై ఉండటం అవసరం; లేదా దాని ఉపాధ్యాయునికి ఆ పుస్తకంపై ఉన్న కనీసపు గ్రహింపైనా ఆ విమర్శకునికి ఉండి తీరాలి. లేకుంటే అతడు విమర్శకుడనబడడు. సంగతి అర్థమయ్యింది . కదూ?

ఇప్పుడు మనం బైబిలు దగ్గరకు వద్దాం. ఒకడు విశ్వాసియైనా, అవిశ్వాసియైనా ఒకని విశ్వాసంతో నిమిత్తం లేకుండా, కేవలం ఒక పరిశీలకుడుగా మొత్తం మీద బైబిలు సందేశమేదో; దాని రచనలలో ఉన్న ఒక్కొక్క రచనలోని ఉద్దేశం, చర్చనీయాంశం, మాటల భావాలు, ప్రయోగింపబడిన విధానం, సమయం, సందర్భం, వ్రాయవలసిన అవసరత, గ్రంథంలో ఆయా రచనలకున్న స్థానం, వగైరా, వగైరాలు తెలియనివాడు బైబిలు విద్యార్థియని న్యాయసమ్మతంగా అనిపించుకోలేడు. ఇలాటి కనీసపు జ్ఞానం లేనివాడు నియమాన్ని బట్టి (బోధకుడు?) ఉపదేశకుడుగా ఉండవచ్చునా? అలాటప్పుడు, బైబిలును విమర్శించడానికి ఎంత పాండిత్యముండాలో యిక ఆలోచించు! బైబిలు పాండిత్యం లేనివాడు, అందులో ప్రతిదాన్ని క్షుణ్ణంగా ఎరుగనివాడు దాని విమర్శకు దిగవచ్చునా?

బైబిలు (గ్రంథం)లో పుస్తకాలెన్నో అవి ఎందుకు వ్రాయబడినవో ఎరుగనివాడు (బోధకుడు?) ఉపదేశకుడు కావడం లేదా? అలాటప్పుడు ఒక విషయాన్ని పరిష్కారంగా తెలిసికోకుండ విమర్శించడంలో తప్పేముంది? అని అడుగుతావేమో! ఆ ప్రశ్నకు వివేకులు నవ్వుతారు. అదెలాగున్నా గ్రంథాన్ని గ్రంథంగా ఎరుగకుండ "నోటికి వచ్చిందే మాట” అన్నట్టు మాటలాడడమే మన మిత్రుని హేతువాదమైతే, నేను చెప్పలేను గాని, - ఒక గ్రంథంలోనున్నది ఉన్నట్టు (విశ్వాసానికి సంబంధం లేకుండ) దానిని దానిగానే ఎరిగి విమర్శనాత్మకంగా, తార్కికంగా వాస్తవాలను సూచించేదే హేతువాదమైతే - అలాటి హేతువాదం "బైబిలు బండార"మనే మన మిత్రుని రచనలో ముమ్మాటికీ లేదు; లేదు.

ఈ భాగంలో మనం పరిశీలించబోయేది - "అసంబద్ధాలే గనుక ప్రధానంగా మన చర్చ ఈ మేరకు పరిమితి చేయబడుతుంది. ఎప్పుడైనా అవసరమనుకుంటే - “అవతారిక"కు వెళుదాం. “అవతారికను" వేరే రచనలో (బైబిలే దేవుని గ్రంథమైతే - బండారమెవరిది?) చర్చించాను. గనుక దాన్ని యిక్కడ సమస్య లేకుండా వదలిపెట్టవచ్చు. అయితే ఈ సందర్భంలో తార్కికంగా ఏవి అసంబద్ధాలు (Contradiction = పరస్పర విరుద్ధాలు) ఔతాయో తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. గనుక వాటిని ముందుగా తెలుసుకొందాం; సరేనా?
- రచయిత
ఏది అసంబద్ధం? ఏది కాదు?
ఇది నీకు తెలుసో లేదో కాని ఒక స్థలాన్ని కొలిచి, అది ఎంతైనది నిర్ధారణ చేయకముందు ఈ క్రింద ఉదహరింపబడిన కొన్ని కనీసపు జాగ్రత్తలు తీసుకోవాలి.
1. ఆ స్థలాన్ని కొలిచేవాడు చేతైనవాడేనా?
2. అతడు యథార్థవంతుడేనా?
3. అతని చేతిలోని కొల కర్ర సరియైనదేనా?
4. అతడు కొలిచే విధానం క్రమమైనదేనా? అనే ప్రశ్నలను - “ఔను” అనే సమాధానంతో మొదట నిర్ధారణ చేయాలి! లేకపోతే అపోహలలో దినాలు గడపవలసి వస్తుంది.

అలాగే ఒక రచనను లేక రచనలను కొలుస్తూ, వాటిలో తప్పులున్నాయ్; లేక
అసంబద్ధాలున్నాయ్ అని అనకముందు పైన అడిగిన ప్రశ్నల వంటివి మనం శ్రద్ధగా ఆలోచన చేయాలి. అంటే;
1. బైబిలును విమర్శించిన మన మిత్రుడు చేతనైనవాడేనా? (దాన్ని ఎలా కొలవాలో తెలిసినవాడేనా? అన్నట్టు). 
2. అతడు యథార్థవంతుడేనా? 
3. అతని చేతిలోని కొల కర్ర (హేతువాదం?) సరియైనదేనా? 
4. అతడు దాన్ని విమర్శిస్తున్న విధానం క్రమమైనదేనా? అని మొదట నిర్ధారణ చేయకుండ అతని రచనను అంగీకరించడం బుద్ధిహీనతయే ఔతుంది. గనుక బైబిల్లో అసంబద్ధాలున్నాయనే మన మిత్రుని మాటను అంగీకరించక ముందు - అసలు అసంబద్ధమంటే ఏమి? ఎలాటి వాటిని అసంబద్ధాలంటారు? ఏవి అసంబద్ధాలు కావు? అనే ప్రశ్నలను ముందుగా పరిశీలించుదాం. 

అసంబద్ధమనే మాటకు మన మిత్రుడు తన భావాన్ని ఇంగ్లీషులో వ్యక్తపరిచాడు. అసంబద్ధమంటే – "Contradiction" అనేది తన భావమట! "Contradiction" అనే పదాన్ని Webster ఇలా నిర్వచించాడు: "Contradiction is a distinction by opposite qualities," "Contradict; కాదను, లేదను, అడ్డమాడు, ఎదిరించు, deny,oppose, gainsay, impugn vi, మారాడు,ఎదిరించు contradiction, n. కాదనుట లేదనుట, మారాడుట, నిరాకరణము, denial opposition, contrary declaration....." (Sankaranarayana's English - Telugu Dictionary).

 అసంబద్ధమంటే పరస్పర విరుద్ధం; ఒక దానిని మరియొకటి వ్యతిరేకించడం. ఒకటి ఔనంటే అదే సమయ సందర్భాలలో మరొకటి దాన్ని కాదనటం; ఒకదానికొకటి విరుద్దంగా నిలవడం! అసంబద్ధమంటే అర్థమయ్యిందా? అయితే ఏవి తార్కిక అసంబద్ధాలో మన తెలుసుకోవాలి. దానికి ముందు ఏవి తార్కిక అసంబద్ధాలు కావో గుర్తించుదాం.
ఏవి అసంబద్ధాలు కావు?(WHAT ARE NOT LOGICAL CONTRADICTIONS?)
1. "A mere difference in description or explanation does not constitute a logical contradiction." అంటే, ఒక విషయాన్ని వివరించడంలో లేక వర్ణించడంలో ఉండే వ్యత్యాసమే అసంబద్ధం కానక్కరలేదు. ఎలాగంటే - ఒకే సంభవాన్ని యిద్దరు ఒకేసారి చూస్తున్నా వారు దాన్ని వర్ణించడానికి చేసే పద ప్రయోగంలో వ్యత్యాసం సహజంగా ఉంటుంది. People look at things from their own mental framework or perspective! ఉదా: వారు వెళ్లిన ఒక వినోద యాత్రను గూర్చి యిద్దరు వ్రాసిన వ్యాసాలలోని పదాలు ఒకటిగా నుండనవసరం లేదు. ఎక్కువ సంగతులను గ్రహించడానికి కొన్నిసార్లు వారిద్దరు వ్రాసినవాటిలోని వ్యత్యాసాలే సహాయపడతాయ్! ఆ వ్యత్యాసాలను అసంబద్ధాలనడం అర్థరహితం!

2. A mere difference between usage and reality does not constitute a logical contradiction. “వాస్తవం - వ్యవహారికం" అనే వాటిలోని వ్యత్యాసాలు అసంబద్ధాలు కావు; ప్రొద్దు గ్రుంకింది"; "సూర్యుడు నెత్తిమీదికి వచ్చాడు" అనే వ్యవహారికాలు - భూమి తిరుగుతుందనే వాస్తవానికి విరుద్ధమని భావించం కదూ? అలాగే కొన్ని వాస్తవాలు, వ్యవహారికాలుంటాయ్; అవి అసంబద్ధాలు కావు.

3. Difference between an accurate description and common expression does not constitute a logical contradiction. “సునిశితం” “సాధారణం” అనే వాడుకలలో అసంబద్ధ ముండదు. ఉదా: కాంతి వేగం - సెకండుకు 186000 మైళ్లని సాధారణంగా చెప్పుతాం. అయితే దానిని 186232 మైళ్లని సునిశితంగా చెప్పాలి. ఇలాటి వ్యత్యాసాలు అసంబద్ధాలు కావు.

4. Natural contradictions are not logical contradictions అంటే స్వాభావిక విరుద్ధాలు తార్కిక విరుద్ధాలు కానవసరంలేదు. ఉదా: నేను మనిషిని, నాలో ప్రేమద్వేషాలున్నాయ్. నాలో ప్రేమద్వేషాలున్నంత మాత్రాన నాకు నేనే విరోధిని కాను. నేను నీతిని, జ్ఞానాన్ని ప్రేమిస్తాను. దుర్నీతిని, అబద్ధాన్ని ద్వేషిస్తాను. అందులో నా వ్యక్తిత్వానికి ఏ సమస్యలేదు. అలాగుండటం అసంబద్ధం కాదు. ప్రేమ ద్వేషాలు స్వాభావిక విరుద్ధాలు కావా? అవును. అయినా అవి తార్కిక విరుద్ధాలు కావు గదా?

5. A mere incoherence between ones ability and his attitude does not
constitute a contradiction. శక్తి, స్వభావం, అనేవాటి మధ్య ఉండే భేదం అసంబద్ధం కానవసరం లేదు! ఉదా: అతనికి యౌవన బలముంది; అయితే అతడు వ్యభిచారం చేయడు! బలముంటే, చేయాలనేది తప్పు. "శక్తి" ఉన్నా అతని స్వభావం అతని శక్తితో ఏకీభవించకపోతే, ఆ వ్యత్యాసం అసంబద్ధం కాదు. అంటే శక్తి, స్వభావాలు ఒకదానినొకటి వ్యతిరేకించినా, అది అసంబద్ధం కాదు.

6. Mere opposing expressions do not form a logical contradiction. "వస్తాను," "రాను" అనే ప్రయోగాలు విరుద్ధ భావాలను సూచిస్తున్నా ఆయా సందర్భాలలో అవి పరస్పర విరుద్ధాలు కానవసరం లేదు. ఉదా: "నేను పండితుల గోష్టికి వస్తాను"; "మూఢుల వితర్కాలకు రాను" అనే వాటిలో అసంబద్ధం లేదు.

7. Mere variation in imparting information does not make a logical contradiction. అవసరాన్ని బట్టి మాట్లాడే మాటలలో వ్యత్యాసాలు అసంబద్ధాలు కానవసరం లేదు. ఒకనితో - "మా ఫ్రెండ్సు వచ్చారండీ!" అని, మరొకనితో - "ఈ రోజే మా ఫ్రెండ్ శేఖర్ వచ్చాడు, నీకు కన్పించలేదా?" అనే మాటలలో గల వ్యత్యాసం అసంబద్ధం కానేరదు. మనుష్యుల పరిచయాన్ని బట్టి మాటలు ఉపయోగించడం జరుగుతుంది.

8. Sheer difference in names does not pose a contradiction. పేర్లలో వ్యత్యాసం అసంబద్ధం కానక్కరలేదు. నేను వాల్టేరులో చదువుకున్నా వైజాక్లో ధరలు ఎక్కువగా ఉంటాయ్; విశాఖ బీచ్ పెద్దది కాదు. అలా మాట్లాడేది ఒకే పట్టణాన్ని గూర్చియైనా, ఏ సమస్య లేకుండా పై సంగతులు అంగీకరించబడతాయ్. అలాగే భారత్, ఇండియా, హిందూదేశమనేవి ప్రయోగించవచ్చు. వాటి ప్రయోగంలో వ్యత్యాసాలు అసంబద్ధాలు కావు.

9. Speaking invisible entities as visible realities does not constitute a contradiction. అదృశ్యాలను దృశ్యాలుగా ప్రయోగించటం - అసంబద్ధం కాదు. ప్రాణాన్ని ఎవడూ, ఎప్పుడూ చూడలేదు. అయినా, “అతనిలో యింకా ప్రాణముందా? సకల జీవులలో ప్రాణముంది; ఆ జంతువు ప్రాణం పోయింది!" అనే మాటలు వాడబడతాయ్! అంటే ప్రాణాన్ని చూచామని, లేక చూస్తున్నామని దాని భావం కాదు. అదృశ్యమైన ప్రాణం దృశ్యంగా వ్యవహరించడంలో అసంబద్ధముందని బుద్ధి ఉన్న ఎవడూ అనడు.

10. "Factual contradiction may not be a true logical contradiction." అంటే వాస్తవ వైరుధ్యాలు తార్కిక వైరుధ్యాలు కానవసరంలేదు. ఎందుకంటే ప్రతిదానికి సమయముంది. నవ్వడం, ఏడ్వడం, కూర్చటం, చెదరగొట్టడం, నాటటం, పెరికి వేయటం; వగైరాలు పరస్పర విరుద్ధాలే! అయితే ప్రతిదీ దాని దాని సమయంలో చేసినప్పుడు అవి తార్కిక విరుద్ధాలు కావు. ఉదా: “వంగతోట"ను (వంకాయల చెట్లు తోటగా) వేసుకొన్నాడు; వంగ తోటను పెరికివేశాడు. అవి ఆయా కాలాలలో జరుగవలసిన పనులే; అలాటి వాస్తవాలు అసంబద్ధాలు కావు. 

11. Difference in expression caused by foreign languages does not constitute a logical contradiction. పర భాష ప్రాభల్యంవలన ఏర్పడిన వ్యత్యాసాలు, సమాజిక వాడుకలవలన ఏర్పడిన వ్యత్యాసాలు అసంబద్ధాలు కావు. ఉదా: “నాసిన వీరబ్రహ్మం; ఎన్. వి బ్రహ్మం; మిత్రుడు బ్రహ్మం; బ్రహ్మం" అనే ప్రయోగాలు వ్యత్యాసమైనవే! అలాటి వ్యత్యాసాలు అసంబద్ధాలు కావు. ఇలాటివి పేర్లలోనే కాదు; యితర ప్రయోగాలతో కూడా సమస్యలు కావు, కానేరవు.

12. Human errors in manuscripts cannot be counted as contradiction. వ్రాత ప్రతులలో మానవ దోషాలవలన ఏర్పడిన సమస్యలు - అసంబద్ధాలు కావు.

గనుక వ్యత్యాసాలనే అసంబద్ధాలుగా భావించడం కేవలం అవివేకం, అలా భావించేదే మన మిత్రుని కొలకర్ర, ఈ కొలకర్రతోనే అతడు బైబిలును కొలవడానికి యత్నించాడు. ఆ కొలకర్ర తప్పుడుది. గనుక, బైబిలును గూర్చి అతడు కొలిచిన కొలత (బైబిలు బండారం”) తప్పక తప్పుడుదైయుండాలి. ఉండి తీరాలి! బైబిలుపై మన మిత్రుడు
ఉపయోగించిన కొలకర్ర విషయమిది. పోతే అసలు కొలత వేయడానికి అతడు చేతనైనవాడేనా? ఆ సంగతి తేల్చుకొనక ముందు ఏవి అసంబద్ధాలౌతాయో చూద్దాం.
- రచయిత
అసంబద్ధాలు ఎలాంటివి?(WHAT MAKES A TRUE LOGICAL CONTRADICTION?)
ఒకడు తాను "అవును" అని (వాదించి) స్థిరపరచిన దానిని, తిరిగి తానే “కాదని" (వాదించి) స్థిరపరచాలి; లేక ముందు చెప్పింది కాదన్నట్టు తన వాదనలో గుప్తం చేసైనా స్థాపించాలి! అయితే అలాటివి బైబిలులో లేవు కాని బైబిలులో అసంబద్ధాలున్నాయని చూప ప్రయత్నించిన మన మిత్రుడే ఆ అసంబద్ధాలలో పడ్డాడు. నిజమైన ఆ అసంబద్ధాన్ని చూడగోరినవానికి బైబిలులో అది కన్పించదు గాని; బైబిలును విమర్శించిన మన మిత్రుని బైబిలు బండారంలో అది తేటగా కన్పిస్తుంది చూడు! ఇప్పుడు మనం చూడబోయేది మన మిత్రుని "... బండారంలోని మాటలే!!

“ఇక్కడ ఉదాహరణకు యెషయా గ్రంథంలోని క్రీస్తు అవతారానికి చెందిన ప్రవచనాన్ని పరిశీలిద్దాం." అని ప్రారంభించి మన మిత్రుడు దాన్ని యిలా ముగిస్తున్నాడు:

“గనుక బైబిలులో ప్రవచనమంటే కవిత్వమే. బైబిలులో పేర్కొనబడ్డ ప్రవక్తలు కేవలం కవులో, గాయకులో, సోదెగాండ్రో అయినట్టు స్పష్టమవుతున్నది. వారి ప్రవచనాలన్నీ అబద్ధాలే అని రుజవైనాయి. "పాత నిబంధనలోని ప్రవక్తల ప్రవచనాలకే కాలదోషం పట్టినప్పుడు కేవలం వాటి ఆధారము పైననే జన్మించాడనబడే యేసుక్రీస్తు మిధ్య అనుకోవడంలో బాధలేదు" (అవతారిక, పేజీ 22).

పైన కోట్ చేసిన మాటలలో మన మిత్రుడు ఏమని వాదించాడో గమనించావా? యేసుక్రీస్తును గూర్చిన ప్రవచనాలు పాత నిబంధనలో లేవట! యెషయా ఆయన్ను గురించి ప్రవచించలేదట. ఇది అతని వాదన!! పోనీ మన మిత్రుడు తన మాటలను అలా నిలుపుకుంటే బాగుండేదే. అయితే దాన్ని అలా నిలుపుకోలేదే! అదే తన వాదనలో ఉన్న లోపం. కావాలంటే చూడు! ఇప్పుడు మన మిత్రుని "అవతారిక"నుండి అతని అసంబద్ధాలకు వద్దాం. అసంబద్ధాలలో - 32 చూడు. (బైబిలు బండారం - పేజీ 56)

“32. మూగవాడి కేక!
అతడు (యేసు) కేకలు వేయుడు; అరవడు; తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు యెష. 42:2.

యేసు- ఎలోయి, ఎలోయి లామా, సబక్తానీ, అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్ధము మార్కు 15:36.”

ఇంతకు పాయింటు అర్థమయ్యిందా? “అతడు" అనే మాటకు అర్థం ఈ సందర్భంలో బైబిలు చెప్పనే లేదు. బైబిలులో లేనిది మన మిత్రుని రచనలో వెలసింది. అంటే “అతడు" అని యెషయా 42:2లో ఉన్న దాని భావం-తానే చెప్పుతున్నాడన్నమాట! “అతడు" అనే పాత నిబంధన పదం ఎవరిని సూచిస్తుందంట? ఆ పదం యేసును సూచిస్తుందట! ఎవరంటున్నారు? మన మిత్రుడే!!! అంటే, యెషయా యేసును గూర్చి ప్రవచించాడని మిత్రుడు బ్రహ్మం అంటున్నాడు!!!

పాత నిబంధనలో యేసును గూర్చిన ప్రవచనాలు లేవని వాదించినవాడు, తిరిగి పాత నిబంధనలో యేసుని గూర్చిన ప్రవచనముందని చెప్పుతూ, బైబిలులో సూచింపబడని మాటతో ఆ భావాన్ని తానే సూచించాడు! దీన్ని బట్టి తన అసంబద్ధాలలో ఏమి చేస్తున్నాడు? యేసును గూర్చి పాత నిబంధనలో ప్రవచనాలున్నాయ్ అని స్థాపిస్తున్నాడు. ఇలా చేసేదే అసంబద్ధం- CONTRADICTION!!

పైగా చూడు: యెషయాకు వ్యతిరేకంగా ఉన్నట్టు మరో లేఖనాన్ని మన మిత్రుడు కోట్ చేశాడే -అదేంటి? మార్కు 15:34! ఈ మార్కు 15:34 ఎక్కడదో తెలుసా? అది కీర్తనలు 22:1లోనిది. కీర్తనలు 22 పాత నిబంధన రచన. అది హెబ్రీ భాషలో వ్రాయబడింది. వ్రాయబడిన హెబ్రీ మాటలు-"ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ" అనే మాటలే! అంటే, కీర్తన 22:1 ప్రవచనానికి నెరవేర్పు మార్కు 15:34లో చూపించబడింది. గనుక పాత నిబంధనలో క్రీస్తును గూర్చిన ప్రవచనాలున్నాయని స్థాపించడమే కాదు. అవి నెరవేర్చబడ్డాయని మన మిత్రుడు యెషయా 42:2 కోట్ చేసి దాని భావం చెప్పడంలోనూ; మార్కు కోట్ చేసిన పాత నిబంధనలోని కీర్తనలు 22:1ని మిత్రుడు బ్రహ్మం కోట్ చేసి, దాని భావం చెప్పడంలోను స్థాపించడమైనది. గనుక బైబిలులో (పాత నిబంధనలో) ప్రవచనాలు లేవనీ, వాటిని ఆధారం చేసుకొని జన్మించిన యేసు లేడని వాదించిన మన మిత్రుడే, పాత నిబంధనలో యేసును గూర్చిన ప్రవచనాలున్నాయని యేసు అనే వ్యక్తి పాత నిబంధన ప్రవచనాల నెరవేర్పుగా వచ్చాడని వాదించాడు, స్థాపించాడు. ఇదే నిజమైన అసంబద్ధం -A TRUE LOGICAL CONTRADICTION! 

బైబిల్లో అసంబద్ధాలున్నాయంటూ వాటిలో అసంబద్ధాలను మన మిత్రుడు చూపలేక
పోగా, ఆ పనిలో తానే అసంబద్ధాల్లో పడిపోయాడు గనుక - మన మిత్రుడు బ్రహ్మం - బైబిలు లేఖనాలను కొలత వేయడానికి చేతగానివాడని తనకు తానే రుజువు చేసుకున్నాడు.
దీన్నెవడైనా కాదనగలడా?? 

అయితే ఒక మాట. బైబిలు రచనలోనికి కొన్ని మానవ దోషాలు దొర్లిన మాట వాస్తవం. ఈ దోషాలలో ఎక్కువ భాగం ప్రతుల వ్రాతలలో జరిగిన దోషాలే (copyists errors). 16వ శతాబ్ధంలో ప్రింటింగు ప్రారంభమయ్యింది. దానికి ముందు కనీసం రెండు మూడువేల సంవత్సరాలుగా పాత నిబంధన చేతి ప్రతుల మూలంగానే కొనసాగింది. ఎంత జాగ్రత్త వహించినా, చేతిప్రతుల చూచి వ్రాతలో దోషాలు రాకుండ ఉండటం కష్టం. పైగా దాన్ని తిరిగి మరోసారి వ్రాసేటప్పుడు; మళ్లా దాన్ని తిరిగి వ్రాసేటప్పుడు - యిలా తరతరాలుగా జరిగిన ఆ కార్యక్రమంలో, ఎప్పుడో యిలాటి దోషాలు దొర్లాయ్. ప్రతుల వ్రాతలలో దొర్లిన దోషాలు రచన (రచయిత) దోషాలుగా భావించడంకన్న మరో బుద్ధిహీనత, వెర్రితనం పండితుల మధ్య ఉండదనే చెప్పాలి. పామరులు వాటిని ఎలా కొలిచినా, అంతటి దీర్ఘకాలంగా చేతివ్రాతల రూపంలోనే కొనసాగిన రచనలను వాటిలో దొర్లిన మానవ దోషాలను బట్టి (బైబిలును) విమర్శించడం - హేతువాదానికి తగుతుందా? అది తగుతుందనుకుంటే మన మిత్రుడు - "గురిగింజలా” పరీక్షించుకోవలసి వస్తుంది సుమీ!

వేలకొలది సంవత్సరాలు చేతిప్రతులలో కొనసాగిన పాత నిబంధన రచనలలో చూచి వ్రాతలో మానవ దోషాలు దొర్లడం ఒక వంతు. కాని 1958 ప్రాంతంలో ప్రారంభమై, అది ప్రింటు చేయబడక ముందు అనేకమార్లు ప్రూఫ్ దిద్దుకొనే అవకాశమున్న మన మిత్రుని రచనలో మానవ దోషాలు దొర్లడం మరొకవంతు. వందలాది పేజీలు ఉన్న బైబిలులో చూచి వ్రాతలో దోషాలు ప్రవేశించడం ఒకవంతు. కేవలం 80 పేజీల్లో ఉన్న మన మిత్రుని క్షుద్ర రచనలో ఆ దోషాలు దొర్లడం మరొక వంతు! అయితే విపరీతమేమో తెలుసా? అట్టివి మన మిత్రుని రచనలో జరిగితేనేమో ఏ సమస్యా లేదట! అయితే అలాటివి బైబిలులో దొర్లితే మాత్రం నేరమట!! ఇందుమూలంగా, ఇలాటి మన మిత్రుడు బైబిలును విమర్శించ డానికి తగినవాడు (యథార్థవంతుడు) కాడని తేలిపోయింది. మన మిత్రుని దోషాలకు రుజువు తరువాత చూడు.

ఏదియెలాగున్నా కాలక్రమంలో అక్షరాలు చెరిగిపోవడం - ఆనాటి రచనకు సహజం. కారణమేమంటే - మనలాటి నవీన రచనా సాధనాలు వాళ్లకు లేవు. పైగా హెబ్రీ భాష ఒకలాటి గీతల వ్రాత! తెలుగులా అది గుండ్రంగా ముచ్చటగా ఉండదు. దానిలో ఉన్న ప్రతి చిన్న వంక, గీత, మెలికి - ఒక్కో భావాన్ని సూచిస్తూ, మారుతూ ఉంటుందట. కొద్దిగా ఎక్కడైనా అక్షరం చెరిగితే, తిరిగి ప్రతి వ్రాయబడేటప్పుడు అది సమస్యగా మారిపోతుంది; తప్పుగా వ్రాయబడటానికి దోహదమౌతుంది. అందులో అంకెలైతే మరీ యిబ్బందిగా మారిపోతాయ్. గనుకనే అక్కడక్కడ అంకెలలో ఆ దోషం కన్పిస్తుంది.

పైగా నేటి దినాలలో, బైబిలు బోధలుగాని, విమర్శలుగాని ఆది భాషలను చూచి చేసేవి కావు. కేవలం బైబిలు తర్జుమాలను చదివే మాట్లాడుతూ ఉంటాం. తర్జుమా చేసినవారు ఎంత యథార్థవంతులైనా, పండితులైనా, హెబ్రీ భాషకు అలాగే గ్రీకు భాషకు తెలుగులో సమానమైన పదం కనుగొనటం కొన్నిసార్లు కష్టం. భాష వాడుకనుబట్టి కూడా భావముంటుంది. అలాటప్పుడు తర్జుమాదారులు వాడిన మాటలు, ఆది భాషలో ఉన్న భావాన్ని కొన్నిసార్లు పూర్తిగా యివ్వలేకపోవచ్చు. వీటన్నిటి గుండా దూసుకొనిపోతూ; బైబిలు పరస్పర విరుద్ధాలు లేని దేవుని గ్రంథమని రుజువు చేసుకొంటుంది. గనుక మన విశ్వాసంతో నిమిత్తం లేకుండ, వాస్తవాలను స్థాపించాలనే సదుద్దేశంతోనే బయలుదేరుదాం! వ్యక్తి ద్వేషం లేకుండా కేవలం గ్రంథ పరిశీలకులుగానే - మనం మన మిత్రుని రచనలోని అసంబద్ధాలను పరిశీలించుదాం.
రచన అతి సామాన్యమైన విద్యగలవారిని దృష్టిలో నిలుపుకొని వ్రాయబడింది గనుక, నిజానికి అవసరం లేకపోయినా, కొన్ని సంగతులు తిరిగి చెప్పబడ్డాయ్. సంగతి అర్థమయ్యేలా విశదపరచడానికి ఉదాహరణలు ఉపయోగించబడ్డాయ్. అసలు గ్రంథమే మంటుంది? దాన్ని తప్పుగా అర్థం చేసుకున్న మన మిత్రుడు ఏమంటున్నాడు? ఇంతకు అసంబద్ధాలని (contradiction) మన మిత్రుడు ఎందుకంటున్నాడు? ఏదియెలాగున్నా మన మిత్రుని మాటలు వింటూ గ్రంథాన్ని తార్కికంగా పరిశీలించి చూద్దాం.
-రచయిత

విషయ సూచిక
ఏది సత్యం? ఏదసత్యం?

1. జంతువులదా, మనుష్యులదా? ఎవరి సృష్టి ముందు?
       దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను, అది మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు - మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము (అని పలికెను) ఆది. 1:25, 26.

        దేవుడైన యెహోవా - నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశపక్షిని నేలనుండి నిర్మించి ఆదాము వాటికి యే పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను ఆది 2:18, 19.

        గమనిక: పై లేఖనాలను బైబిల్లోనుండి ఎత్తి వ్రాసి వాటిలో (సమస్య) అసంబద్ధముందని అంటాడు మన మిత్రుడు! అసంబద్ధం (Contradiction) అంటే ముందుగా కొంతవరకు చూచాం; ఇంకా పోనుపోను మరికొంత చూస్తూ పోదాం. పై లేఖనాల్లో అసంబద్ధమే కాదు. వాటిలో అసలు సమస్యే లేదు. అయితే మన మిత్రుడు వాటి భావాన్ని ఎలా తెచ్చాడంటే; మొదటి లేఖనం ప్రకారం ముందు జంతువులను చేసి, ఆ తరువాత మానవుని నిర్మింప నుద్దేశించినట్టుందనీ; రెండో లేఖనంలోనేమో, ముందు మనుష్యుని చేసి ఆ తరువాతనే జంతువులను చేసినట్టుందనీ
గనుక అది అసంబద్ధమని సూచించాడు. అదీ మన మిత్రుని భావన!

        అయినా పై లేఖనాలను వాటి సందర్భంలో చదువుతుంటే అలాంటి భావం రాదు. రాని భావాన్ని స్థాపించగోరి మన మిత్రుడు ఈ ప్రశ్న అడుగుచున్నాడు. కావాలంటే బైబిలును దాని దాని సందర్భాలల్లో రచయిత ఉద్దేశాలను రచయిత ఉద్దేశాలుగానే చూచి చదివితే, అసలు సమస్య లేఖనాలది కాదు. బైబిల్లో ఎలాగైనా తప్పులు పట్టాలనే కంకణం కట్టుకున్న మన మిత్రుని మనస్సులోనిదే! ఇలాటి మన మిత్రుని మనస్సువలన - కేవలం తప్పు ఎక్కడ దొరుకుతుందా అని బైబిలును వెదకినట్టు కన్పించాడే గాని, తాను ముందుగా ప్రశ్నించినట్టు - ఏది సత్యమో తేల్చుకోడానికి అతడు బయలుదేరలేదు! తన రచనను, బైబిలును ఒకదాని ప్రక్కన మరొకటి పెట్టుకొని పరిశీలించితే, ఈ విషయం మనకు తేలిపోతుంది. పైగా బైబిలు ఉద్దేశింపని రంగు ఆయా లేఖనాలకు కొట్టి, తాను కొట్టిన ఆ రంగునుబట్టి మన మిత్రుడు వాటిని విమర్శింపసాగాడు. హేతువాది తన విమర్శలో యిలాటి పంథాను అనుసరిస్తాడా? లేక యిలాటి పంథాను అనుసరించేదే అతని హేతువాదమా?

       దాని సంగతి అలా ఉంచి, బైబిలు లేఖనాలను వాటి సందర్భంలో పరిశీలించి చూద్దాం. ఆది. 1:25, 26లో - జంతువుల యొద్దనుండి జరిగిన దేవుని సృష్టి కార్యక్రమం వివరించబడింది. అందులో చెప్పబడినట్లు, నరుడు భూ జంతువుల తరువాత నిర్మింపబడినవాడే! అయినా దేవుని సృష్టికి కిరీటం నరుడే! అంటే, వాడు (భూమిని లోబరచుకొని,) సముద్రపు చేపలకు, ఆకాశపక్షులకు, భూమిమీద ప్రాకు ప్రతి జీవికి ఏలికగా నియమించబడ్డాడు (ఆది. 1:28, 29). కీర్తన. 8:5–8లో కూడా ఈలాటి భావమే సూచింపబడింది. అయితే ఆది. 1:25, 26కు వ్యతిరేకంగా ఉన్నట్టు మన మిత్రుడు ఆది. 2:18, 19ని ఎత్తి వ్రాసాడే! అది నిజంగా వ్యతిరేకమైన లేఖనం కాదు. అది 1:25, 26ను బలపరచే లేఖనమే సుమీ! ఎలాగంటావేమో, చూడు!!

       మొదట ఆదాము సృజింపబడ్డాడు. యింకా హవ్వ నిర్మింపబడలేదు. ఈ మధ్య వ్యవధిలో మహోన్నతుడు నరునికి యిచ్చిన ఆధిక్యతను ఆది. 2:18, 19 సూచిస్తుంది. మన బిడ్డలకో, లేక మన చేతి పనులకో యింకొకరి చేత పేర్లు పెట్టించుకుంటున్నామంటే, ఆ వ్యక్తిని హెచ్చుగా గుర్తించామన్న సంగతి మీకు తెలియదా? అలాగే మానవుని కంటె ముందుగనే ఆయన భూ జంతువులను సృజించినా, వాటికంటె నరుడు ఘనుడని స్థాపించడమే గాక, తన దృష్టిలోనూ నరుడు ఘనుడేయని చూపించడానికిగాను వానిచే ఈ కార్యక్రమాన్ని ఆయన చేయించాడు. ఇలాటి బైబిలు బోధలో వివేకియైన ఎవనికి అసంబద్ధం కన్పించే అవకాశం లేదు. నమ్మకాలతో నిమిత్తం లేకుండా పై లేఖనాలను ఆలోచన చేస్తే అసంబద్ధం ముచ్చటి అటుంచి, వాటిలో అసలు సమస్యే లేదు అని తేలిపోయింది. అసలు వాస్తవమేమంటే - ఆదికాండం కాలక్రమంలో గాక, అంశ క్రమంలోనే వ్రాయబడిన సంగతి ఎరుగక మన మిత్రుడు పొరబడ్డాడు.
2. నరనారీ సృష్టిలో కాలకర్మాలకు పట్టినగతి
     దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను, పురుషునిగాను వారిని సృజించెను. ఆది. 1:27. 

     అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదాముకు సాటియైన సహాయము అతనికి లేకపోయెను. ...తరువాత దేవుడైన యెహోవా తాను ఆదామునుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసికొని వచ్చెను. ఆది.2:20-22.

గమనిక: ఇక్కడ మన మిత్రుడు సూచింపనుద్దేశించిన సమస్యను తానే యిలా వివరించుచున్నాడు. చూడు! "నరనారీ సృష్టిలో కాలకర్మాలకు పట్టిన గతి" అని రెండో అసంబద్ధానికి యిచ్చిన శీర్షిక వైరుధ్యాన్ని నేరుగా పట్టివ్వదు. ఇందులో ముందు యిచ్చిన ఆదికాండం 1వ అధ్యాయంలోని 27వ వాక్యం ప్రకారం స్త్రీ పురుషులను ఒకేసారి తన రూపంలో దేవుడు చేసినట్లు విశదమవుతుంది; కాని తర్వాత యిచ్చిన ఆది. 2వ అధ్యాయం లోని 20, 21, 22 వాక్యాల ప్రకారం దేవుడు ముందుగా పురుషుని సృష్టించి, తర్వాత జంతువులను సృష్టించి అటు తర్వాత పురుషుని ప్రక్కటెముకతో స్త్రీని నిర్మించినట్లు స్పష్టమవుతుంది. స్త్రీ పురుషుల సృష్టికి సంబంధించిన కాలాన్ని, కార్య విధానాన్ని రెండు ఉల్లేఖనాలూ రెండు రకాలుగా ప్రతిపాదిస్తున్నవి. .." బై. బం. అసంబద్ధాలు, పేజీ. 47.

అసంబద్ధమంటూ మన మిత్రుడు పైన కోట్ చేసిన లేఖనాలకు వివరణ యిదట! రచనలు చదవటానికి చేతైనవారు ఎవరైన యిలాంటి తప్పుడు వ్యాఖ్యానాలకు నవ్వుతారని కూడా మన మిత్రుడు ఆలోచింపకుండ యిలా మాట్లాడాడు. అందులో ముఖ్యంగా అతడు తాను విమర్శిస్తున్న గ్రంథం యొక్క తలా తోకా రెండూ తెలియనివాడనే చెప్పాలి. దీన్ని తన “వక్తవ్యం"లో యిలా వివరించుకున్నాడు, చూడు: "బైబిలు చాల పెద్ద గ్రంథం. ఒక పట్టున చదవటానికి సామాన్యంగా వల్లపడేది కాదు. దానికితోడు రచనా విధానం యే భాషా యెరుగని క్రొత్త శైలిలో ఉంటుంది" - బై బం. పేజీ. 6.

     "బైబిలు భాషా శైలి నాకు తెలియదు” అనలేక ఆ భావాన్ని వంకరగా ఇలా మన మిత్రుడు వ్యక్తపరచాడు. అయినా భాషా శైలి తెలియనివాడు తెలిసినట్టు మాట్లాడవచ్చునా? అలా మాట్లాడ తెగించాడు గనుకనే పై లేఖనాల మధ్య అసంబద్ధముందంటాడు! అంతకంటే తన మాటల్లో ఉన్న పాండిత్యమేమీ లేదు.

     టి. వి. లేక రేడియో వార్తల భాషా శైలిని చదువరి ఎప్పుడైనా గమనించి ఉంటాడా? వార్తలు చదవకముందు, వ్రాయబడిన ఆ వ్యాసాన్ని చూచే అవకాశం నీకు దొరికితే, ఒకసారి చూడు! అందులో ముందుగా హెడ్లైన్స్ వ్రాయబడి ఉంటాయి. ఆ తరువాత తిరిగి ఒక్కొక్క హెడ్లైన్ చెప్పబడుతూ, వివరించబడుతూ ఉంటుంది. ముందు హెడ్లైన్ వినగానే అది అయిపోయినట్లు; రెండో హెడ్లైన్తో ఈ విషయం అయిపోయినట్లు; ఆ తరువాత వచ్చే వివరణతో కాలకర్మాలకు ఏదో గతిపట్టినట్టు తలంచేవాడు ఎలాటివాడో, మన మిత్రుడు కూడా అలాంటివాడే!

     ఆదికాండం హెబ్రీ ప్రసంగ శైలిలో వ్రాయబడింది. అది ప్రసంగ శైలి గనుక, ముందు ఓ విషయాన్ని పరిచయం చేసి, ఆ తరువాత ఆ విషయాన్ని వివరించడం జరుగుతుంది. ఇలాటి వివరణలో మేజర్, మైనర్ పాయింట్లు, సబ్ పాయింట్లు కూడా ఉంటాయి, అవసరాన్ని బట్టి పాయింట్లు రిపీట్ కూడా చేసే అవకాశముంటుంది. ఇలా జరిగిన సందర్భాల్లో కాలానికి, కర్మలకు గతులు పట్టవు. ఆదికాండం (రచనా) శైలి యిలాటిదని రుజువు చేయడానికి యింకో ఉదాహరణను చూపుతాను చూడు.

    ఆదికాండం నాల్గవ అధ్యాయంలో ఆదాము హవ్వలకు కయీను, హేబెలు అనే యిద్దరు కుమారులు కలిగినట్టు, వారు పెద్దవారై దేవునికి అర్పణలు తెచ్చినట్టు, ఆయన హేబెలు అర్పణను లక్ష్యపెట్టి, కయీనుది లక్ష్యపెట్టనట్లు; చివరకు కయీను హేబెలును చంపినట్లు, దానికై అతడు శపింపబడినట్లు; ఆ తరువాత; ఏదెనుకు తూర్పున భార్యతో కాపురమున్నట్టు వగైరా వగైరా సంగతులు వ్రాయబడ్డాయి. అంటే రచయిత తాను యివ్వదలచుకొన్న వార్తల్లో కయీనును గూర్చిన సమాచారాన్ని తెలియజేసాడన్నమాట. ఆ రచన కాలక్రమంలో వ్రాయబడలేదు. గనుక కయీను, హేబెలుల సమాచారం ముగించి, తిరిగి ఆ రచయిత, తాను చెప్పదలచుకున్న అసలు విషయాన్ని మొదటనుండి ప్రారంభిస్తాడు.

    గనుక 5వ అధ్యాయానికి వచ్చావనుకో, తిరిగి విషయం ఆదాము దగ్గరకే వస్తుంది. “ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతనిని చేసెను; మగవానిగను ఆడుదానిగను వారిని సృజించి వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము నూట ముప్పదియేండ్లు బ్రదికి తన పోలికెగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. షేతును కనిన తరువాత ఆదాము బ్రదికిన దినములు ఎనిమిది వందల ఏండు; అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల ముప్పది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను" (ఆది. 5:1–5).

    గనుక ఆ రచనలో ఏమి జరుగుతుంది? ముందు పాయింటును పరిచయం చేస్తున్నాడు. ఆ తరువాత దానికి సంబంధించిన విషయాలు పరిష్కారంగా వివరిస్తున్నాడు. ఇలా విషయం అంశ క్రమంలో వివరించబడిందేగాని, కాలక్రమంలో వివరించబడింది కాదు. అంశ క్రమంలో వివరింపబడిన సంగతులను కాలక్రమానికి ముడివేయడం అవివేకం. ఈ అవివేకాన్నే మన మిత్రుడు జ్ఞానమంటున్నాడు. గనుక వాస్తవంగా అతడన్నట్టు - నరనారీ కాలకర్మాలకు ఏ గతి పట్టలేదు. మన మిత్రుని హేతువాదానికి విపరీతమైన బుద్ధి పుట్టింది.
3. కొడుకా? మనుమడా?
అర్పక్షదు ముప్పదియైదేండ్లు బ్రతికి షేలహును కనెను. ఆది. 11:12,

షేలహు కెయినానుకు, కెయినాను అర్పక్షదు . . . . కుమారుడై యుండెను. లూకా, 3:36,

      గమనిక: బైబిలు దేవుని గ్రంథమని చెప్పుకున్నా దాని రచన మాత్రం మానవులచే మానవ భాషల్లోనే దాఖలు చేయడింది. ఈ వాస్తవాన్ని బైబిలును విమర్శింప బూనుకున్న మన మిత్రుడు ఎరుగనట్టున్నాడు. ఒకవేళ ఎరిగినా, దాన్ని యిక్కడ మరచినట్టున్నాడు. అది ఎలాగున్నా మానవ దోషం (human error) కాపీ చేయడంలోనో లేక తర్జుమా చేయడంలోనో యీలాటి చోట్ల తొంగి చూచిందంటే ఆశ్చర్యపడనక్కరలేదు. మానవ దోషాన్ని దేవుని మీదనో లేక ఆయన గ్రంథం మీదనో రుద్దడం తప్పు.

      చదువరి తాను వ్రాసేటప్పుడు కాని, లేక దేనినైన చూచి కాపి కొట్టేటప్పుడు గాని - తన వ్రాతలో తానే దోషాలు చూచి ఉండడా? అలా కన్పించే దోషాలనే "మానవ దోషాలంటారు” (human errors). ప్రింటింగులో జరిగేవాటిని Printer's Devils అని అంటారు. ఇలాటివి రచయిత భావాన్ని ఉద్ధేశాన్ని కొంతవరకు మార్చినా, వాటిగుండా రచయిత మనస్సును అతని సంకల్పాన్ని తేటగా గుర్తించవచ్చు! ఇలాటి మానవ దోషాలు పై రచనల్లో దొర్లాయంటే వింతలేదు.

       అది అలా జరగడానికి అవకాశమున్నా దాని ముచ్చటి ప్రక్కనుంచి, బైబిల్లో వంశావళుల విషయం ఎలా ఉందో చూద్దాం: తరాలతో నిమిత్తం లేకుండ, ఒకానొక వంశంలో పుట్టినవాడెవడైనా ఆ వంశ పితకు కుమారుడుగా వ్యవహరించబడడం యూదులకు వింత కాదు (2 దినవృ. 36:1-21). వారి మధ్య చెలామణిలో ఉన్న యిలాటి వ్యవహారికాన్ని బట్టే, మత్తయి తన రచనను పరిచయం చేస్తూ - “అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి"యని ప్రారంభించాడు (మత్తయి 1:1).

      అయినా, బైబిలు సందేశం కేవలం అందులోని వంశావళుల మీదనే ఆధారపడి యుండలేదు. అంతేకాదు, “కల్పనా కథలు, మితములేని వంశావళులు విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో గాక” వివాదంతోనే పొత్తు కలిగి ఉంటాయనీ, గనుక వాటిని లక్ష్యపెట్టవద్దనీ బైబిలే ప్రబోధిస్తుంటే (1 తిమోతి 1:3-4), ఆ వంశావళులనే పట్టుకొచ్చి, వివాదాంశంగా మార్చిన మన మిత్రుని ఏమనుకోవాలో కూడా తోచడం లేదు! ఇది ఎంత విడ్డూరమైన విమర్శంటావ్!

     ఏ కోణంనుండి చూచినా మన మిత్రుని ప్రశ్నలకు మద్దత్తు జ్ఞానయుక్తమైన పరిశీలననుండి లభించలేదు. మానవ దోషం (human error) వలనగాని, యింకో రూపంగా గాని వంశావళుల పట్టికలో దొర్లిన పొరపాట్లవలన - బైబిలు సందేశానికి గాని, దేవుడు మానవునికి బయలుపరచనుద్దేశించిన తన సంకల్పానికి గాని ఏ రూపంలోను కళంకం ఏర్పడలేదు. ఇలాటివాటిని అసంబద్ధాలుగా ఎంచడం - అసంబద్ధమనే పదానికి అర్థం తెలియదని రుజువు చేసికొనడమే ఔతుంది. అయినా తాను వాడిన పదాలకు తనకే భావం తెలియదని రుజువు చేసికొనే మన మిత్రుని విమర్శ ఏపాటి విమర్శయని అంటావ్?
4. 75 లేక కనీసము 135 - ఏది ఖాయం?
     అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు డెబ్బదియైదేండ్ల యీడు గలవాడు. ఆది. 12:4

     తెరహు డెబ్బదియేండ్లు బ్రతికి అబ్రాహామును, నాహూరును, హారానును కనెను. ....తెరహు బ్రతికిన దినములు ఇన్నూటయైదేండ్లు. ఆది. 11:26, 32.

     అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడ (హారాను)నుండి మీరిప్పుడు కాపురమున్న యీ దేశమందు నివసించుటకై దేవుడతనిని (అబ్రామును) తీసికొని వచ్చెను. అపొ. 7 4.
     (తండ్రి చనిపోవునాటికి అనగా అబ్రాము హారాను నుండి బయలుదేరు నాటికీ అతనికి కనీసం (205-70) = 135 యేండ్లు]

గమనిక: కొన్నిసార్లు మనుష్యుడు చూచి వ్రాస్తున్నాననుకున్నా తన మనస్సులో ఉన్న పదాలనే వ్రాస్తాడు. ఆది. 11:26, 32ను కోట్ చేస్తూ (పేజీ 48) “అబ్రామును" అని వ్రాయడానికి బదులు “అబ్రాహామును" అని మన మిత్రుడు వ్రాసాడు. మరికొన్నిమార్లు చెరిగిన పదాలు సమస్య కావచ్చు. ఈ పేజీలోనే అపొ. 7:4 అని వేయబోయే దానికి బదులు ";" చెరిగిపోవడం వల్ల, 7:4 అనేది 7 4గా పడింది. ఇవి మాత్రమే కాదు మన మిత్రుని రచనలో యిలాటివి ఎన్నో దొర్లాయ్! అలాటి కొన్నింటిని తరువాత మరల చూద్దాం. అయితే ఒక మాట! ఇలాటివాటిని రచనలోని లోపాలుగా ఎంచేది హేతువాదం కానేకాదు. దాన్ని అలా ఉంచి యిక్కడ మన పాయింటుకు తిరిగి వద్దాం.

     1. "తెరహు డెబ్బది యేండ్లు బ్రతికి అబ్రామును, నాహూరును, హారానును కనెను ..." అని అనడంలో - తెరహు 70 ఏండ్ల ప్రాయంలో బిడ్డలను కనడానికి ఆరంభించాడనీ; అప్పటినుండి అతనికి ముగ్గురు కుమారులు పుట్టారనీ, వారిలో హెబ్రీయులకు పితామహుడైన అబ్రాహాము ఒకడని సూచించేదే దాని ఉద్దేశం. అంతేగాని తెరహుకు సరిగ్గా 70 ఏండ్ల ప్రాయం వచ్చినప్పుడు - అతడు అబ్రామునే కన్నాడన్న నిర్దిష్టమైన భావం లేఖనంలో లేదు. అయినా, బైబిల్లోని ఈ భాగంలో చెప్పనుద్దేశించింది - అబ్రాహామును, అతని సంతానాన్ని గూర్చియే గనుక యిక్కడ అతని పేరు ముందుగా ప్రస్తావించడం సహజంగా జరిగింది.

     2. “తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రామును, నాహూరును, హారానును కనెను” అని అనడంలో - తెరహు ఆ ముగ్గురిని ఒకే ఏట (ఒకేసారి) కన్నాడన్న భావం కూడా లేదు. అయితే సమస్యలేని చోట సమస్యలను చూపగోరి - బైబిల్లో ఏది ఉద్దేశింపబడలేదో అదే ఉద్దేశింపబడినట్లు మన మిత్రుడు ప్రశ్నించాడు. లేకపోతే పై లేఖనాల్లో ఈలాటి ప్రశ్నలకు తావులేదు. ప్రాచీన రచనలను గ్రహించగల జ్ఞానం మన విమర్శకునికి లోపించినట్టే తన రచనలో కన్పిస్తుంది. అందుకే అతనికి యిలాటి ప్రశ్న వచ్చియుంటుంది.

     3. తెరహు చనిపోయే సమయానికి అతని వయస్సు 205 యేండ్లు! ఆ సమయానికి అబ్రాహాము రమారమి 75 ఏండ్లవాడు. అంటే అబ్రాము తెరహుకు నూటముప్పై ఏండ్ల ప్రాయంలో (205-75=130) పుట్టి ఉంటాడని తేలుతుంది. అబ్రాము తెరహు కుమారులలో పెద్దవాడు కాడని కూడా పరిశీలించి తెలిసికోవచ్చు.

     తెరహు కుమారులలో హారాను జ్యేషుడుగా కన్పిస్తాడు. హారాను లోతును అతని తోబట్టువులను (మిల్కా ఇస్కా అనువారిని) కంటాడు. అంతేగాక, అతడు (హారాను) తన తండ్రి కంటె కూడా ముందే మరణిస్తాడు. అతడు చనిపోయిన తరువాతనో, ఏమో అబ్రాము నాహూరులు వివాహితులౌతారు. నాహూరు వివాహం చేసికొన్నది తన అన్నయైన హారాను కుమార్తెనే! పైగా అబ్రాము నాహూరులు ఒకేసారి పెండిండ్లు చేసికొన్నట్టుంది. అంటే - తన అన్న కుమార్తెకు పెండ్లి వయస్సు వచ్చేవరకు అబ్రాము వివాహితుడు కాకపోతే, తెరహు కుమార్లలో అబ్రాము జ్యేషుడు అయ్యే అవకాశం లేదు. అలాటప్పుడు 75? లేక కనీసము 135? ఏది ఖాయం? అనే ప్రశ్నకు అర్థం లేదు. ఒకవేళ దానికి అర్థముందన్నా బైబిలు సందేశాన్ని అది వెలితిపరచలేదు; లేదు!! అయినా బైబిలు మీద హేతువాదం వేసే ప్రశ్నలు యిలాటివేనా? కొండను త్రవ్వి ఎలుకను పట్టేదేనా మన మిత్రుని హేతువాదం.
5. స్వాస్థ్యమా? స్వాధీనమా? ఏది కాదా?
     నీకును, నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశివైయున్న దేశమును అనగా కనానను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా యిచ్చి వారికి దేవుడనై యుందునని అతని (అబ్రాము)తో చెప్పెను. ఆది 17:8

     ఆయన (యెహూవా) యిందులో అతనికి (అబ్రాముకు) పాదము పట్టునంత భూమియైనను స్వాస్థ్యముగా యీయక అతనికి కుమారులు లేనప్పుడు అతనికిని,
అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీన పరతునని అతనికి వాగ్దానము చేసెను. అపొ. 7:5.

     వీరందరు (అబ్రాము సంతతివారు) ఆ వాగ్దాన ఫలమనుభవింపక పోయినను దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమిమీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పుకొని విశ్వాసము కలవారై మృతి నొందిరి. హెబ్రీ. 11:13.

     గమనిక: బైబిలుకు ఎవడు వకాల్తా పలుకనవసరం లేదు. లేక ఎవడూ దాని ఉపదేశం ఒక రూపంగా ఉంటే - యింకొక రూపంగా చూపనవసరం అంతకంటే లేదు. హేతువాదమనేది నిష్పక్షపాతంగా, ఒక విషయాన్ని నిజాయితీగా పరిశీలించేది కాదా? అలాటి పరిస్థితి హేతువాదినని చెప్పుకున్న మన మిత్రుని విమర్శలో ఉండనవసరం లేదా? మరి అలాటిది ముచ్చకైనా కన్పించదేమి? ఆ సంగతి ఎలాగున్నా పై లేఖనాలను కోట్ చేస్తూ మన మిత్రుడు వేసిన ప్రశ్నలకు చదువరి భ్రమపడి - బైబిల్లో ఏదో తప్పుందని అనుకో పని లేదు. పై లేఖనాలను ఆయా సమయ సందర్భాల నుండి లాగి, తన కిష్టమొచ్చినట్లు మన మిత్రుడు వినియోగించాడే గాని, వాటిని క్రమంగా వినియోగించలేదు. ఇలా చేసేవాడు హేతువాది
ఔతాడా? అయినా, మన మిత్రుని హేతువాదం అదేనేమో!

     (1) తాను కోట్ చేసిన రెండో లేఖనం అపొ. 7:5 గదా? దాని కాలాన్ని గమనించి చూడు! బైబిల్లోని ఆది. 15:13-21 సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని అది ప్రయోగించబడింది. ఎలాగంటావేమో! అపొ. 7:6–7లను చూస్తే, అక్కడ ఆది. 15:18– 16లు సూచింపబడ్డాయి చూడు!! (2) మన మిత్రుడు కోట్ చేసిన మొదటి లేఖనం, అంటే 17:8 అనేది తాను రెండవదిగా కోట్ చేసిన (అపొ. 7:5) దానికి తరువాతదే. అంటే యిక్కడ మన మిత్రుడు చేసిన కిటుకు నీకర్ధమయ్యిందా? పై రెండు లేఖనాల్లో వెనుకది ముందు, ముందుది వెనుక పెట్టాడు. (3) తాను కోట్ చేసిన మూడవ లేఖనం! హెబ్రీ. 11:13, బ్రాకెట్లలో మన మిత్రుడు తగిలించిన లేక సూచించిన భావం బైబిల్లోది మాత్రం కాదు. వాస్తవాలను అపార్థం చేయడానికి హేతువాదియైతే యింత ప్రసవవేదన పడతాడా? ఇలా ప్రయాసపడేవాడే హేతువాదియా?

     బైబిలుకు ఏలాటి వకాల్తా పలుకకుండ, కేవలం ఒక పరిశీలకుడుగా పై లేఖనాలను వాటి సందర్భాలలో ఆలోచిస్తే, వాటి క్రమమైన రూపమేమంటే; దేవుడు ఆది. 15లో అబ్రామునకు ప్రత్యేకంగా (తాను సంతులేనివాడుగా ఉన్న దినాల్లో) ప్రత్యక్షమై, అతనికి సంతానం నిశ్చయంగా కలుగుతుందనీ, అతని సంతతివారు తరతరాలుగా కొనసాగు తారనీ, అతని సంతతిలో నాల్గవ తరం తరువాత వారే, తాను (అబ్రాము) అప్పటిలో నివసిస్తున్న కనాను దేశానికి వచ్చి, అక్కడ అప్పటికి నివసిస్తున్న జనములను పారద్రోలి, లేక హతం చేసి, దాన్ని స్వాధీనం చేసికొంటారని సూచించాడు. అయినా దానికి ముందు వీరు వేరొక (ఐగుప్తు) దేశం వెళ్లి, నివసించి, అక్కడ వారికి (ఐగుప్తీయులకు)దాసులౌతారనీ; వీరు వారిచేత హింసపెట్టబడతారని, ఆ తరువాత వీరు (అబ్రాము సంతతివారు) ఆ దాస్యంనుండి విడిపింపబడతారని అలా విడిపింపబడినవారి ద్వారానే ఈ వాగ్ధానం నెరవేర్చబడుతుందనీ దేవుడు అబ్రాముకు ప్రవచన రూపంగా తెలియజేసాడు. అపొ. 7:5-7లో చర్చింపబడింది యిదే! (దానికి ఆది. 15:13–21ని పోల్చి చూడు). అయినా బైబిల్లో ప్రవచనాలు లేవనే అపోహలో ఉన్నవానికి ఈ సంగతులు ఎలా అర్థమౌతాయి?

     ఈ చర్చకు సమయ సందర్భాలేవంటే: దేవుడు - అబ్రాము యొక్క బహుమానం అత్యధికమగుతుందని తెలియజేస్తాడు. అందుకు అబ్రాము - తాను సంతులేనివాడననీ,
సంతానం లేకుండా తనకేమి యిచ్చినా లాభమేముందనీ; తన సేవకుడే తన యింటి ఆస్తికి కర్త అవుతాడు గదా? అని అతడాలోచించే సమయంలో అతనికి తెలియజేయబడిన
వర్తమానమిది! వెనుక ముందులు ఆలోచిస్తే ఉన్న వాస్తవాలు యివి!

     కొంత కాలం గడిచింది. బహు భార్యత్వం సమస్య లేకుండా ఉన్న సమాజంలో అబ్రాము, శారాయిలు బ్రతుకుతున్నారు. గొడ్రాలననే వేదన శారాయిలో భరించరాని రూపు ధరించింది. దేవుడు వాగ్దానం చేసిన రూపంలో కాకుండా, వేరే విధంగా సంతాన లేమిని తీర్చుకోవాలనే నిర్ణయానికి ఆ దంపతులు వచ్చి చేరుకున్నారు. గనుక శారాయికి పనికత్తెగా ఉన్న హాగరును తన భర్తకు ఉప పత్నిగా ఆమె యిస్తుంది. అబ్రాముకు హాగరు ద్వారా కుమారుడు కలుగుతాడు. అయినా తాము తలంచినట్టుగా వారి సమస్య పరిష్కారం అయ్యేదానికి బదులు సమస్య మరొక కోణంనుండి బయలుదేరింది. అదెలాగున్నా హాగరువలన అబ్రాముకు పుట్టిన ఇష్మాయేలు మూలంగా దేవుడు అబ్రాముకు తన వాగ్దానాలను నెరవేర్చ బూనుకున్నాడా? లేదు. (ఈ ప్రశ్న ఆది. 17లో చర్చించబడింది).

     అబ్రాము పేరు అబ్రాహాముగా మార్చి, ఎనిమిదవ దినాన సున్నతి పొందినవాడే తన సంతతియని సూచిస్తూ, వారి (అబ్రాము శారాయిల) సొంత ఏర్పాటువలన పుట్టిన ఇష్మాయేలును అతని వాగ్ధాన సంతానంగా నిరాకరించి, గర్భముడిగిన శారావలన పుట్టినవాడే అతని సంతానమౌతాడనే సందర్భంలో ఆది. 17:8 ప్రయోగింపబడింది. సందర్భ రహితంగా రచనలను ముడివేసేవాడు, సమాజంలో తంటాలు పెట్టవానితో సమానుడే.

     ఆది. 15:13–21లో అబ్రాము సంతతికి కనాను దేశాన్ని స్వాధీనం చేస్తానని వాగ్దానం చేసిన సుమారు - 15 సంవత్సరాల తరువాత మరల ప్రత్యక్షమై, ఆ వాగ్ధాన భూమిని, వాగ్ధాన సంతానానికి మాత్రమే యిస్తానని సూచించడానికి ఆయన “-నీకును, నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశివైయున్న దేశమును అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా యిచ్చి వారికి దేవుడనై యుందునని అతని (అబ్రాము)తో చెప్పెను." ఇదీ 17:8లోని సందేశం!

     మన మిత్రుడు తాను చదివినదాన్ని గ్రహించలేక, లేనివాటిలో సమస్య ఉందంటున్నాడే గాని, నిజంగా వాటిలో సమస్య లేదు. మనం చర్చించిన లేఖనాలు ఒకదానితో నొకటి ఎంత సన్నిహితంగా కూర్చబడ్డాయో యిప్పుడు చూచావు కదూ? సమస్య లేఖనాలది కాదు; అది మన మిత్రుని పాండిత్యానిదే! ఇకపోతే మూడో లేఖనాన్ని హెబ్రీ. 11:13నుండి కోట్ చేస్తూ, ఆ రచన చెప్పని, ఉద్దేశింపని భావాన్ని (మన మిత్రుడు) బ్రాకెట్లలో యిరికించాడు. దాన్ని గుర్తించావా? సమస్యలు సృష్టించడానికి అతడిలా చేస్తాడు. అది అతని వాడుకయే! లేనివాటిని కల్పించి సమస్యలను సృష్టించడమే మన మిత్రుని వాస్తవ వాదం!

     పై రెండు లేఖనాల్లో తేలిన వర్తమానాన్ని బట్టి - వాగ్ధానం ఎనిమిదవ దినాన సున్నతిపొందిన “వాగ్ధాన” సంతతికి మాత్రమేననీ; అది (అమోరీయుల అక్రమం పరిపూర్ణమైన తరువాత) అంటే, అబ్రాహాము సంతతిలో నాల్గవ తరానికి ముందు అది నెరవేర్చబడదనీ; అదైనా ఐగుప్తు దాస్యంనుండి తిరిగి రప్పింపబడినవారికేననీ (ఆది. 15:13-16ను తిరిగి చూడు కావాలనుకుంటే) గుర్తించాం పరిస్థితులు అబ్రాహాముకు యిలా వివరించబడి యుండగా, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు దేవుని వాగ్దానాలను విశ్వాసంతో అంగీకరించి, ఎలా తమ జీవితాలను గడిపారో సూచించేదే హెబ్రీ. 11:13లోని ఉద్దేశం! అంతేగాని దేవుడు అబ్రాహాముతో చేసిన వాగ్దానాలను నెరవేర్చలేదని మన మిత్రుడు చెప్పనుద్దేశించినట్టు బైబిల్లో లేదు (తన బ్రాకెట్లలోనిది బైబిల్లో లేని భావమే)

     పైగా "వీరందరు" అని హెబ్రీ. 11:13లో ప్రయోగింపబడిన “పదం" మన మిత్రుడు తప్పుగా వ్యాఖ్యానించాడు. అబ్రాహాము సంతతి వారినందరిని సూచించడానికి అది ప్రయోగింపబడింది కాదు. "వీరందరు" అనేది అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులనేవారిని, అంటే వాగ్దత్త దేశంలో పరవాసులై ఉన్నవారిని సూచించేది మాత్రమే (హెబ్రీ. 11:8-9 చూడు). ఇదే దాని సందర్భం!

     "వీరందరు (అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులనువారు) ఆ వాగ్ధాన ఫలము అనుభవింపలేక పోయినను, దూరమునుండి చూచి (ఆ వాగ్దానాన్ని తమ సంతతివారు అనుభవిస్తారని భావించి) వందనము చేసి, తాము భూమిమీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పుకొని, విశ్వాసము గలవారై మృతినొందిరి" (హెబ్రీ. 11:13). "... అయితే దేవుడు అబ్రాహామునకు అనుగ్రహించిన వాగ్ధాన కాలము సమీపించిన కొలది ." (అపొ. 7:6-17; నిర్గమ. 2:23–25) ఆయన ముందుగా చెప్పినట్టే సంగతులు జరిగాయని బైబిలు స్థిరపరచింది. గనుక బైబిల్లో పరస్పర వైరుధ్యాలు లేవు. ఒకవేళ అలాటివి ఉన్నాయనుకుంటే తెలిసి తెలియని మాటలు పలికే మన విమర్శకుడులాంటివారు అనుకోవలసిందేగాని, జ్ఞానిగా పరిశీలించినవాడెవ్వడూ బైబిల్లో అసంబద్ధాలున్నాయని భావించడు. అలాటి భావనకు బైబిల్లో తావు గాని, ఆధారం గాని లేదు.
6. యాకోబు సంతానం ఎందరు?
    యాకోబు కోడండ్లను వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తుకు వచ్చిన వారందరూ అరువది ఆరుగురు. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులు యిద్దరు. ఐగుప్తుకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరు డెబ్బదిమంది. ఆది. 46:26, 27.
    యోసేపు తన తండ్రియైన యాకోబును, తన స్వజనులందరిని పిలువ
నంపెను. వారు డెబ్బదియైదుగురై యుండిరి. అపొ. 7:14, [కాని నిర్గ. 1:5 పై రెండింటికి విరుద్ధంగా 'యాకోబు గర్భమున పుట్టిన వారందరు డెబ్బదిమంది; అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను' అంటున్నది).
 
     గమనిక: పై లేఖనాల్లో సమస్య వచ్చే ఏ కారణము కన్పించడం లేదు. - లేఖనాల్లో వ్రాయబడినవి వ్రాయబడినట్టే జాగ్రత్తగా గుర్తించితే సమస్య ఉండదు. అయితే మన మిత్రుని ప్రశ్న- రచనలను చదవటానికి చేతగానివానికి వచ్చే ప్రశ్నయే! అంతకంటే అందులో చెప్పుకోదగ్గ విశేషమేమి లేదు. పై లేఖనాలు మూడు కోణాలనుండి యివ్వబడ్డ లెక్కలు మాత్రమే! అవన్నీ ఒకే కోణంలో చెప్పబడ్డవి కావు, చదువుతుంటే ఈ సంగతి తెలియడం లేదా? అవేవో చూపుతాను చూడు. తేలికగా సంగతులు గ్రహించడానికి అపొ. 7:14 మొదట; నిర్గమ. 1:5 తరువాత ఆది. 46:26, 27 అటు తరువాత చూద్దాం. ఇలా చూచేది తేలికగా అర్థం చేసుకోడానికి మాత్రమే! మాటలను చదువు!

    1. అపొ. 7:14 - యోసేపు కోణంనుండి చూపించబడింది సుమీ! యోసేపు యాకోబును (1 + తన స్వజనులందరిని పిలిపించెను). యోసేపు యొక్క స్వజనమంటే - యాకోబు గర్భవాసమున పుట్టినవారే కావలసిన అవసరంలేదు. (ఇలా పిలిపించిన వారిలో యోసేపు కుటుంబము మాత్రం సహజంగానే చేర్చబడదు) + పైగా కనానులో చనిపోయిన యూదా యిద్దరు కుమారులు సయితం యిందులో చేర్చబడలేదు. ఈ సంగతి నిర్గమ. 1:5లో తేటగా చూద్దాం. అయితే యిక్కడ యోసేపు ఐగుప్తుకు పిలిపించుకొన్న అతని స్వజనం - అంటే, యాకోబుతో సహా (1 + వచ్చిన యోసేపు స్వజనం = 75).
   ఉదా: రాజా పొలంలోనుండి తోలుకొని వచ్చిన
                               ఎడ్లు  + ఆవులు - మొత్తం                     75
    రాజా పొలంనుండి తోలుకు వచ్చిన ఎడ్లు మొత్తం     –66 
    మినాయించిన ఆవులు                                                      9
        అలాగే - ఐగుప్తుకు "పిలువనంపిన" యోసేపు స్వజనం - అంటే, అతని తండ్రి యాకోబు + అతని అన్నదమ్ములు + వారి భార్యలు + పిల్లలు మొత్తం = 75 గురు. అపొ. 7:14లోని సమాచారమిదే! యిందులో సమస్య లేదు.

ఇప్పుడు నిర్గమ. 1:5కు వెళదాం. ఇది యాకోబు కోణంనుండి చూపింపబడింది.

2. నిర్గమ. 1:5లో -యాకోబు గర్భవాసమున పుట్టిన వారందరు =70 మంది.
- యాకోబుకు ముందు ఐగుప్తులో ఉన్నవారు అంటే యోసేపును అతనికి అక్కడ పుట్టిన యిద్దరు కుమారులు (1+2) యాకోబు గర్భవాసమున పుట్టినవారే!  = 3

యాకోబు గర్భవాసాన పుట్టి, ఐగుప్తుకు రాకుండానే చనిపోయిన యూదా కుమారుడు ఏరు (రూతు 4:12) [వివాహితులైతే, చనిపోయినవారి పేర్లు ఇశ్రాయేలీయులలోనుండి కొట్టివేయబడవు - ఆది. 46:12; ద్వితీయో, 25:5, 6; రూతు 4:7-14 చూడు] = 1

ఆ నియమాన్ని అతిక్రమించిన ఓనాను లెక్కించబడడు యాకోబుతో ఐగుప్తుకు వచ్చినవారందరు [నాతో వచ్చిన ముగ్గురంటే - నేను గాక యింకా ముగ్గురు వచ్చారని అర్థం] = 66 
యాకోబుతో వచ్చినవారంటే యాకోబు కాక వచ్చినవారు ∴ యాకోబు గర్భవాసమున పుట్టినవారందరు = 70

     నిర్గమ. 1:5లో సమాచారమిదే! ఇందులో సమస్య లేదు, ఇక ఆది. 46:26, 27కు వెళదాం.
3. ఆది. 46:26, 27లో - ఐగుపుకు వచ్చిన యాకోబు కుటుంబీకుల లెక్క ఇందులో కొన్ని మినాయింపులు జరిగాయి చూడు: (ఎ) యాకోబు కోడండ్లు మినాయించ బడ్డారు. (బి) ఐగుప్తుకు రాని యూదా కుమారులు ఏరు, ఓనాను అను యిద్దరు మినాయించబడ్డారు (రూతు 4:12)

     ఇందులో చేర్పులున్నాయి చూడు: "ఐగుప్తుకు వచ్చిన యాకోబు కుటుంబికులు - యోసేపు + అతని యిద్దరు కుమారులు + యాకోబు ఈ లెక్కలో చేర్చబడతారు. యాకోబు చేర్చబడకుండ అది యాకోబు కుటుంబమని ఎలా పిలువబడుతుంది? గనుక యిక్కడ ఏమి జరిగిందో చూడు.

     - యోసేపు + అతని యిద్దరు కుమారులు యాకోబు కుటుంబపు వారే = 3
        యాకోబు యాకోబు కుటుంబపవారిలో చేరినవాడే = 1
        యాకోబు గర్భవాసాన పట్టి అతనితో ఐగుప్తుకు వచ్చినవారు = 66
         మినాయింపులు పోను - ఐగుప్తుకు వచ్చిన యాకోబు కుటుంబీకులు = 70

గనుక బైబిల్లో సమస్య లేదు. అది మన మిత్రుని చదువు సమస్యే! బైబిలు దేవుని గ్రంథం.

7. సమాధి యె క్కడ? స్థలమెవరిది?
     అతని (యాకోబు) కుమారులు కనాను దేశమునకు అతని శవమును తీసికొనిపోయి మక్పేలా పొలమందున్న గుహలో పాతిపెట్టిరి, దానిని ఆ పొలమును అబ్రాహాము తనకు స్మశానము కొరకు స్వాస్థ్యముగానుండు నిమిత్తము మమ్రే యెదుట హిత్తియుడయిన ఎఫ్రాను యొద్ద కొనెను. ఆది. 50:13

    యాకోబు ఐగుప్తుకు వెళ్లెను. అక్కడ అతడును మన పితరులును చనిపోయి
అక్కడనుండి షెకెముకు తేబడి, షెకెములోని హమోరు కుమారుల యొద్ద అబ్రాహాము వెలయిచ్చికొనిన సమాధిలో ఉంచబడిరి. అపో, 7:15, 16.

గమనిక: ఈలాటి సందర్భాలను చూపుతూ, విషయాలు పరిష్కారంగా తెలిసికోలేనివాడని మన మిత్రుడు తనకు తానే రుజువు చేసికొంటున్నాడు గాని, బైబిల్లో మాత్రం ఏ సమస్య లేదు. పై రెండు రచనలు ఒకే స్థలాన్ని గూర్చి వేర్వేరు వివరాలు యిచ్చాయి. బైబిలును చదువుకునేవారు ఆ స్థలాన్ని బాగా గుర్తించడానికి, లేఖకులు యిచ్చిన వివరాలు ఎక్కువగా సహాయ పడతాయి. ఈ రచనల్లో ఆ స్థలాన్ని గూర్చి యిచ్చిన కొన్ని వివరాలను
చూద్దాం.
1. దేశం - కనాను దేశం
2. గ్రామం - షెకెము
3. స్థలం - మాక్పేలా పొలమున్న గుహ
4. అంతకు ముందు అది -- హిత్తీయునిది
5. అతని పేరు - ఎఫ్రోను
6. అతని తండ్రి పేరు - హమోరు
7. దాన్ని కొన్నవాడు - అబ్రాహాము *
8. కొన్న ఉద్దేశం - స్మశాన స్వాస్థ్యం
9. స్థలం యొక్క విశేషం - మమ్రే యెదుట- ఎండవేళ అబ్రాహాము ఆది. 18; వగైరా: గుడారం వేసికొని కూర్చున్నాడు. అతిథులకు ఆతిథ్యమిచ్చాడు - శారాను పాతిపెట్టాడు.

విమర్శనాత్మకంగా సంగతులను ఆలోచిస్తే, సమాధి ఎక్కడ? స్థలమెవరిది అనే ప్రశ్నలకు అర్థం లేదనే చెప్పాలి. ఇలాటి ప్రశ్నలు బైబిలును విమర్శిస్తున్నాయని ఎంచడం, భ్రమించడమే అవుతుంది. వీటివలన బైబిలు సత్య గ్రంథమని రుజువెతుందని మన మిత్రుడు ఆలోచించియుంటే ఈ ప్రశ్నలను వేయకపోయి ఉంటాడనుకుంటా!
8. అహరోను మరణించిన, దెక్కడ?
     ఇశ్రాయేలీయులు కాదేషులోనుండి బ్రయులుదేరి ఏదోము దేశముకడనున్న హోరు  కొండ దగ్గేర దిగిరి యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరుకోండ నెక్కి ... మృతినొందేను.. వారు హోరు కొండనుండి బయలుదేరి సల్మానాలో దిగిరి. సల్మానాలో నుండి బయలుదేరి పూనూనులో దిగిరి. సంఖ్యా. 33:37-42,

     ఇశ్రాయేలీయులు యహకానీయులదైన బెయేరోతునుండి బయలుదేరి మోసేరుకు
వచ్చినప్పుడు అక్కడ అహరోను చనిపోయి పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఎలాజారు అతనికి ప్రతిగా యాజకుడాయెను. అక్కడమండి వారు గుద్గోదకును
గుద్గోదనుండి వీటివాగులుకల దేశమైన యొత్బాతాకును ప్రయాణమైరి, ద్వితీ. 10:6, 7.

     గమనిక: సంఖ్యా 33:37-42 ప్రకారం అహరోను చనిపోయిన స్థలం ఒక రకంగానూ; ద్వితీయో 10:6, 7లో అతని మరణం మరొక స్థలంలో సంభవించినట్టుగాను వ్రాయబడింది. ఇది తప్పు కాదా? అని మన మిత్రుడు అడుగుచున్నాడు. అయితే యిది విషయ పరిజ్ఞానంలేనివాని ప్రశ్నయేగాని, బైబిలు సమస్య మాత్రం కాదు; చూడు.

     ఉదా: నేను మద్రాసునుండి విజయవాడ వచ్చానన్నా లేక తమిళనాడునుండి ఆంధ్రా వచ్చానన్నా జనులు సమస్య లేకుండా అంగీకరిస్తారు. ఎందుకంటే - మద్రాసు తమిళనాడుకి; విజయవాడ ఆంధ్రాకు చెందిన ప్రాంతాలు. అలాటి పరిస్థితే యిక్కడిది కూడా! కాదేషు బెయేరేతుకు సంబంధించిన యహకానీయుల ప్రాంతం. అక్కడనుండి ఇశ్రాయేలీయులు ఎదోము దేశముగుండా ప్రయాణం సాగింపజూచారు. ఎదోము రాజు వారిని తన భూభాగం గుండా పోనియ్యలేదు (సంఖ్యా 20:14–21; ద్వితీయో. 10:6, 7).

      (తమిళనాడులోని మద్రాసునుండి) బయలుదేరి అన్నట్టు, బెయేరేతుకు సంబంధించిన కాదేషునుండి బయలుదేరి; ఎదోము దేశానికి కడనున్న మోసేరులోని హోరు కొండనెక్కి అహరోను మరణించాడు (సంఖ్యా 20:22-29). అతని కొరకు ఇశ్రాయేలీయులు ముప్పది దినాలు దుఃఖం సలిపారు. ఆ మీదట వారు గుధ్గేదుకు - గుధ్గేదునుండి నీటి వాగులుగల దేశమైన యొద్భాతాకు ప్రయాణమయ్యారు (ద్వితీయో. 10:6, 9).

     ఒకవేళ స్థలాలు, ప్రయాణ స్థలాలు వేరుగా చూపబడినా, కేవలం రెండు రచనల మధ్య వ్యత్యాసం కన్పించినంత మాత్రాన - వ్యత్యాసాలే పరస్పర విరుద్ధాలు కావు. గనుక అసంబద్ధమని వ్యత్యాసాలను చూపడం తప్పు. ("Mere difference in information cannot constitute a logical contradiction") మరణించిన స్థలం ఎక్కడని బైబిలు సూచించిందో అక్కడే అహరోను మరణించాడు. గనుక సమస్య లేఖనాల్లో లేదు; అది మన మిత్రుని విషయ పరిజ్ఞానంలోనే ఉంది.
9. యెహెూవా పేరు తెలియకపోతే ...?
    దేవుడు మోషేతో యిట్లనెను నేనే యెహోవాను; నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని. కాని యెహోవా అను నా పేరున నేను వారికి తెలియబడలేదు. నిర్గమ. 6:2, 3. 
     అబ్రాహాము ఆ చోటికి యెహోవా యీరే అని పేరు పెట్టెను. ఆది 22:14. 

      గమనిక: అబ్రాహాముకు యెహోవా అను పేరు తెలియకపోతే - అతడు ఆ స్థలానికి యెహోవా యీరే అను పేరు ఎలా పెట్టగలిగాడు? ఆ పేరుతో తెలియబడలేదని ఒక చోట తెలిసినట్టు మరొక చోట ఉండడం -బైబిల్లో అసంబద్ధం కాదా? అని మన మిత్రుడు ప్రశ్నిస్తున్నాడు. అయితే ఈ ప్రశ్న బైబిలు సందేశంలోని సమస్యవలన ఉద్భవించింది కాదు. నమ్మకాలతో నిమిత్తం లేకుండా, కేవలం సత్యాన్వేషులుగా, పరిశీలకులుగా, బైబిలును చూడగలిగితే ఈ సంగతి మనకు అర్థమౌతుంది చూడు.

    బైబిల్లో ప్రవక్తలున్నట్టు బైబిలు చెప్పుకొంది (ద్వితీయో, 18:15-18; 1 పేతురు 1:10). అయితే మన మిత్రుడు ఈ విషయంలో తొట్రిల్లాడు: తన అవతారిక పేజీ 22లో - బైబిల్లో ప్రవక్తలుగాని, ప్రవచనాలుగాని లేవని వాదించాడు; తన అసంబద్ధాల్లో ప్రవచనాలు, ప్రవక్తలున్నారని స్థాపించాడు. (32 మూగవాడి కేక - యెషయా 42:2) మన మిత్రుని నమ్మకం ఎలాగున్నా ప్రవక్తలున్నారని; అందులో ప్రత్యేకంగా అబ్రాహాము ప్రవక్తయని బైబిలు ఘంటాపధంగా మోగించింది (ఆది. 20:7).

     ప్రవచించినవాడు - ప్రవక్త అబ్రాహాం ఆ చోటికి "యెహోవా యీరే" అని పేరు పెట్టి, తాను ప్రవక్తయని రుజువు చేసికొన్నాడు (ఆది. 22:14), "ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి" (2 పేతురు 1:20-21).

     ప్రవక్తలు ప్రవక్తలుగా పలుకునప్పుడు - వారి నోటికే మాటలు అందింపబడుతాయో వాటినే పలుకుతారు గాని, పలికినవాని అనుభవానికో లేక వాని మనస్సుకో అవి అందించ బడవు (దానియేలు 12:8-9; 1 పేతురు 1:10-12) గనుక ప్రవక్తగా, యెహోవా పేరు అబ్రాహాముకు తెలియబడకపోయినా (నిర్గము. 6:2, 3). దైవ ప్రేరణను బట్టి అతడు “యెహోవా యీరే" అనే పేరు పెట్టగలడు (ఆది. 22:14). అది బైబిలు వర్తమానానికి విరోధమయింది కాదు (ద్వితీయో, 18:18). పైగా ఆయన నామమున అతడు పలికిన మాటలు నెరవేర్చబడ్డాయి గనుక అతడు ప్రవక్తయని మరల రుజువు చేసికొన్నాడు (ద్వితీయో, 18:21-22; ఆది. 22:7-14 చూడు). ఆ కొండపై ఇస్సాకుకు బదులు వధ పశువును యెహోవాయే చూచుకున్నాడు.

     అయితే ఒక మాట - అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో దేవునికి గల సంబంధాన్ని గూర్చి, మోషే తన భాషలో, తన వాడుక మాటల్లో తనకు బయలుపరచబడిన విధానంలో వ్రాసాడే గాని వారి మాటల్లో దాన్ని అతడు వ్రాయలేదు. అబ్రాహాముకు యెహోవా అను పేరు బయలుపరచబడకపోయినా, ప్రవక్తగా సమస్య లేకుండానే అతడు - యెహోవా యీరే అని పేరు పెట్టగలిగాడు. ఇందులో సమస్య ఉండేదానికి అసలు ఆస్కారమే లేదు. కాకపోతే మన మిత్రుడు తన నమ్మకాలను బైబిలు మీద రుద్ద ప్రయత్నించి యిలా అన్నాడు. అందువలనే అతనికి ఈ సమస్య వచ్చింది.
10. విచారణ జరిగిందా, లేదా?
      సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సు నందు భయకంపముల నొంది యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమియు సెలవీయకుండెను. 1సమూ. 28 : 5, 6.
      యీ ప్రకారము (సౌలు) యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి యెదుట ద్రోహము చేసినందుకును, యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయువారిని వెదకినందుకును పౌలు హతమాయెను.1 దిన. 10 13.

     గమనిక: సౌలు యెహోవా యొద్ద విచారణ చేసాడని 1 సమూ, 28:5, 6లో ఉంది. చేయలేదని 1 దినవృ 10:13లో ఉంది. (మన మిత్రుని పుస్తకములో, 1 దినవృ10లో, : అనేది కనబడి కనబడనట్టు అరిగిపోయింది. 10:13 అని పడవలసింది 10 13 అని పడింది. ఇది error రచయిత దోషం కాదు). అసలు విచారణ జరిగిందా లేదా? అని మన మిత్రుడు అడుగుచున్నాడు. ఒక ఉదాహరణ చూచి, తరువాత ప్రశ్నకు సమాధానం చెప్పుకొందాం.

     ఓ కుర్రవాడు సంవత్సరమంతా గాలికి తిరిగాడు! కాలేజీలో తన హాజరును ఎలాగో సరిచేసుకొన్నాడు; సంవత్సరాంతపు పరీక్షలకు తనతో కూడ ఒక పుస్తకం తీసుకుని వెళ్లి, పరీక్ష హాల్లో కూర్చుండి చాటుగా చదువుతూ పరీక్ష వ్రాస్తున్నాడు. ఇంతకు ఆ కుర్రవాడు చదివాడా, లేదా? అంటే ఎలా ఉంటుందో, ఈ సందర్భంలో మన మిత్రుని ప్రశ్న కూడా అలాగే ఉంది.

     ప్రతిదానికి సమయముంది (ప్రసంగి 3:1). ఆయా సమయాల్లో ఆయా పనులు చేస్తేనే అవి చేసినట్టుగా ఎంచబడతాయి! “యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను. దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగినయెడల ఆయన వారియందు జాలిపడును. వారు మన దేవునివైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపులవంటివి కావు మీ త్రోవలు నా త్రోవలవంటివి కావు. ఇదే యెహోవా వాక్కు...” (యెషయా 55:6-8) మరి యెహోవా దొరుకు కాలమేది? క్షేమంగా ఉన్న కాలం: “నీ క్షేమకాలములలో నీతో మాటలాడితిని గాని - నేను విననని నీవంటివి; నామాట వినకపోవుటే నీ బాల్యమునుండి నీకు వాడుక ..." (యిర్మీయా 22:21, 24-30), సౌలు కూడా తన క్షేమ కాలంలో యెహోవా మాట వినలేదు (1 సమూ. 15:19), యెహోవా ఆపద మొక్కులవాడు కాడు (హోషేయా 6:1-6)! సౌలు ఆపద మ్రొక్కులు మ్రొక్కాడు! ఎలాగంటావేమో!! అదిగో - మన మిత్రుడు కోట్ చేసిన మొదటి లేఖనము చూడు - "సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపమునొంది యెహోవా యొద్ద విచారణ చేయగా.." (1 సమూ. 28:5).

    విచారణ జరిగిన మాట వాస్తవమే గాని; అది పరీక్ష హాల్లో పేపరు వ్రాస్తూ, అప్పుడు పేజీ తిరగవేస్తున్న కుర్రవాని పోలి జరిగింది. తగిన సమయంలో తగినట్టు జరుగని పని జరిగినట్టే మన మిత్రుని లెక్క కదూ? అలాటప్పుడు మన మిత్రుని ప్రశ్న - కొంటెవాని ప్రశ్నవలె ఉంది కాని, ఒక జ్ఞాని అడిగిన ప్రశ్నగా లేదు సుమీ! అలాటిది అసంబద్ధమెలా అవుతుందో? మన మిత్రుని హేతువాదం పట్టే తప్పులు ఎలాటివో చదువరికి అర్థం కావడం లేదా? ఇలాటివే బైబిలు అసంబద్ధాలు!
11. యెష్షయి సంతానం ఏడో, ఎనిమిదో?
     యెష్షయి తన జ్యేష్ట కుమారుడైన ఏలీయాబును, రెండవవాడైన అబీనాదాబును, మూడవవాడైన షమ్మాను, నాల్గవవాడైన నేతనేలును, అయిదవవాడైన రద్దయిని, ఆరవవాడైన ఓజెమును, ఏడవవాడైన దావీదును కనెను. 1 దిన, 2:13_15.

     యెష్షయి తన ఏడుగురు కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు_ యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరు ఇక్కడనున్నారా అని యెష్షయిని అడుగగా అతడు_ ఇంకను కడసారి వాడున్నాడు; అయితే వాడు (దావీదు) గొర్రెలను కాయుచున్నాడని చెప్పెను. 1సమూ 16:10, 11.

     గమనిక: యెష్షయి సంతానం ఒకచోట ఏడనీ, మరో చోట ఎనిమిదని వ్రాయబడింది. ఇంతకు అతని సంతానం ఏడా? ఎనిమిదా? అనే మన మిత్రుని ప్రశ్నలను చదవగానే చదువరి గ్రహించి ఉంటారని తలంచుచున్నా! వాస్తవంగా అతని సంతానం “ఎనిమిది - ఏడు" రెండూ రైటే!! ఎలాగంటావేమో! చూడు:

    తన పేరు తన సహోదరుల మధ్యనుండి తుడిచివేయబడకుండ ఉండడానికి, ఇశ్రాయేలీయులకు ఒక వింతైన చట్టముండేది: “సహోదరులు కూడి నివసించుచుండగా
వారిలో ఒకడు సంతానములేక చనిపోయినయెడల చనిపోయినవాని భార్య అన్యుని పెండ్లి చేసికొనకూడదు; ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసికొని తన సహోదరునికి మారుగా ఆమెయెడల భర్త ధర్మము జరపవలెను. చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలీయులలోనుండి తుడిచి వేయబడకుండునట్లు ఆమె కను జ్యేష్ఠకుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలెను (ద్వితీయో. 25:5-6).

   గనుక ఇశ్రాయేలీయుల చట్ట ప్రకారం - ఒకని పేరు తన సహోదరులలో నిలిచి యుండాలంటే, అతడు ఈడు వచ్చినవాడైయుండడం మాత్రమే కాదు, అతడు వివాహితుడై కూడా ఉండాలి! వివాహితుడైనవాడు చనిపోతేనే అతని పేరు ఇశ్రాయేలీయులలోనుండి కొట్టివేయబడకుంటుంది. గాని, వివాహితుడు కాకముందు ఒకవేళ ఎవడైనా చనిపోతే మాత్రం అతడు వారి సహోదరుల లెక్కలో చేర్చబడడు.

     గనుక వాస్తవానికి యెష్షయికి పుట్టి పెరిగిన కుమారులు ఎనిమిది మందైనా (1 సమూ, 16:10-11), తన సహోదరులతో పాటు లెక్కింపబడకుండ ఒకడు వివాహానికి ముందే చనిపోయి ఉండి తీరాలి! గనుకనే యెష్షయి కుమారులు లెక్కింపబడినప్పుడు, చనిపోయినవానిని లెక్కలో చేర్చకుండ, ఎనిమిదవవాడైన దావీదును ఏడవవాడుగా లెక్కించడం జరిగింది (1 దినవృ. 2:13–15), ఇందులో సమస్య ఉండటానికి వీల్లేదు.

    ఉదా: నేను మా తల్లిదండ్రులకు జన్మనుబట్టి రెండోవాడను. అయితే వారికి నాకంటే ముందు పుట్టిన నా సహోదరుడు అవివాహితుడుగానే చనిపోయాడు గనుక నన్ను రెండోవాడి క్రింద లెక్కించకుండ మొదటివాడి క్రిందనే లెక్కిస్తున్నారు. దీనిలో ఏ వింతా, విడ్డూరమూ లేదు. అయినా బైబిలు మీద వేయడానికి ఈ పండితునికి యింతకంటె గొప్ప ప్రశ్నలు దొరకలేదు కాబోలు!!
12. సౌలు దావీదును యెరుగునా? యెరుగడా?
    సౌలు - యెష్షయి యొద్దకు దూతలను పంపి గొర్రెల యొద్దనున్న నీ కుమారుడైన దావీదును నాయేుద్దకు పంపుమనెను. అప్పుడు యెష్షయి ..... పంపెను. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని యెదుట నిలువబడగా అతనియందు సౌలుకు బహు యిష్టము పుట్టెను, 1 సమూ. 16:19-21.

     దావీదు ఫిలష్తీయుని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతనిని పిలుచుకొనిపోయి ఫిలిష్తీయుని తల చేతనుండగా అతనిని సౌలు దగ్గరకు తోడుకొని వచ్చెను. సౌలు అతనిని చూచి - చిన్నవాడా, నీవెవని కుమారుడవని అడుగగా, దావీదు -నేను బేత్లెహేమీయుడైన యెష్షయి అను నీదాసుని కుమారుడనని ప్రత్యుత్తరమిచ్చెను. 1 సమూ, 17:57, 58.

     గమనిక: సౌలు యెష్షయి యొద్దకు దూతలను పంపించినట్టు 1 సమూ. 16:19-21లో వ్రాయబడియుంది కదా? అయితే దావీదు ఫిలిష్తీయుని చంపిన తరువాత నీవెవని కుమారుడవని సౌలు దావీదునడుగుచున్నాడేం? అంతకు ముందు రాజు అతనిని ఎరిగినట్టు చెప్పబడియుంది గదా? అలా అడగడం అసంబద్ధం కాదా? అని మన మిత్రుడు అడుగుచున్నాడు!! దీనికి నీవేమంటావో కాని, నేనైతే వీటిని “చొప్పదంటు" ప్రశ్నలంటాను! వాస్తవ వెలుగులో వీటికి తావే లేదంటాను!! అసంబద్ధం (Contradiction) అనేదానికి పై లేఖనాల్లో చోటే లేదంటాను!

     మొదటిగా పై లేఖన భాగాల్లో ఉన్న వ్యక్తుల పరిస్థితులను, వారిలో ఒకరితో మరియొకనికి గల సంబంధ బాంధవ్యాలను ఆలోచన చేద్దాం. సౌలు - ఇశ్రాయేలీయులకు రాజు. యెష్షయి ఆ రాజ్యంలో ఒక సామాన్యుడు మాత్రమే! పైగా యెష్షయిని బట్టి దావీదు గుర్తింపబడలేదు; కాని దావీదును బట్టే యెష్షయికి గుర్తింపు కలిగింది. అందులో 1సమూ 16:19-20 సందర్భం చాల ప్రత్యేకమయింది. ముందుగా అప్పటి పరిస్థితులను తెలుసుకోడానికి ప్రయత్నిస్తాం.

    సౌలు ఆనాటి దేవుని రాజ్యాంగ చట్టమైన ధర్మశాస్తాన్ని విసర్జించి, తన మార్గాల్లో నడుస్తూ, తన రాజ్యాన్ని కూడా అలాగే నడిపింప బూనుకొన్నాడు (1 సమూ. 15). గనుక దేవుని ఆత్మ అతని విడిచిపోయాడు. ఆ తరువాత దురాత్మ వచ్చి సౌలును వెరిపించ మొదలుపెట్టింది. దాని బారినుండి రాజును (సౌలును) తప్పించడానికి రాజు సేవకులు ఆలోచించారు. వారి ఆలోచనలు సఫలం చేయడానికి యెష్షయి కుమారుడైన దావీదు సమర్ధుని గుర్తించి, వారు దావీదును గూర్చి రాజు ఎదుట ప్రశంసించారు. గనుక వానిని తోడుకొనిరండని రాజుగా సౌలు ఆజ్ఞాపించి ఉంటాడు. రాజైన సౌలు కోణంలోనుండి జారీ చేయబడిన ఆజ్ఞ జారీ చేయబడిన విధం - పిలిపింపబడినప్పుడున్న దావీదు పరిస్థితి, దావీదును మొదటిగా చూచినప్పుడు సౌలుకు కలిగిన మానసిక పరిస్థితి వగైరాలు 1 సమూ, 16:19-20ల్లో వివరించబడ్డాయి.

     మధ్య కొంత కాలం గడిచింది. రాజైన సౌలు ఫిలిష్తీయులతో తీరని యుద్ధ సమస్యల్లో మునిగిపోయాడు; “పిల్లి మెడలో గంట కట్టే ఎలుక"లా, గాతువాడైన గొల్యాతుతో పోరాడే ఇశ్రాయేలీయుడు కనబడని సమయంలో - దావీదు ఆ కార్యక్రమానికి ముందుకు వచ్చాడు. అయినా అతని జయించుటకు దావీదుకు శక్తి చాలదనే భావంతోనే సౌలు దావీదును గొల్యాతు మీదికి పంపుతాడు. ఎలాగో మొత్తానికి, తన ఊహకు అతీతంగానే దావీదు గొల్యాతును చంపి అతని తలను, అతని కత్తిని కూడా పట్టుకొని వచ్చాడు. రాజు సామాన్యుల మధ్య ఉండడు గనుక సైన్యంలో అధిపతిగా ఉన్న అబ్నేరు దావీదును రాజునొద్దకు తీసికొనిపోయాడు. పరిస్థితిని బట్టి రాజు దావీదును బహుగా అభినందించి, అతడెవరో తెలిసికోవాలనుకోలేదు. సౌలుకు దావీదు ఎవడో తెలుసు గనుకనే - చిన్నవాడా, నీవెవడవు? నీ పేరేమి? అని రాజు అతనిని అడుగలేదు, ఒకవేళ సౌలు అలాగే అడిగియుంటే కూడా - “సౌలు దావీదును ఎరుగునా? యెరుగడా?” అనే ప్రశ్నకు గౌరవం లేదు. ఎందుకంటే సౌలుకు దావీదు పేరు వెంటనే గుర్తు రాకపోవచ్చు! అందువలన రాజుగా సౌలు ఆ ప్రశ్నలు వేసినా, సమస్యగా పరిగణింపబడదు.

    అయితే రాజైన సౌలు ప్రశ్న - "చిన్నవాడా, నీవెవడవు? లేక నీ పేరేమి?" అని కాదు. అతని ప్రశ్నను జాగ్రత్తగా గమనించు – “చిన్నవాడా, నీవెవని కుమారుడవు?” అంటే - మీ నాయన పేరేమి? అనేది! ఒకవేళ మన మిత్రుడు - సౌలు యెష్షయిని ఎరుగునా? ఎరుగడా? అని అడిగియుంటే దానికి అర్థ సహితమైన చర్చ ఉండేదేమో కాని, పై లేఖనాలను కోట్ చేసి, సౌలు దావీదును యెరుగునా? యెరుగడా? అని అడగడం అర్థరహితమే అవుతుంది. బైబిలు వంటి సత్య గ్రంథాన్ని విమర్శించడానికి దిగి, యిలాటి పిల్ల ప్రశ్నలు వేయడం అవివేకాన్ని ప్రదర్శించడమే అవుతుంది సుమీ! వీటిల్లో ఏ విలువా లేదు.

13. నాకోను వద్ద పట్టు కొంటేనా, కీదోను వద్ద చెయ్యి చాపితేనా?
వారు నాకోను కళ్లము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్ఞా చెయ్యిచాపి, దేవుని మందసము పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రాగులు కొనెను. అతడు చేసిన తప్పును బట్టి, దేవుడు ఆ క్షణమందే మొత్తగా, అతడు అక్కడనే దేవుని మందసమునొద్దపడి చనిపోయెను. 2 సమూ 6:6,7. 

వారు కీదోను కళ్లమునొద్దకు వచ్చినప్పుడు పశువులకు కాళ్ళు జారినందున మందసము పట్టుకొనవలెనని ఉజ్జా చెయ్యి చాపగా యెహోవా కోపము అతనిమీద మండెను. అతడు తన చెయ్యి మందసము నొద్దకు చాపగా ఆయన అతనిని మొత్తెను. కనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయెను 1 దిన 13 9. 10. 

గమనిక: ఈ లేఖనాలను కోట్ చేసి, పైన మన మిత్రుడు వేసినప్రశ్న మూఢత్వాన్నే ప్రదర్శిస్తుంది గాని, వివేచనా జ్ఞానంగల చర్చను ప్రదర్శించడం లేదని వివేకమున్న ప్రతివాడికి అర్థమౌతుంది, ఎందుకంటే - పై కొటేషన్లు వేరు వేరు రచనలనుండి వచ్చాయి, అంటే జరిగిన ఒకే సంభవాన్ని యిద్దరు వ్యక్తులు ( ఏ వ్యత్యాసం లేకుండా) ఒకే విధంగా వర్ణించడం అసంభవం - కావాలంటే - నేటి రెండు దిన పత్రికల్లో ప్రకటింపబడిన సంభవాన్ని పరిశీలించు! అవి ఒకే సంభవాన్ని గూర్చి వివరించినా, నూటికి నూరుపాళ్లు ఒకే విధమైన వర్ణన ఆ రెండింటియందు కన్పించదు, చూడు! పైగా చదువరులైనవారు, ఒక సంభవాన్ని పూర్ణంగా గ్రహించాలంటే ఆయా కోణాల్లో వివరించబడ్డ సాక్ష్యాధారాలు కావాలి! అదే పై లేఖనాల్లో మనకు లభించే అవకాశం! వాటిని చదివి అసలు ఎక్కడ? ఎప్పుడు? ఎంత వేగంగా, ఏమి జరిగింది? అనే వాస్తవాలను గ్రహించవచ్చు.

       అనలు విషయం: యెహోవా మందనం ఒక స్థలంనుండి మరో స్థలానికి తరలించాలంటే మోత కర్రలతో మందసాన్ని తగిలించుకొని లేవీయులైన యాజకులలో కహతీయులు మోయాలి (నిర్గమ, 25:10-15 యెహోషువ 3:3; 6:6; 8:33) అయితే "వారు చావకుండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు" (సంఖ్యా 4:15) తమ భుజముల మీద మోయుటయే వారి పని గనుక వారికి వాహనములను నియమింపలేదు (సంఖ్యా 7:9) అది అలా ఉండగా ఆ నియమానికి భిన్నంగా, తమ రాజ్యాంగ చట్టానికి విరుద్ధంగా - క్రొత్త బండిమీద యెహోవా మందసాన్ని ఉంచి, క్రొత్త ఎడ్లచేత దాన్ని లాగించడానికి ప్రయత్నం జరిగింది. అలా జరుగకూడదని వారిలో (ప్రధానుదైన) ఉజ్జాకు తెలిసియుండాలి. దేవుని ఆజ్ఞను నిర్లక్ష్యపెట్టి, తమ మార్గములో దానిని తరలించుతున్నప్పుడు దేవుడు వారియందు ఆనందించలేదు.

     ఆ సందర్భంలో మార్గమందు ఎడ్లకు కాళ్లు జారడం; బండి ఒరగడం; (తమ సొంత తలంపుల్లో బహుగా గౌరవించుచున్నా, దేవుని మందసం పడేలా ఉండడం; ఆ సమయంలో బండి ప్రక్కన నడుస్తున్న యాజకుడైన ఉజ్జా తన చేయిచాపి పట్టుకొనడం, తక్షణమే (మరే ఆలస్యం లేకుండ) అతడు మొత్త బడడం - ఆ లేఖనాల్లో సూచింపబడ్డాయి. అతడు దాన్ని ముట్టి ముట్టనంతలో -కరంటుతీగను ముట్టుకుంటే ఏలాగో ఆలాగే సంగతి జరిగింది.

     అది కనానులో ధాన్యం నూర్చుకొనే (harvest season); ఆ సంభవం జరిగిన స్థలం: నాకోను, కీదోను కళ్ళాల మధ్య! జరిగిన సంభవం ఏ సమస్య లేకుండా జ్ఞానియైన ప్రతివాడు గ్రహించడానికి వీలుగా ఆ లేఖనములలో యిద్దరు సాక్షుల ద్వారా స్థిరపరచబడుతున్న ఆ వాస్తవాలను అంగీకరించడానికి బదులు - సత్యాన్ని అంగీకరించే మనస్సు లేని మన మిత్రుడు వంక లేనిచోట వంక పెట్టడానికే - నాకోను వద్ద పట్టుకొంటేనా? కీడోను వద్ద చెయ్యి చాపితేనా? అని అడిగాడు. సమస్య సత్యాన్ని అంగీకరించలేని మన మిత్రుని మనస్సులోనిదే గాని, తాను కోట్ చేసిన లేఖనాల్లోనిది మాత్రం కాదు. ఈ సంగతి నీకు అర్థం కాలేదా?
14. బలే లెక్కలు!
    (దావీదు) అతని (సోబా రాజు) యొద్దనుండి వెయ్యిన్ని ఏడు నూర్ల మంది గుర్రపు రౌతులను, ఇరువది వేల కాల్బలమును పట్టుకొ(నెను). 2 సమూ. 8:4.

    (దావీదు) అతని (సోబా రాజు) యొద్దను డి వెయ్యి రధములను, ఏడువేల గుర్రపు రౌతులను, ఇరువదివేల కాల్బలమును పట్టుకొనెను. 1 దిన, 18:4.
15. లెక్కలంటే యిలా ఉండాలి!
     దావీదు అరామీయులలో ఏడునూర్లమంది రధికులను నలువది వేలమంది గుర్రపు రౌతులను హతము చేసేను. 2 సమూ. 10:18,

     దావీదు అరామీయులలో ఏడువేలమంది రధికులను, నలువదివేల కాల్బలమును హతముచే(సెను). 1 దిన, 19:18,

గమనిక: బైబిలు దేవుని గ్రంథమైయున్నా అందులో కేవలం దేవుని ఉద్దేశాలు మాత్రమే గాక, దైవ చిత్తానికి వేరైన మాటలు, సంఘటనలు, వగైరాలు దాఖలు చేయబడ్డాయి. మానవ జ్ఞానం, మానవ బలహీనతలు కూడా అందులో వ్రాయబడ్డాయి. బైబిల్లోని వ్రాయబడిన వన్నీ దేవుని మాటలే అయినందున బైబిలు దేవుని గ్రంథమనబడలేదు. చివరికి అపవాది మాటలుచేష్టలు సయితం అందులో దాఖలు చేయబడ్డాయి. అయితే బైబిల్లో అవి ఎందుకు దాఖలు చేయబడ్డాయో ఎరుగకపోయినా, కనీసం అలాటివి ఉన్నాయనే భావన కూడా మన మిత్రునికి లేనట్టుంది. విమర్శనాత్మకంగా చదివితేనే ఈ సంగతులు అర్థమౌతాయి. లేకపోతే, యిలాటి వ్యర్థమైన మాటలే పలుకవలసి వస్తుంది.

     మానవ సైన్యాలు, జనాభా లెక్కలు, వగైరాలు దైవ సంబంధమైనవి కానవసరం లేదు. అంటే వారి సైన్యం, జనం వగైరాలను లెక్కించి వాటియందు అతిశయించడం దేవునికి అనుకూలమైన సంగతి కానట్టు బైబిల్లో చూడవచ్చు (2 సమూ. 24:1) గుర్రాలను ఎక్కువగా సంపాదించుకొనడమో, తన సైన్య బలంమీద ఇశ్రాయేలీయులు ఆధారపడటమో దేవునికి అంగీకారమైన కార్యాలు కావు (ద్వితీయో, 17:16; కీర్తన. 147:10: కీర్తన 20:7; 38:16-17), రాజులు ఆ పని చేయకూడదు.

     ఇలాటి పరిస్థితిలో, మానవుడు తన సొంత యోచనను బట్టి వేసిన లెక్కల్లో వ్యత్యాసమున్నదని కనిపెట్టి, వాటిని దైవ సంకల్ప సందేశానికి అంటగట్టి, బైబిలుపై నేరాలు మోపేవానికెవనికి బైబిలు చదవడం తెలియదనే చెప్పాలి. మన మిత్రుడు తన విమర్శలో యింతకంటె గొప్ప కార్యాన్నేదైనా సాధించాడా? లేదు. ఇంతకు మించి తన వ్యంగ్య విమర్శల్లో జ్ఞానమని గుర్తింపగల ఏ విశేషమూ లేదు. వాస్తవంగా యిలాటి వ్యత్యాసాలు చేతిప్రతుల వ్రాతల్లో అనాలోచనగా దొర్లిన మానవ దోషాలే గాని, వేరు కాదనే చెప్పాలి. ఒకవేళ వాటిని రచనలోని దోషాలేనని స్థాపించినా, ఇశ్రాయేలీయులు సైన్య బలంమీద ఆనుకొనడం, లేక వాటి లెక్కలమీద అతిశయించడం దేవునికి అనుకాలమైనవి కావు గనుక అలాటి లేఖనాలు బైబిలు దోషాలు కావని ప్రతివారు తెలుసుకోవాలి!

     లెక్కలు ఎలా ఉన్నా సమస్య బైబిలు కాదని తెలియని మన మిత్రుని మాటలు వ్యర్థంగానే వినియోగించబడ్డాయి. అయినా సంఖ్యలో తప్పులు ఎలా దొర్లాయో ముందుగానే వివరించాను గనుక మరల వాటిని చర్చించకుండ విడిచిపెట్టాను.

16. సాతానే యెహోవా కాడుగదా?
     సాతాను ఇశ్రాయేలీయులకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపిం(చెను). 1 దిన, 21:1.

     యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగుల్కొనగా ఆయన దావీదును వారిమీదికి ప్రేరేపణ చేసి - నీవుపోయి ఇశ్రాయేలువారిని, యూదావారిని లెక్కించుమని
అతనికి ఆజ్ఞ ఇచ్చెను. 2 సమూ. 24:1.

గమనిక: దావీదును ప్రేరేపించినది సాతానని 1 దినవృ 21:1లో ఉంది. అయితే అతన్ని యెహోవా ప్రేరేపించినట్టు 2 సమూ. 24:1లో ఉంది. ఇంతకు అతన్ని ప్రేరేపించిందెవరు? ఒకవేళ ప్రేరేపించింది ఒక్కరే అయి ఉంటే - సాతానే యెహోవా కాడా? అలాగైతే బైబిల్లో పరస్పర విరుద్ధమున్నట్టే గదా? అని మన మిత్రుడు అడుగుచున్నాడు. దీనికి నీవేమనుకున్నా "ప్రేరేపణ" అనే మాట బైబిల్లో ఎలా ప్రయోగింపబడిందో యెరిగియుంటే, యిక్కడ సమస్య అనేది లేదంటాను. అయితే కొంచెం ఓపిగ్గా సంగతులను ఆలోచింపవలసి వస్తుంది అంతే!

(1) మానవ క్షేమానికి విరోధమైన ప్రేరేపణ; (2) మానవ క్షేమానికి అనుకూలమైన "ప్రేరేపణ" - అనే ఈ రెండు రకాలైన ప్రేరేపణలు బైబిల్లో వర్ణించబడ్డాయి. అందులో మొదటిది - అపవాది క్రియ రెండవది - దేవుని క్రియ! ఈ జ్ఞానంతోనే మన సమస్య పరిష్కారమై ఉంటుంది. అయినా సంగతులను యింకా కొంత పరిష్కారంగా తెలుసుకుంటే బాగుంటుంది గనుక చర్చను కొనసాగిద్దాం.

     మానవ పరిమితి జ్ఞానాన్ని ఆధారం చేసికొని, మోసం చేయడానికి ఆశ చూపేది - అపవాది క్రియ (ఆది. 3:1-6, 1 తిమోతి 2:13-14) అంటే అపవాది తన కుయుక్తిచేత మానవ క్షేమమనిపిస్తూ, మానవ క్షేమానికి విరోధంగా వానిని ప్రేరేపిస్తాడు (2 కొరింథీ. 11:2) ఇందులో మానవ మనస్సును చెరపడమే వాని లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో - తిన్నని మార్గంనుండి తొలిగి, నియమానికి విరుద్ధంగా (శరీర) కోర్కెలను తీర్చుకోమని సాతాను మానవుని ప్రేరేపిస్తాడు (మత్తయి 4:3-4). మనిషిని "ఉబ్బించడం" వాని ప్రేరేపణలో ఒక భాగం - అంటే “నీవు మొనగాడివైతే - అది చెయ్, యిది చెయ్" అనేదే వాని ప్రేరణ. దానివలన దేవుని ప్రజలకు కీడు కలగాలనే సాతాను కోర్కె! మానవ సహజ స్వభావానికి విరోధంగా అపవాది చేసే ప్రేరేపణను - "శోధన" అని అంటారు. వాని శోధనలన్నింటిని - శరీరాశ, నేత్రాశ, జీవపడంబం – అనే మూడు రకాలుగా బైబిలు వర్ణించింది. అయితే యివి తండ్రియైన (యెహోవా) దేవునివలన కలిగేవికావని బైబిలు స్థిరపరచింది; చూడు (1 యోహాను 2:15-17). దేవుడు ఎవనిని శోధించడు (యాకోబు 1:13).

మానవ క్షేమానికి అనుకూలమైన ప్రేరేపణ
ఇది దేవుని ఆజ్ఞకు సంబంధించినది

     దేవుని అనుగ్రహం మారుమనస్సు పొందుటకు మనిషిని ప్రేరేపిస్తుంది (రోమా 2:4). అయినా, మార్చుకొనడమో, మార్చుకొనకపోవడమో - అది కేవలం మానవ అభీష్టానికే విడిచి పెట్టబడుతుంది సుమీ! (ప్రకటన 3:20). దేవుని దీర్ఘశాంతం రక్షణార్థమయ్యింది (2పేతురు 3:15) అంటే దుష్టత్వాన్ని వదలి నీతిని జరిగించడానికి నరునికి అది సమయమిస్తుంది (ప్రకటన 2:21)

     అయితే నరుడు తన నిర్ణయాల్లో స్థిరపడితే, అంటే తాను చేయబూనుకొన్నదాన్ని ఏ విధం చేతనైనా అతడు చేయటానికే సమకట్టితే, అది మంచిదైనా, చెడ్డదైనా - అలాటి మానవ అభీష్టానికి దేవుని ప్రోత్సాహము లభిస్తుంది."ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును యోహోవా వాని నడతను స్థిరపరచును" (సామె. 16:9). ఇలాటి పరిస్థితినే - 'యెహోవా ప్రేరేపించెను" అని బైబిలు అంటుంది. ఈ జ్ఞానంతో పై లేఖనాలను పరిశీలించి చూద్దాం.

     1 దినవృ, 21; 2 సమూ. 24ల్లో వర్ణింపబడిన దావీదు పరిస్థితిని గమనించు: అతడు రాజుగా స్థిరపరచబడ్డాడు; తన శత్రువులపై తన వాంఛను తీర్చుకున్నాడు (1 దినవృ, 18-20 అధ్యాయాలు) ఇశ్రాయేలీయుల నేలు యెహోవా రాజ్య సింహాసనం మీద కూర్చుండి, మునుపటివలె అతడు యెహోవామీద ఆనుకొనుటకు బదులుగా (1సమూ, 17:45-47), ఆయన ఆనందించని తన సామర్థ్యం, సైన్య బలం అనే వాటి మీద (కీర్తన. 147:10) అతడు అతిశయించేలా, సాతాను దావీదును ప్రేరేపించాడు, సాతాను ప్రేరేపణకు అతడు లొంగిపోయాడు; జీవపుడంబంలో పడిపోయాడు (1 ది 21:1).

     అలాటి పతనంనుండి దావీదు లేవాలని, అతడు మార్పు చెందాలని దేవుడు కోరుకున్నాడు. ఆయన కోర్కె దావీదు సేనాధిపతియైన యోవాబు ద్వారా దావీదుకు వినిపించబడింది. యోవాబు దావీదుతో - "రాజా, నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్నవారికంటె నూరంతలు మందిని ఎక్కువ చేయునుగాక; వారందరు నా యేలినవాని దాసులు కారా? నా యేలినవానికి ఈ విచారణయేల? ఇది జరుగవలసిన హేతువేమి? జరిగిన యెడల ఇశ్రాయేలీయులకు శిక్ష కలుగునని మనవి చేసెను. "అయినను యోవాబు మాట చెల్లక, రాజు మాటయే చెల్లెను" (1 దినవృ. 21:3-4)

     రాజు మాట యోవాబుకు అసహ్యంగా ఉండినా, ఆ కార్యం దేవుని దృష్టికి ప్రతికూలమై ఉండినా (1 దినవృ 21:6,7), తాను తీర్మానించుకొన్న దానిని దావీదు మార్చుకునే మనస్సు లేనివాడైయున్నాడు. గనుక దావీదు యొక్క హృదయ వాంఛను అతనికి సిద్ధించబడునట్లు దేవుడు అతని అభీష్టానికి అతని వదలివేసాడు. దీనినే యెహోవా దావీదును ప్రేరేపించెనను మాటలతో సూచించడమైనది (2 సమూ. 21:1).

     ఇలా పరిశీలించిన లేఖనాల్లో, మన మిత్రుడు వ్యక్తపరచిన ఏ వింతా లేదు. ఈ సందర్భంలో మన మిత్రుని ప్రశ్న - విషయ పరిజ్ఞానం లేనిదిగా కన్పిస్తుంది. అసలు ఏమి జరిగిందో మరోసారి చూడు: జీవపుడంబమనే శోధనతో అపవాది దావీదును ప్రేరేపించాడు. అయితే దానినుండి తప్పించుకొనడానికి దేవుడైన యెహోవా యోవాబు ద్వారా మార్గం కల్పించాడు. అయితే శోధన్ను జయించడానికి బదులు, తన మనస్సు యొక్కయిష్టం చొప్పున జరిగించడానికి దావీదు స్థిరపడగా, మానవ హృదయ వాంఛలను సిద్ధింపజేయు దేవుడు, దావీదు యొక్కయిష్ణాన్ని జరిగించుకోడానికి అతన్ని ప్రేరేపించాడు. దీన్ని పట్టుకొని - యెహోవాయే సాతాను కాడుగదా? అని అనడం తన మూఢత్వాన్ని ప్రదర్శించుకొనడమే ఔతుంది; యిందులో వేరే విశేషమేమి లేదు!!

17. జనాభా లెక్కల రిపోర్టు!
     యోవాబు జనసంఖ్య వెరసి రాజుకు అప్పగించెను. ఇశ్రాయేలువారిలో కత్తి దూయగల ఎనిమిది లక్షలమంది యోధులుండిరి. యూదావారిలో అయిదు లక్షలమందు యుండిరి. 2 సమూ. 24:9.
     యోవాబు...... జనుల సంఖ్య వెరసి దావీదుకు అప్పగించెను. ఇశ్రాయేలీయులందరిలో కత్తి దూయువారు పదకొండు లక్షలమందియు యూదావారిలో కత్తి దూయువారు నాలుగు లక్షల డెబ్బదివేల మందియు సంఖ్యకు వచ్చిరి 1 దిన 21:4 5.

గమనిక: లెక్కలు వేసినా - "ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూల మగుటచేత ఆయన ఇశ్రాయేలీయులను బాధపెట్టెను" అని ఈ సందర్భముగా వ్రాయబడిందే! దానిని. మన విమర్శకుడు చదువలేదా? (1 దినవృ 21:6); అలా చదివి ఉంటే, ఆ లెక్కల్లో లోపాలను ఎలా విమర్శింప బూనుకున్నాడో? ఒకవేళ మన మిత్రుడు బైబిలును చదివినా, దానిలో తప్పులు పట్టాలనేదే తన దృష్టి గనుక - భ్రమతో కూడిన తన దృష్టి దేన్ని తప్పుగా ఎంచాలో, దేన్ని రైటుగా ఎంచాలో కూడా తెలియని దుస్థితిలో యిరుక్కు పోయినట్టుంది.

     ఏది దేవునికి ప్రతికూలమో, వాటి విషయంలో లెక్కలు తప్పులుపడితే, దేవుని సంకల్పాన్ని బయలుపరచే బైబిలు ఉపదేశాన్ని అవి ఎలా బాధిస్తాయ్? అంటే ఒకవేళ లెక్కలు నిజంగానే తప్పైనా, అవి బైబిలు సందేశానికి సంబంధించినై కావు గనుక, వాటిని బైబిలు తప్పులుగా ఎంచడం అర్థరహితం. కదూ? అయినా, అవి అలా జరిగిన లోపాలు కూడా కావే అవి కేవలం ప్రతుల వ్రాతల్లో దొర్లిన మానవ దోషాలే! మన మిత్రుని ఈ రచనలో 1 దినవృ 21:4, 5ను సూచింపనుద్దేశించి; 1 దినవ. 21: 4 5 అని సూచించాడు; చూడు. అలాటిదాన్ని కూడా రచయిత ఉద్దేశంమీదనే రుదుతామా? అలా కాకపోతే, సంఖ్యలో తప్పులు పడినంత మాత్రాన బైబిలును మన మిత్రుడు ఎలా విమర్శిస్తాడో? ఇంత సంకుచితమైన భావము హేతువాదానికి ఉంటుందా? ఏమి?
18. అసలు క్రయ ధనమెంత? చెప్పిన దెవరితో?
     రాజా (దావీదు) - నేను యీలాగు తీసుకొనను: వెల యిచ్చి నీ యొద్ద కొందును. వెలయీయక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యేహోవాకు దహనబలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్లమును యెడ్లను ఏబది తులముల వెండికి కొనెను. 2 సమూ. 24 24.
     రాజైన దావీదు - అట్లుకాదు; నేను నీసొత్తును ఊరక తీసుకొని యెహోవాకు దహన బలులను అర్పించను. న్యాయమైన క్రయ ధన మిచ్చి దాని తీసుకొందునని ఒర్నానుతో చెప్పి ఆ భూమికి ఆరు నూరు తులముల బంగారము అతనికిచ్చెను. 1 దిన 21:24, 25.

గమనిక: (1) అరౌనా - ఒర్నాను అనే పేర్లు ఒకనికే చెందినవంటే ఆశ్చర్యపడనక్కర లేదు. మన విమర్శకునికి మాత్రం రక రకాలైన పేర్లు లేవా? మానవ నాగరికతల్లో ఒకటికంటె ఎక్కువ పేర్లు ఒక వ్యక్తికి ఉండటం సహజమే! అందులో ఆయా భాషలు మాట్లాడే వారి మధ్య ఒక భాషలో ఒక విధంగానూ, అదే పేరు మరో భాషలో వేరొక విధంగానూ ఉండడం మన ఎరుకలో లేనిది కాదు. జాన్ (John) యోహాను అనేవి ఒకని పేర్లేనని భాష, వాడుక తెలిసినవారు గుర్తిస్తారు.

     (2) పైగా బైబిల్లో ఒకటికంటే ఎక్కువ పేరు ఒకనికే ఉండడం వింతకాదు. కొన్ని ఉదాహరణలు ఈ సంగతిని తేటపరుస్తాయ్ చూడు:
1. ఎల్యాకీము - యెహోయాకీము (2 దినవృ, 36:4)
2. యెహోయా కీను - ఎకొన్యా, కొన్యా (2 రాజులు. 25:6, 7; యిర్మీయా 22:24, 27:9)
3. దానియేలు - బెల్తెషాజరు (దానియేలు 1:6-7)
4. హనన్యా - షద్రక్                     ( " )
5. మిషాయేలు - మేషాకు           ( " )
6. అజర్యా - అబేద్నెగో              ( " )

     ఇలా యింకా అనేకమైన ఉదాహరణలు చూపవచ్చు. దీన్నిబట్టయినా అరౌనా -ఒర్నాను అనేవి ఒకే వ్యక్తిని సూచించే పేర్లని చెప్పవచ్చు; సమస్య లేదు.

     (3) లేక శతాబ్ధాలతరబడి జరుగుతూ వస్తున్న కాపీ రచనల్లో అక్షర దోషం దొర్లడంవల్ల యిలాటి పరిస్థితి ఏర్పడి ఉండవచ్చు; అలా అక్షర దోషాలవల్ల పేర్లు తప్పులు పడతాయా? అని అడుగుతావేమో! అలాటివి మన మిత్రుని రచనలోనే దొర్లాయి చూడు!



తప్పు
పేజీ
లైను
రైటు
1. ఏదోము
49
15
ఎదోము
2. పూనూను
49
19
పూనొను
3. ఎలాజరు
49
22
ఎలియాజరు
4. యెష్టయి
51
7
యెష్షయి
5. సొలోమొను
53
9
సొలొమోను
6. యావేను
53
18
యాకీను

     ఇలా జరిగిన అక్షర దోషం ఒర్నాను అనే పేరు అరౌనాగా పడే అవకాశముంది. గనుక దావీదు చెప్పింది “ఒర్నాను"తోనే ఈ పేరుతో దావీదు కాలమందు ఆ వ్యక్తి గుర్తింపబడ్డాడు (2 దినవృ, 3:1-2). ఈ ఒర్నానే 2 సమూ. 24:24లోని అరౌనా, ఈ రెండు పదాలకు హెబ్రీలో ఉండే లిపి సంబంధాన్ని బట్టి లిపి దోషం కావచ్చు కూడా గనుక చెప్పినదెవరితో అనే ప్రశ్నకు సమాధానం వచ్చింది.

     ఇకపోతే - అసలు క్రయధనమెంత? అనే ప్రశ్నను పరిశీలించుదాం: అసలు క్రయధనమెంత అనేదానికంటే - దేని క్రయధనమెంత? అని అడగడం సబబుగా ఉంటుంది. ఎందుకంటే - ఒకే సమయంలో రెండు రకాలైన క్రయ విక్రయాలు జరిగాయ్,

    ఒక క్రయ విక్రయం: భూమికి అంటే ఒర్నానుకు సొత్తు గానున్న భూమికి సంబంధించినది. దీన్ని ప్రత్యేకంగా సూచించడానికి (magom) "మాగోమ్” అనే హెబ్రీ భాషా పదం ప్రయోగింపబడింది. యెహోవా మందిర నిర్మాణం కొరకు ఆయన కోరుకున్న భూమి యిదే! దీనిపైననే దావీదు కుమారుడైన సొలొమోను - యెరూషలేము దేవాలయాన్ని నిర్మించాడు. 2 దినవృ, 3:1-2 చూడు. దీని వెల ఆరు వందల తులముల బంగారం,(1 దినవృ 21:21-26లోని సంగతి యిదే!)

     రెండవ క్రయ విక్రయం: ఒర్నాను కళ్లమునకు ఎడ్లకు పరిమితి చేయబడింది. అది అప్పటి పరిస్థితిని బట్టి, తాత్కాలికంగా బలియర్పించడానికి దావీదు అతని యొద్దకొన్నది. దీనిని వేరుగా సూచించడానికి హెబ్రీలో (gorem) “గోరెమ్" అనే పదం ప్రయోగింప బడింది. కళ్లము - దానిలోని ఎడ్లను కొన్నది ఏబది తులముల వెండికి గనుక సమస్య లేదు. అది మన విమర్శకుని పాండిత్యంలోని సమస్యయేగాని; బైబిలు సమస్య ఎంత మాత్రమూ కాదు!
19. వరం ఉదాత్తమైనదైనా, ఎన్నేండ్ల కరువు?
     గాదు దావీదు నొద్దకు వచ్చి యిట్లని సంగతి తెలియ చెప్పెను - నీవు
నీ దేశమందు ఏడు సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల యెదుట నిలువలేక నీవు మూడు నెలలు పారివుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు మూడు దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా?--చెప్పుమనెను. (2 సమూ, 24:13).

     గాదు దావీదు నొద్దకు వచ్చి యిట్లనెను - మూడేండ్లపాటు కరువు కలుగుట, మూడు నెలలపాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరుమగా నీవు వారియెదుట నిలువలేక నశించిపోవుట, మూడు దినములపాటు దేశమందు .... తెగులు నిలుచుట . . . అను వీటిలో ఒకదానిని నీవు కోరు కొను(ము). (1 దిన, 21:11, 12).

గమనిక: ఇక్కడ మన మిత్రుడు అసంబద్ధమని (అంటే ఒకదానికొకటి విరుద్ధమని) పడికి పుచ్చుకొన్న ఘోరమైన దోషాన్ని చదువరి గుర్తించి యుంటాడా? ముందు లేఖనంలో (2 సమూ. 24:13లో) కరువు సంవత్సరాలను సూచిస్తూ "7" అని పడిందట; పోతే తరువాత లేఖనంలో - అదే స్థలములో "3" అని పడిందట! దీనితో బైబిలు బోధకే కళంకం ఏర్పడిందట! ఈ మాటలు - పిల్లకాయల ఆటలా ఉంది గాని పండితుల గోష్టిలా లేదు. నేటి హేతువాదం పని యిదేనేమో!
బైబిలును యిలా విమర్శించేవారికి కొంచెమైనా ఇంగిత జ్ఞానముండాలి. మన మిత్రుడు విమర్శించ బూనుకొన్న బైబిలు అతి ప్రాచీన గ్రంథం ...!! ఆ గ్రంథం వ్రాయబడటానికి ప్రారంభించింది మొదలు ప్రింటింగ్ వచ్చేవరకు మధ్యలో సుమారు 2000 - 2500 సంవత్సరాల కాలం గడిచిపోయినా ఆయా శతాబ్ధాలలో బైబిలు ప్రతులుగా చేయబడుతూనే ఉండలేదా? ప్రింటుకు ముందు ఏన్నోమార్లు (ప్రూఫ్ రీడింగ్) దిద్దుబాటు జరుగునట్టు చేతిప్రతులలో జరిగే అవకాశం లేదు. ఎంతైనా, ప్రతులు వ్రాసేవారు మానవమాత్రులే! పైగా యింత కాలంగా ఉన్న గ్రంథంలో అక్షరాలు చెరిగే అవకాశం కూడా ఉంటుంది! అక్షరాలు చెరిగిన కారణాన్ని బట్టొ, లేక చేతిప్రతుల వ్రాతల్లోనో ఎప్పుడో “3" బదులు “7” అని పడిందట! అదంతా మన పండితుడు పట్టుకొని నిగ్గదీసిన బైబిలు బండారం! ఇలాటివాటిని "పోసుకోలు" కబుర్లని మా పల్లెటూరిలో అంటూ ఉంటారు!

     అయినా మన మిత్రుడు "గురిగింజ"లా మాట్లాడతాడేం? తాను కేవలం రెండోసారి మాత్రమే (శ్రీ గాయిత్రీ ప్రెస్ విజయవాడ -ID ప్రింటు చేసిన ప్రతిని చూడు. అసంబద్ధాలు (contradictions) అనే తన రెండో భాగంలో చాలా మట్టుకు బైబిలును కోట్ చేయడమే గదా? అలాటి చూచి వ్రాతల్లో అనేకమార్లు దిద్దుకొనే అవకాశమున్నప్రింటింగు విధానంలో యిలాంటి మానవ దోషాలు (human errors) ఎన్ని జరిగాయో గమనించలేదా? వందలకొలది సంవత్సరాలుగా చేతివ్రాతలుగానే ఉన్న బైబిల్లో 3కి బదులు 7అని పడితే అది భయంకరమైన నేరమా? మన మిత్రుని రచన్ను చూడు!

ఉద్దేశించిన సంఖ్య
పడిన తప్పు
పేజీ
లైను
1. అపో. 7:4
అపో. 7 4
48
8
2. 1 దిన. 10:13
1 దిన. 0 13
50
13
3. 2 సమూ. 24:24 
2 సమూ. 24 24
52
20
4. అపో. 1:18, 19
అపో. 1:8, 19
61
20
5. లూకా 24:49 
లూకా 24:9 
61
29
6. మార్కు 16:9-11
మార్కు 16 9-11
63
10
7. ఆమో. 9:1
ఆమో. 9 1
66
10
8. సామె. 21:21
సామె. 21 21
54
8
9. యోబు 21:7-9
యోబు 21 7-9
54
13

     మన మిత్రుని రచనలో జరిగిన ఈ దోషాలు కేవలం ఉదాహరణలుగా మాత్రమే చూపడం జరిగింది. మన విమర్శకుని రచనలో "అసంబద్ధాలనే" 30 పేజీల భాగంలోని చూచి వ్రాతలోనే రచయిత ఉద్దేశింపని దోషాలెన్నోదొర్లితే, వందలాది పేజీలుండే బైబిలును చూచి వ్రాసే వ్రాతల్లో యింకా ఎన్ని దోషాలు దొర్లాలో? ఎలా చూచినా, మన మిత్రుని విమర్శనా రచన బైబిలు మీద తన స్వరమెత్తి తన మతిహీనతనే రుజువు చేసికొంది; తాను పడిపోడానికి తన గోతిని తానే లోతుగా త్రవ్వుకొంది!

     అది ఎలాగున్నా చూచివ్రాతలో యితరులవలన జరిగిన దోషాలు, రచయిత(ల) దోషాలుగా భావించడం బుద్ధిహీనతే! దాన్నే ప్రేమపూర్వకంగా చెప్పాలంటే - రచయిత వర్తమానానికి గాని, లేక అతని ఉద్దేశానికి గాని సంబంధం లేకుండ (అతని రచనలను యితరులు) చూచి వ్రాసిన వ్రాతల్లో అనాలోచనగా దొర్లిన దోషాలను (human errors) రచయిత దోషాలుగా భావించడం ముమ్మాటికీ తప్పే! గనుకనే మన మిత్రుని (క్షుద్ర) రచనలో యిలాటి అనేక దోషాలున్నా - తన అభిమానుల చేతుల్లోను; దాన్ని వ్యతిరేకించినవారి చేతుల్లోను; యితర మేధావుల చేతుల్లోను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు - మన దేశపు సుప్రీంకోర్టుల చేతుల్లో సయితం వాటి విషయమై విమర్శింపబడకుండగనే అది తిరిగి వచ్చింది; గదా?

      అయితే ఆలాటి దోషాలు బైబిలు చేతిప్రతుల్లో దొర్లితే - వాటిని మాత్రం మన విమర్శకుడు గట్టిగా పట్టి, నిగ్గదీసి - వాటికి కూడా బైబిల్లో అసంబద్ధాలనే పేరు పెట్టాడు. ఇలాటి పనులను గూర్చి నీవేమంటావో కాని; మన విమర్శకుని ఈ పిల్ల చేష్టలను చూచి జ్ఞానులు నవ్వుతారా, లేదా? ఈ కొంటె పిల్ల చేష్టలను జ్ఞానమని భావించే వారి జ్ఞాన స్థాయిని గూర్చి నీవేమంటావో? అది యిక నీ యిష్టం. ఏది ఏలాగున్నా చూచి వ్రాత దోషాలను రచయిత(ల) దోషాలుగా ఎంచి, మన విమర్శకుడు అడిగిన ప్రశ్నలు యింకా ఉన్నాయి. వాటిని తన రచనలో ఉన్నట్టే - క్రింద చూస్తూ, ఒకటీ రెండు కామెంట్లతో వాటిని దాటిపోదాం.

     అయితే దానికి ముందు ఒక మాట. బైబిలులో యిలా చేతిప్రతుల దోషాలు దొర్లాయని గుర్తించాం గదా! ఇప్పుడు బైబిళ్లు ప్రింట్ అవుతూ ఉంటే, ప్రింటులో అలాటి తప్పులు రాకుండా దిద్దకూడదా? అని అడుగుతావేమో! చేతిప్రతుల్లో దొర్లిన పొరపాట్లు ఆది భాషలలో దొర్లిన పొరపాట్లు, అవి నేటివి కావు. ప్రింటు దోషాలైతే మరో ప్రింటులో దిద్దవచ్చు. నేటి తర్జుమాలకు ఆధారం ప్రాచీన చేతిప్రతులు. ఆ చేతిప్రతులను దిద్దడానికి ఎవడికి అధికారంలేదు. అలా దిద్దడం ప్రారంభించితే, బైబిలు మూలాన్నే ప్రశ్నింపవలసి వస్తుంది.

     సాధారణంగా మనకు లభించేవి కేవలం తర్జుమాలు మాత్రమే. బైబిలు మూలాలను తర్జుమా చేసిన పండితులు - చేతిప్రతుల దోషాలను గుర్తించినా, వారు తర్జుమాదారులేగాని తప్పులు దిద్దేవారు కారు. గనుక వారు వాటిని అలాగే తర్జుమా చేశారు. గనుక ఒకవేళ, తరువాత ప్రింటులో 'బైబిలు బండారం” తన (Printers Devils) ప్రింటు తప్పులను దిద్దుకుంటే దిద్దుకుంటుందేమో కాని, బైబిలు మాత్రం ఆ పని చేయదు; అలా చేయనవసరం బైబిలుకు కూడా లేదు. అలా చేయకుండానే బైబిలు దేవుని గ్రంథంగా నిలిచి ఉంటుంది.
20. సొలోమొను సైనిక దళం
     సొలోమొను రధములకు నలువది వేల గుర్రపు సాలలును, రౌతులకు పన్నెండు వేల గుర్రములును ఉండెను. 1 రాజు 4:26,

     సొలోమొనుకు నాలుగు వేల గుర్రపు సాలలును రధములును, పన్నెండు వేల గుర్రపు రౌతులును కలిగియుండెను 2 దిన 9:25,

గమనిక: రాజులు, దినవృత్తాంతములు అనే రెండు వెవ్వేరు బైబిలు రచనలను పోల్చినప్పుడు రౌతులకు పన్నెండు వేల గుర్రాలున్నాయి, పన్నెండు వేల గుర్రపు రౌతులు కూడా ఉన్నట్టు తేలిపోయింది. అయితే మన మిత్రుడు యిక్కడ పట్టిన ఘోరమైన తప్పేమంటే-నలువది(40)వేల గుర్రపు సాలలని ఒక చోట, నాలుగు వేల గుర్రపు సాలలని(4) మరియొక చోట అచ్చు తప్పుపడిందట. ఇదట మన మిత్రుని పాండిత్యం బైబిల్లో పట్టిన తప్పు. ఈలాటి అచ్చుతప్పులు మన మిత్రుని 76 పేజీలో క్షుద్రరచనలో ఎన్నిసార్లు జరిగిందో జనం, ఎందుకు చూడలేకపోయారు?

     కోర్టుకు చెవులేగాని కండ్లు లేవంటారు, దాన్ని తీసివేయి! కండ్లున్నాయి, think big అనే నినాదాలు చేసే మన మిత్ర బృందానికి కూడా కండ్లు పోయాయా? "The Bible Handbook" అని G.W. Foote, W.P. Ball అనే వారి ఆంగ్ల రచనను మన మిత్రుడు బహ్మం కాపీకొట్టినందున, తనకు అసలు బైబిలుతో సరియైన పరిచయం లేదనుకో! నిజంగా అతనికి బైబిలు పరిచయమే ఉంటే, "సొలోమొను" అని మూడు సార్లు తన చూచి రాతలో ఎందుకు తప్పుచేసి ఉంటాడు? బైబిల్లో ఆ పదం ఎక్కడా కన్పించదే! బైబిల్లో “సొలొమోను” అని ఉంది కాని “సొలోమొను" అని లేదు. మన మిత్రుడు దీర్గాన్ని లేనిచోట పెట్టి ఉన్నచోట ఎత్తేశాడు!

     బైబిల్లో తప్పా? అయితే దాని సందేశంలో, సిద్ధాంతంలో, దాని ఉద్దేశంలో, దాని చర్చనీయాంశంలో తప్పుకనిపెట్టి చూపగలవాడై యుండాలి. బైబిలును బైబిలుగా అర్థం చేసికొని దానిలో తప్పులు కనిపెట్టగలవాడు పుట్టలేదే! ఒక రచనను చదివి దాన్ని గ్రహించలేని అనేక క్షుద్రరచనలు పుట్టకొక్కులులా లేచి ఎండిపోయాయి. దానిలో మనమిత్రుని "...బండారమొకటి.

     అయినా అతడు యిక్కడ చూపే తప్పేమి? 40లో నుండి సున్నా"0" చేతిప్రతుల్లో చెడిపోయి 4 మిగిలిందట. గనుక ఒకచోట 40 అని ఉంది (1 రాజులు 4:26) మరోచోట ఆ నాలుగు ప్రక్కన సున్నా చెరిగిపోయి 4 మిగిలితే, తర్జుమా చేసినవారు ఉన్నది ఉన్నట్టే తర్జుమా చేసినందున ఈ తేడా ఏర్పడింది. ఈలాటివి బైబిలు బండారమనే మన మిత్రుని క్షుద్రరచనలో ఎన్నిసార్లు జరిగాయో చూడు!

     ఎవడైనా బైబిలు బండారాన్ని ఆంగ్లంలోనికి గాని, మరి ఏ యితర భాషలోనికి గాని శతాబ్ధాల తరువాత, అంటే, వందలకొలది సంవత్సరాల తరువాత తర్జుమా చేశాడనుకో, అప్పుడు ఏమి జరుగుతుంది? నేటి ప్రింటింగు దోషాలే రేపటి తర్జుమాల దోషాలుగా మారిపోతాయి అనేది కామన్ సెన్స్! మన మిత్రుని హేతువాదానికి ఈలాటి కామన్ సెన్స్ కూడా లేదా? మన మిత్రుని హేతువాదం కామన్ సెన్స్ లేనిదేమో!

     ఏదియెలాగున్నా దీనికి సంబంధించి, మనమిత్రుని రచనలో దొర్లిన మానవ దోషాలను ముందుగానే సూచించాను. ఈలాటి దోషాలను రచయిత దోషాలుగా ఎంచని విశాలమైన మనస్సు నాకు ఉంది. మన మిత్రుని వాదం సంకుచితమయ్యింది. అందుకే మానవ దోషాలను రచనా దోషాలుగా ఎంచాడు. ఈ వివరణతో 21, 24, 25, 26 పాయింట్లను చర్చించకుండ విడిచిపెట్టాను.
21. పోత స్తంభాల పొడవు
     అతడు (హీరాము) రెండు ఇత్తడి స్తంభములను పోతపోసెను. ఒక్కొక్క స్తంభము పదునెనిమిది మూరల నిడివి గలది .... కుడిపార్శ్వపు స్తంభము యెత్తి దానికి యావేను అని పేరు పెట్టెను. ఎడమ పార్శ్వపు స్తంభమును యెత్తి దానికి బోయజు అని పేరు పెట్టెను. (1 రాజు 7:15-21).

     మందిరము ముందర ఉండుటకై ముప్పదియైదు మూరల యెత్తుగల రెండు స్తంభములను . చేయించెను. కుడితట్టుదానికి యావేను అనియు ఎడమతట్టుదానికి బోయాజు అనియు పేరు పెట్టెను. 2 దిన, 3:15, 17

22. జ్ఞానానికి ఫలితం?
     జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు; వివేచన కలిగిన నరుడు ధన్యుడు. సామె. 3:13 [ఇంకా చూడు: సామె 4:7, 8].

     విస్తారమైన జ్ఞానాభ్యాసముచేత విస్తారమైన దుఃఖము కలుగును; అధిక విద్య సంపాదించినవానికి అధిక శోకము కలుగును ప్రసంగి 1:18, [ఇంకా చూడు 1 కొరింథీ. 1:19].

    గమనిక: బైబిలులో యోబు, ప్రసంగి వంటి రచనలను కోట్ చేసేటప్పుడు వాటిని కోట్ చేసే వ్యక్తి జ్ఞాన వివేకం గలవాడైయుండాలి. ఆ రచనలు - ఆ వ్యక్తుల జీవితానుభవాల్లోనుండి జనులు ప్రత్యేకమైన పాఠాలు నేర్చుకోడానికే ఉద్దేశింపబడ్డాయి. వాటి సారాంశం ఈ క్రింద సంక్షిప్త వార్తల్లో యివ్వబడింది. దీనిని బట్టి బైబిలులో ఆ రచనలకు ఏలాటి స్థానమియ్యబడిందో తెలిసికొని మసలుకోవచ్చు!

                 యోబు - "యోబు గ్రంథమందు వినువింతగను శ్రమకు కారణంబు చర్చించబడె శ్రద్ధగ"
                 ప్రసంగి - "వేల్పులేనిపాటు వ్యర్థమే యిలయందు పలికె ప్రసంగి ప్రవీణుడై బహుగ"

     ప్రస్తుతానికి మనం యోబును వదలి ప్రసంగికి వద్దాం. ప్రసంగి 1; 18లో, ప్రసంగి యొక్క వ్యక్తిగతమైన అనుభవం వ్యక్తపరచబడింది. అది ఔనో కాదో అనే అనుమానం వస్తే మొదటి రెండు అధ్యాయాలు చదివి చూడు. పైగా అవి దేవుని మాటలు కావు. అది ప్రసంగి యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయమే: దాన్ని మనం అంగీకరించవచ్చు; నిరాకరించవచ్చు. అయితే అతని మాటలకు తీర్పు చెప్పాలంటే, అతనిలా విస్తారమైన జ్ఞానాభ్యాసం చేసినవాడే చెప్పాలి! అయినా మనలో విస్తారమైన జ్ఞానాభ్యాసం చేసినవాడెవడు? ఒక శాస్త్రంలో పరిచయముంటే, మరోదానిలో లేదు; ఉన్నదానిలోనైనా పూర్ణ జ్ఞానంలేదు. అలాటప్పుడు విస్తారమైన జ్ఞానాభ్యాసంవలన ఏలాటి లాభ నష్టాలున్నాయో నీకేం తెలుసు? సొలొమోనైతే విస్తారమైన జ్ఞానాభ్యాసం చేసినవాడు (1 రాజులు 4:29-34; దినవృ. 9:21-23), నేటికిని అతడు (Solomon the wise) జ్ఞానియైన సొలొమోను అనబడుతున్నాడు.

     అదెలాగున్నా దైవసందేశంనుండి కాకుండ, మానవ అభిప్రాయంనుండి తీసి, బైబిలులో అసంబద్ధాలను కూర్చడం అవివేకం కాదా? అందులో ముందు చూపిన లేఖనమేమో సామెతలకు సంబంధించింది. సామెతలు మానవుల మధ్య ఉపయోగింపబడే జ్ఞానసూక్తులే! ఆ జ్ఞానసూక్తులు భౌతిక ఆత్మసంబంధమైన జీవితానికి సంబంధించినవే - జ్ఞానం సంపాదించినవాడు, వివేచన ప్రధానంగా కలిగిన నరుడు ధన్యుడనేది వాస్తవం. ప్రసంగిలోని సొలొమోను యొక్క వ్యక్తిగతమైన అనుభవానికినీ, ఒక సాధారణ జీవితానికినీ మధ్య అసంబద్ధం కుదిర్చే అవకాశం లేదు. వ్యక్తిగతమైన అనుభవం సార్వత్రికం కానవసరం లేదు. అయినా ఆ రెండు లేఖనాలు ఒకే విజ్ఞాన స్థాయిని గూర్చి మాట్లాడినవి కావు. ఒకటి సాధారణమైనది రెండవది విస్తారమైనది. వీటికి పొందిక లేకపోతే సమస్య ఏముంది?

     పోతే 1 కొరింథీ 1:19కి వద్దాం. అక్కడ మానవ పరిమితి జ్ఞానానికినీ (Finite human wisdom) దేవుని అపరిమిత జ్ఞానానికినీ (God's infinite wisdom compared) మధ్యగల తారతమ్యం చర్చించబడింది. "-జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును; వివేకుల వివేకమును శూన్యపరతును" అని వ్రాయబడియున్నది! (ఇప్పుడు మన) "జ్ఞాని యేమయ్యెను? శాస్త్రియేమయ్యెను? ఈలోకపు తర్కవాది యేమయ్యెను ఈ లోకపు జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసియున్నాడు గదా?"

     1 కొరింథీ. 1లోని సూత్రాన్ని ఇప్పుడు అప్లై Apply చేసి చూద్దాం. బైబిలు దేవుని జ్ఞానమనుకొందాం: "బైబిలు బండారం" లోకజ్ఞానమనుకుందాం? బైబిలు బండారంలోని జ్ఞాని ఏమయ్యాడు? దాని పక్షమున వాదించిన తర్కవాదులేమయ్యారు? బైబిలు బండారములోని నిజ స్థితి బయలుపడేకొలది - "ఈ లోక జ్ఞానమును దేవుడు వెఱ్ఱితనముగా చేసియున్నాడన్న సంగతి తెలియడంలేదా? ఇంతకంటే ప్రాక్టికల్గా ఉండే యింకా ఏ ఉదాహరణ నీకు కావాలి?

      బైబిలును విమర్శిస్తున్న మన మిత్రుని మనస్సులో దాగిన ఆలోచన ఏమో అర్థమయ్యిందా? తన రచన ఏదో జ్ఞానంతో కూడినదైనట్టూ, బైబిలు దాన్ని కాదన్నట్టు - గనుక బైబిలు నిజమైన జ్ఞానాన్నే వ్యతిరేకించుచున్నట్టు భ్రమపడ్డాడు. తన రచన జ్ఞాన శూన్యమైనట్టు మన మిత్రుడు గ్రహించితే అంతే చాలు. విస్తారమైన జ్ఞానాభ్యాసం మన మిత్రుడు ఎలాగూ చేయలేదు గనుక దానివలన కలిగే దుఃఖం అతనికి తెలియదు: అధిక విద్య మన మిత్రుడు ఎలాగూ సంపాదించలేదు గనుక అధికశోకం సంగతి కూడా మన మిత్రునికి తెలియదు. తెలియనివాటి విషయం తెలిసినట్టు తాను పోజు కొట్టవలసిన అవసరం లేదు. గనుక పై లేఖనాల్లో అసంబద్ధముందంటేనే తన జ్ఞానపు స్థాయి ఎంతో మనకర్థమౌతుంది!
23. పెరుగుట విరుగుట ఒక్కటే!
     నీతిమంతులు తమాలవృక్షమువలె మొవ్యు వేయుదురు లెబానోను మీది దేవదారు వృక్షమువలె వారు ఎదుగుదురు; కీర్త. 92:12.
     భక్తిహీనుల ఆయస్సు తక్కువై పోవును. సామె. 10:27, [ఇంకా చూడు: సామె. 12 21 కీర్త 55:2 యోబు. 18:5_19]

     నీతిమంతులు నశించుట చూచి యెవరును దానిని మనస్సున పెట్టరు. యెష. 57 : 1

     ఇతరులకు పుట్టునట్లు వారికి (భక్తిహీనులకు) తెగులు పుట్టదు, , , , , వీరు యెల్లప్పుడు నిశ్చింతగలవారై ధనవృద్ధి చేసు కొందురు కీర్త. 73:5, 12.
     [ఇంకా చూడు: హెబ్రీ. 12:6; కీర్త. 73:3, 4; యోబు 21 7-9]

     గమనిక: అయినా పెరుగుట విరుగుట ఒక్కటే ఎలా అవుతుంది? అయితే లేఖనాలను వాటి సమయం, సందర్భం, ఉద్దేశం అనేవాటినుండి బయటకుతీసి, అవి ఉద్దేశించనివాటిని ఉద్దేశించినట్టు ఆరోపించి విమర్శించడం మాత్రం -ఒకని వెర్రితనాన్ని ప్రదర్శించడమే అవుతుంది. మన మిత్రుడు పై లేఖనాలను కోట్ చేసినప్పుడు - ఏ ఒక్కదాని సమయ సందర్భాన్నైనా గుర్తించియుంటే, యిలాటి విడ్డూరమైన అశ్చర్యాన్ని వ్యక్తపరచనవసరం లేకుండా పోయేదే. పైగా వాటిలో కొన్ని లేఖనాలను యధార్థంగా కోట్ చేసినవాడు కానేకాదు. యథార్ధతలేనిదే మన మిత్రుని వాస్తవ వాదమేమో! ఈ లాటి పాటు మన విత్రుడు దేనికి పడ్డాడో తెలియకుంది. నిజానికి తాను చెప్పుకున్నట్టు మన మిత్రుడు హేతువాదియే అయ్యుంటే ఈలాటి పనులు చేసియుండేవాడేనా? తాను కోట్ చేసిన లేఖనాలను గురించి అసలు బైబిలు చెప్పనుద్దేశించిన సందేశమేమో చూడు. దానికై ఒక్కొక్క లేఖనం ఏ సందర్భంలో వాడబడిందో గమనించు.

     (1) కీర్తన. 92:12కు పూర్వ సందేశం: "...యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి! నీ ఆలోచనలు అతిగంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వివేచింపరు. నిత్యనాశనము నొందుటకే గదా భక్తిహీనులు గడ్డివలె చిగుర్చుదురు. చెడు పనులు చేయువారందరు పుష్పించుదురు" నిజమేనా? (కీర్తన. 92:5-7) నిజమే భక్తిహీనులు చిగుర్చేదెందుకు? - నిత్యనాశనము నొందుటకే! భక్తిహీనులు చిగురించేదానికిని; నీతిమంతులు చిగురించే దానికిని మధ్యగల వ్యత్యాసం గమనించు. అదే అధ్యాయంలో:

     "నీతిమంతులు ఖర్జూరవృక్షమువలె మొవ్వవేయుదురు. లెబానోనుమీది దేవదారు వృక్షమువలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడినవారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు." - ఎందుకో? ఎందుకంటే - "నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయనయందు ఏ చేడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంక చిగురు పెట్టుచుందురు." (కీర్తన. 92.12-15) కీర్తన, 92లోని సందేశం కొంతవరకు తెలిసింది కదూ? ఇకపోతే, సామెత. 10:27కు వెళ్ళదాం.

     (2) సామెత, 10:27వ వచనాన్ని మన మిత్రుడు యథార్థంగా కోట్ చేయలేదు. "యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయనని తక్కువై పోవును" -ఇదీ అక్కడన్నది. భక్తిగలవాడు నైతిక సూత్రాలననుసరించడం వలన, తన దేహాన్ని శ్రద్ధగా కాపాడుకొంటాడు. అది దీర్ఘాయువునకు కారణ మౌతుంది. భక్తిహీనుడైతే తన దేహాన్ని పాడుచేసుకుంటాడు గనుక అతని ఆయుష్షు
తగ్గిపోతుందనే సాధారణమైన భావమే యిందులో యిమిడియుంది. సమస్యే లేదు గనుక సాగిపోదాం.

     (3) యెషయా 57:1 "నీతిమంతులు నశించుట చూచి యెవరును దానిని మనస్సున పెట్టరు" అనే మాటలను మన మిత్రుడు అసందర్భంగా కోట్ చేశాడు. -యూదా నాయకుల యొక్క బాధ్యతారహితమైన కార్యాలను వివరించుతూ యెషయా ఈ మాటలను ప్రయోగించాడు; చూడు. వారి నాయకులు - గ్రుడ్డివారు, తెలివిలేనివారు, మూగకుక్కలు, నిద్రాసక్తులు, తిండికి ఆత్రుతపడువారు, తృప్తిలేనివారు, దేనిని వివేచింపజాలనివారు, స్వప్రయోజనాన్నే విచారించువారు. "వారిట్లందురు-నేను ద్రాక్షారసము తెప్పించెదను. మనము మద్యము నిండారులగునట్లు త్రాగుదము రండి నేడు జరిగినట్టు రేపు మరి లక్షణముగా జరుగును? (యెషయా 56:10-12) యెషయా 57:1కి సందర్భమిది: ఇట్టి భ్రష్ట నాయకత్వాన్ని గద్దిస్తూ, వారిని గూర్చి పలికిన మాటలే యెషయా 57:1 లోనివి. -"నీతిమంతులు నశించుట చూచి యెవరును దానిని మనస్సున పెట్టరు." అంటే నాయకులు బాధ్యతారహితులై యున్నారనేదే యిక్కడ సందేశం! మన మిత్రుడు ఉద్దేశించింది యిక్కడ లేనే లేదు కదూ? గనుక తాను చూపనుద్దేశించిన సమస్య లేఖనాల్లో లేదు. గనుక ముందుకు సాగుదాం.

     (4) కీర్తన. 73:5, 12: ఈ లేఖనాన్ని కోట్ చేస్తూ మన మిత్రుడు చూప ప్రయత్నించింది బైబిలు సందేశం కాదు. అవి, భక్తిహీనుని స్థితిని చూచి, అతడు అనుభవించే జీవిత విధానాన్ని దాని తళుకును వెలుపటినుండి చూచి, మత్సరపడిన ఒక భక్తుని సొంత మనస్సులో నుండి బయలు వెడలిన వెర్రి మాటలే అవి అలాటి మాటలేనని చదువును నేర్చిన ప్రతివానికి అర్థమౌతాయి. కావాలంటే ఆ కీర్తనలోనుండి కొన్ని వచనాలు చదివి చూడు. అప్పుడు ఈ విషయం నీకే తెలుస్తుంది. 73వ కీర్తనకు రచయిత ఆసాపు. అతడు తన మనస్సును విప్పి, తనలో మెదలిన ఆలోచనలను యిలా తెలిపాడు:

     "..భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారినిబట్టి నేను మత్సరపడితిని. (ఎట్లని?) -మరణమందు వారికి యాతనలు లేవు. వారు పుష్టిగా నున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు. ఇతరులకు పట్టునట్లు వారికి తెగులు పుట్టదు.... వీరు ఎల్లప్పుడు నిశ్చింతగలవారై ధనవృద్ధి చేసికొందురు. నా హృదయమును నేను శుద్ధిచేసికొని యుండుట వ్యర్థమే. అయినను దీనిని తెలిసికొనవలెనని ఆలోచించినప్పుడు (ఆసాపును) నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి (భక్తిహీనుల) అంతమునుగూర్చి ధ్యానించువరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. (అయితే) నిశ్చయముగా నీవు వారిని (భక్తిహీనులను) కాలుజారు చోటనే ఉంచియున్నావు. వారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు. ...నా హృదయము మత్సరపడెను. . నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని." అని ఆసాపు తన పొరపాటును గ్రహించినప్పుడు ఒప్పుకున్నాడు కీర్తన. 73: 3-5, 12, 13; 16-18, 21, 23 చూడు. ఇదీ అక్కడ సందేశం.

     "ఇతరులకు పట్టునట్లు వారికి తెగులు పట్టదు. వీరు ఎల్లప్పుడు నిశ్చింతగలవారై ధనవృద్ధి చేసికొందురు" -అని భక్తిహీనులను గూర్చి (బైబిలు బోధించినట్టు) అనుకున్న మన విమర్శకుడు (కీర్తన. 73:5, 12: ఈ లేఖనాన్ని కోట్ చేయడం ద్వారా) -వారి స్థితిని అపార్థం చేసికొన్న అసాఫులా -తెలివిలేని పశుప్రాయుడైయున్నట్టు, దేవుని సన్నిధిని మృగమువంటివాడైయున్నట్టు తనకు తానే రుజువు చేసికొన్నాడు. ఇవి మననోటితో ఆరోపించనవసరం లేదు. బైబిల్లో అలాగే వ్రాయబడియుంది: కావాలంటే నీవే చదివి చూచుకో.

     యథార్థవర్తనుడైన ఆసాఫైతే తన తప్పును తాను గుర్తించిన తరువాత, తన తప్పుడు ఆలోచనల విషయమై పశ్చాత్తాపపడి భక్తిహీనుల విషయమై మత్సరపడి నందుకు, తాను వారి నిజ స్థితిని అపార్థం చేసికొన్నందుకు –"నా హృదయము మత్సరపడెను. నా అంతరింద్రియములలో నేను వ్యాకులపడితిని. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని. నీ సన్నిధిని మృగమువంటివాడనైతిని" అని వినయంతో ఒప్పుకున్నాడు కాని ఆసాపువలెనే భక్తిహీనుల స్థితిని అపార్థం చేసికొన్న మన మిత్రుడు కూడా అలా ఒప్పుకుంటాడా? తప్పును తప్పుగా ఒప్పుకోలేనివాడు హేతువాది ఎలా ఔతాడు? ఒకవేళ "హేతువాది"యంటే, తన తప్పును తాను గుర్తించి ఒప్పుకోలేనివాడేనా? ఏమి? ఏది ఏమైనా, "పెరుగుట విరుగుట ఒక్కటే"యని బైబిలు మాత్రం అనలేదు. గనుక మన మిత్రుని వ్యంగ్యపు పలుకులను విసర్జించి, సత్యాన్ని చేపట్టుదాం.


24. ఏ యెహోరాము ముందో?
     యూదా రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము యేలుబడిలో రెండవ సంవత్సరమందు (ఆహాజు కుమారుడైన) యెహోరాము అతనికి మారుగా రాజాయెను. (2 రాజులు 1:17).

     ఆహాబు కుమారుడును ఇశ్రాయేలువారికి రాజునైన యెహోరాము యేలుబడిలో అయిదవ సంవత్సరమందు యెహోషాపాతు రాజైయుండగా యూదా రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము యేలనారంభించెను 2 రాజు 8:16. 

25. అయిదుగురా? ఏడుగురా?
     (నెబూజరదాను) ఆయుధస్తుల మీద నియమింపబడియున్న అధిపతిని, పట్టణములో నుండి తీసికొని రాజ సముఖమును కనిపెట్టుకొని యుండువారిలో పట్టణమందు దొరికిన అయిదుగురిని, దేశపు జనులను సంఖ్య చేయువారికి అధిపతియొక్క లేఖకుని, సామాన్య జనులలో పట్టణమందు దొరికిన అరువదిమందిని పట్టుకొనెను. 2 రాజులు 25:19. 

     (నెబూజరదాను) పట్టణములోనుండి యోధులమీద నియమింపబడిన ఒక ఉద్యోగస్తుని, పట్టణములో దొరికిన రాజ సన్నిధిలో నిలుచు ఏడుగురు మనుష్యులను, దేశ సైన్యాధిపతియగు వానియొక్క లేఖకుని పట్టణపు మధ్య దొరికిన అరువదిమంది దేశప్రజలను పట్టుకొనెను. యిర్మీ. 52:25.
26. వయస్సెంత? ఏలిన కాలమెంత?
     యెహోయాకీను ఏల నారంభించినప్పుడు ఎనిమిదేండ్లవాడై యెరూషలేములో మూడు నెలల పది దినములేలెను. 2 దిన, 36:9.

యెహోయాకీను ఏలనారంభించినవ్పడు పదునెనిమిదేండ్లవాడై యెరూషలేమునందు మూడు మాసములేలెను. 2 రాజు, 24:8.
27. బయెషా చచ్చి చేసిన యుద్ధం!
     బయెషా తన పితరులతో కూడ నిద్రించి తిర్సాలో సమాధి చేయబడెను. అతనికి మారుగా అతని కుమారుడైన ఏలా రాజాయెను . . . . . యూదా రాజైన ఆసా యేలుబడిలో ఇరువై ఆరవ సంవత్సరమున బయెషా కుమారుడైన ఏలా తిర్సాయందు ఇశ్రాయేలు వారినందరిని యేల నారంభించి రెండు సంవత్సరములేలెను. 1 రాజు 16:6, 8.

     ఆసా ఏలుబడియందు ముప్పదియారవ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన బయెషా యూదావారిమీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆసాయొద్దకు రాకపోకలు జరుగకుండునట్లు రామాను కట్టించెను. 2 దిన, 16:1.

     [మొదటిదాని ప్రకారం ఆసా యేలుబడిలో 24వ సంవత్సరములో బయెషా మరణించాడు. కాని రెండవదాని ప్రకారం ఆసా యేలుబడిలో 36వ సంవత్సరములో అతని మీద బయెషా దండెత్తాడు.]

     గమనిక: ఈ పైన వ్రాయబడ్డవి మన మిత్రుని రచననుండి వచ్చినవే! అది బయేషా చచ్చి చేసిన యుద్ధం కాదు; ఏమి కాదు! అవి కాపి రచనలో మానవ దోషం దొర్లినందున వచ్చిన సమస్యయే. దానినంగీకరించడానికి నీవు ఎక్కడికో పోనవసరం లేదు. మన మిత్రుని రచనలోని మాటలనే జాగ్రత్తగా గమనించు - సమస్య తీరిపోతుంది!

     మొదటిదాని ప్రకారం - "యూదా రాజైన ఆసా యేలుబడిలో ఇరువై ఆరవ సంవత్సరమున (26) బయెషా కుమారుడైన ఏలా తిర్సాయందు....  రెండు సంవత్సరము లేలెను" (1 రాజులు 16:6, 8) మన మిత్రుడు దీన్ని వివరించుతూ తన (బ్రాకెట్లలో వ్రాసినదాన్ని గమనించు) = అతడు అక్కడ దాన్ని ఏమని వివరించుచున్నాడో చూచావా? పైన తాను చూపిన (26వ సంవత్సరమున) అనే మాటలు మానివేశాడు; దానికి బదులు 24వ సంవత్సరములో అంటున్నాడు; చూడు. 26 పోయి 24 ఎలా వచ్చింది? మధ్యలో అడ్డం వచ్చిన ఆ లైన్ల ఆ రెండు సంవత్సరాలను మింగివేశాయా? మరి అవి ఏమైనట్టు?? ఏమి కాలేదు. కేవలం 26, 24గా మారడానికి (human error) మానవ దోషం కారణమయ్యింది. ఈ అంకెల పొరపాట్లు రచనలో దొర్లిన మానవ దోషాలు మాత్రమే. ఇది ఎలాగో; పైది కూడా అలాగే జరిగిన దోషం. అది బయెషా చచ్చి చేసిన యుద్ధం కాదు. ఆసా యేలుబడిలో "పదునారవ సంవత్సరమున" అని వ్రాయవలసిన దానికి బదులు (ప్రతుల వ్రాతలో ఎప్పుడో) "ముప్పదియారవ సంవత్సరమున" అని పడియుంటే - ఇలాటి ప్రశ్న వచ్చింది. దాన్ని పట్టుకొని - “బయెషా వచ్చి చేసిన యుద్ధం!" అని హేళనగా మాట్లాడనక్కరలేదు. ఇలాటి పనులు పండితులు చేసేవి కావు. ఈలాటి ప్రతుల వ్రాత దోషాలను రచయిత దోషాలుగా ఎంచితే మన మిత్రుని రచన రచన అనే స్థాయినే కోల్పోతుంది!

     మన మిత్రుడు బైబిల్లో ఉన్న మాటలను చూచి వ్రాసేటప్పుడు - బైబిల్లో ఉన్న పదాలకు బదులు - బైబిలులో లేని పదాలు కూడా కొన్ని అతని రచనలోనికి వచ్చాయ్. వీటిలో కొన్నింటిని మన మిత్రుడు కావాలనే చొప్పించియుంటాడా? అది ఎలాగున్నా వందలాది సంవత్సరాలు బైబిలు చేతిప్రతులుగా కొనసాగింది గదా? అలాటప్పుడు దానిలో ఎన్ని దోషాలు దొర్లాలో! మన మిత్రుని రచనలో కేవలం 15 పేజీల్లోనే ఎన్ని దోషాలు దొర్లాయో చూద్దామా? ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే!

పేజీ
లైను
తప్పు
రైటు
60
10
స్థిరపరచబడెనో
సిద్ధపరచబడెనో
67
8
స్వస్థపరచకుండునట్లు
స్వస్థపరచబడకుండునట్లు
67
1
దాని
దాని దాని
71
24
శోధించెను
పరిశోధించెను
73
14
సంపూర్ణమైయున్నది
సమీపించియున్నది
     ఇలాటి దోషాలు "బైబిలు బండారం"లోకి వచ్చినందున దాన్ని విమర్శించడం లేదు కదా? మరి అలాటివే బైబిలులో జరిగితే వాటిని విమర్శింపవచ్చునా? ఇలాటివి కాకపొతే విమర్శించడానికి బైబిల్లో యింకా ఏవీ దొరకవని మన మిత్రుడు వీటిమీద పడ్డాడా? లేక చదివి విషయాలను గ్రహించలేక మన మిత్రుడు వీటిని తప్పులనుకున్నాడా? విషయ పరిజ్ఞానం లేకుండా విమర్శించేది మూర్ఖవాదం కాదా? అలాటప్పుడు మన మిత్రుని బైబిలు బండారం మూర్ఖవాదమనడంలో తప్పేముంది? లేక విషయ పరిజ్ఞానం లేకుండా మూర్ఖవాదమే - హేతువాదమా? కాదు గదూ? ఎలా ఆలోచించినా, బైబిలు బండారంలో చెప్పుకోదగ్గ ఏ వివేకము లేదు.
28. అహజ్యా వయస్సు
     అహజ్యా యేల నారంభించినప్పుడు ఇరువది రెండు యేండ్లవాడై యుండి యెరూషలేములో ఒక సంవత్సర మేలెను. 2 రాజు 8:26. 

     ఆహజ్యా యేలనారంభించినప్పుడు నలువది రెండు యేండ్లవాడై యెరూషలేములో ఒక సంవత్సరమేలేను. 2 దిన 22:2.

గమనిక: వీటిపై మన మిత్రుడు పెట్టిన కేసు, ఆ కేసు పెట్టడంలో మన మిత్రుని పాండిత్యం చదువరికి అర్థమయ్యింది గదా? చూచి వ్రాత వ్రాసేటప్పుడు ఎప్పుడో 22కు బదులు 42 అని పడిందట! దీన్ని పట్టుకున్నదే మన మిత్రుని పాండిత్యం! గనుక పోనిద్దాం.
29. యోసేపు ఎవరి కుమారుడు?
     (యేసు) యోసేపు కుమారుడని యెంచబడెను. యోసేపు హేలీకి... . కుమారుడై యుండెను. లూకా 3:23.

     యాకోబు మరియ భర్తయైన యోసేపును కనెను. ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. మత్త 1:16. 

గమనిక: లేఖనాలలో - "యోసేపు హేలీ కుమారుడై యుండెను" అని లూకా 3:23లోనూ, యాకోబు యోసేపును కనెను అని మత్తయి 1:16లోను ఉందే; యింతకు యోసేపు ఎవని కుమారుడు? అని మన మిత్రుడు అడిగిన ప్రశ్న చదువరికి వెంటనే అర్ధమైయుంటుందని తలంచుచున్నా వాస్తవాల నంగీకరించే మనస్సుంటే పై లేఖనాల్లో ఏ సమస్యా లేదు. ఎలాగో జాగ్రత్తగా చూడు.

     ఒకవేళ హేలీ యోసేపును కనెనని ఒక లేఖనంలోనూ, యాకోబుకూడా అదే యోసేపును కనెను అని మరొక లేఖనంలోనూ ఉండియుంటే - అది కొంచెం సమస్యగా తోచేదేమో! ఆ సందర్భంలో హేలీయే యాకోబని రుజువు చేయవలసి ఉండేదే! ఇప్పుడు మనకు అలాటి సమస్య కూడా లేదు. ఎలాగంటే యోసేపు హేలీకి కుమారుడై యుండడానికి, హేలీ యోసేపును “కనలేదు”! యోసేపును కన్నది మత్తయిలో సూచింపబడినట్టు యాకోబే గనుక జన్మనుబట్టి యోసేపు యాకోబుకు కన్నకుమారుడు. మత్తయిలో యోసేపు వంశావళి యివ్వబడింది. అదీ అక్కడున్న సందేశం.

     ఒకడు మరొకని కేవలం కన్నదాన్ని బట్టి మాత్రమే కుమారుడు కానవసరం లేదు. ఆయా దేశీయ చట్టాలను బట్టి, కనకుండనే ఒకడు మరియొకని కుమారుడయ్యే అవకాశముంది. దానిలో దత్తస్వీకార పద్ధతి ఒకటి. యూదుల్లో యిది ఒక ప్రత్యేకమైన విధంగా జరుగుతుంది. వాస్తవానికి లూకా, “క్రీస్తు అనబడిన యేసును" కన్న మరియ యొక్క వంశావళిని గూర్చి వ్రాసాడు. మరియ హేలీ కుమార్తె (Talmudic writings Jewish Tradition, Light foot - Horae Hebraise on LK 3:28) మరియకు అన్నదమ్ములున్నట్టు లేదు.

     అలాటి పరిస్థితుల్లో - యూదుల ధర్మశాస్త్రాన్ని బట్టి, హేలీ యొక్క స్వాస్థ్యం తన కుమార్తెకు యియ్యబడుతుంది (సంఖ్యా 27:8). కాని ఆమె ఆదే గోత్రానికి చెందిన యువకుని పెండ్లి చేసికోవాలి (సంఖ్యా 6:6-9). గనుక హేలీ కుమార్తెయైన మరియ, అదే గోత్రానికి చెందిన యాకోబు కుమారుడైన యోసేపును పెండ్లి చేసికొన్నది! అప్పుడే హేలీ స్వాస్థ్యము మరియకు చెందుతుంది. అయితే ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము స్త్రీ పేరున గాక, తన భర్త పేరునే అది చెలామణియౌతుంది. ఈ విధంగా యోసేపు హేలీకి కుమారుడనబడ్డాడు. అంటే - మరియ భర్తయైన యోసేపును కన్నది యాకోబే అయినా, స్వాస్థ్యానికి వారసుడుగా అతడు హేలీకి కుమారుడౌతాడు. - జన్మను బట్టి యాకోబు కుమారుడైన యోసేపు, వారసత్వాన్నిబట్టి (legal heir) హేలీ కుమారుడౌతాడు! ఇందులో ఏ చట్టాన్ని బట్టి చూచినా సమస్య లేదు.

     ఇది మన మిత్రునికి తెలియనందున అతనికి సమస్యగా తోచి ఉంటుంది కాని, అసలు యిందులో రాద్ధాంతం చేయవలసిన అవసరం లేదు సూమీ. నా తమ్ముని కుమారుని చట్టాన్ని బట్టి నేను దత్తత తీసికొంటే - కన్నది నా తమ్ముడైనా, ఆ బిడ్డ నా కుమారుడై ఉండడంలో ఎలా సమస్య లేదో, అలాగే పై లేఖనాల్లో ఏ సమస్యా లేదు. అంతగా దానిలో ఎదైన ఉందనుకుంటే, అది పామరత్వమే. కాని అతని విమర్శలో పండితులు అంతకంటె ఆలోచింపదగిన ఏ పాయింటు లేదు! ఇంత విపరీతమయిన రచన కోర్టుల్లో ఎలా తిరిగి వచ్చిందో అర్థమే కాకుండా ఉంది!
30. ద్రాక్షారసము నిషేధమా? కాదా?
     ద్రాక్షారసము మిక్కిలి యెర్రబడగను గిన్నెలో తళతళలాడు చుండగను త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకుము. పిమ్మట అది సర్పమువలె కరచును. సామె. 23:31,32.

     యెద్దులకేమి గొర్రెలకేమి ద్రాక్షారసమునకేమి మద్యమునకేమి నీవు కోరుదానికి
ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనముచేసి నీవు నీ యింటివారును నీ యింటనుండు లేవీయులును సంతోషింపవలెను. ద్వితీ, 14:26. 

     గమనిక: సందర్భమెక్కడిదో సమస్య మన మిత్రుడు ఎక్కడ పెడుతున్నాడో చదువరి గమనించి ఉంటాడా? పైన ఉదహరింపబడిన లేఖనాలు కేవలం యూదుల సాంఘీక జీవిత విధానంలోనివి మాత్రమే! ద్రాక్షాతోటలు వారి వ్యవసాయంలో ముఖ్యమైన భాగం. ద్రాక్షాపండు వారి ఆహారంలోని భాగం. అవి లేకపోతే వాటిలో లోటును యూదులు గుర్తించేవారు (సంఖ్యా 20:5). ద్రాక్షారసపానము వారి సాంఘిక విందులలో ఒకభాగం (యోహాను 2:1- 11). కేవలం ఆలాటి విందుల్లోనే తప్ప మిగిలిన సమయంలో మధ్యపానం యూదులకు నిషేధమే.

     ద్రాక్షారస పానం విషయంలో యూదుల భావన యిలా ఉంటుంది: "I had a drink in the feast but I am not a drunkard" ఇలాటి పరిస్థితికి చోటిచ్చి కూడా, ఎవ్వడూ త్రాగుబోతు కాకుండ ఉండాలని వారి సాంఘీక చట్టం ఆదేశించింది. అంటే, వారి విందు సమయాల్లోనే తప్ప మామూలుగా త్రాగడానికి వారి సాంఘీక చట్టం అంగీ కరించదు. "మద్యము త్రాగుదమని వేకువనేలేచి ద్రాక్షారసము మంటపుట్టువరకు చాలా రాత్రివరకు పానము చేయువారికి శ్రమ" (యెషయా 5:11). విందుల్లో ఉల్లాసం కొరకు త్రాగినా, త్రాగుబోతులు కాకుండ తమ్మును తాము కాపాడుకొనడంలో యూదులు ఎక్కువ (self control) నిగ్రహాన్ని ప్రదర్శించవలసినవారై యుంటారు: ఈ పరిస్థితుల్లో వారికి సహాయపడడానికి —ఈ విధమైన హెచ్చరికలు వారికి యివ్వబడ్డాయి; చూడు.

     “ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము? ఎవరికి జగడములు? ఎవరికి చింత? ఎవరికి హేతువులేని గాయములు? ఎవరికి మంద దృష్టి? ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను (అంటే ఎక్కువ మత్తు కలిగించునదిగా ఉండగను) గిన్నెలో తళతళలాడుచుండగను త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకుము. పిమ్మట అది సర్పమువలె కరచును. కట్లపాము వలె కాటు వేయును విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. నీవు వెర్రిమాటలు పలుకుదువు. నీవు నడిసముద్రమున పండుకొను వానివలెనుందువు. నన్నుకొట్టినను నాకు నొప్పి కలుగలేదు. నా మీద దెబ్బలు పడినను నాకు తెలియదు. నేనెప్పుడు నిద్ర మేల్కొందును? మరల దాని వెదకుదును అని నీవనుకొందువు" (సామె. 23:29-35) ఇది త్రాగుబోతు యొక్క పరిస్థితి, ఇట్టి పరిస్థితికి వచ్చే అలవాటుగాని, ఇట్టి పరిస్థితికి తెచ్చే మద్యంగాని యూదులకు నిషేధమే, అయితే వారి సాంఘిక విందుల్లో సాధారణమైన ద్రాక్షారసము నిషేధం కాదు. ఇది కూడా వారిలో (1) గుడారంలో సేవచేయు యాజకులకూ, (2) నజీరు చేయబడినవారికి నిషేధమే (లేవీ. 10:9, సఖ్యా 6:3) ISBE P 880 D MiallEdwards.

     ఆ సంగతులు ఎలాగున్నా అది కేవలం యూదులకు- కనాను దేశానికి, వారి సాంఘీక విందులకు- ధర్మశాస్త్ర నియమానికి సంబంధించినది మాత్రమే. అయితే యివి క్రైస్తవ్యానికి సంబంధించిన లేఖనాలని మన మిత్రుడు భ్రమపడ్డాడు: అది మన మిత్రుని మొదటి తప్పు! యూదుల సాంఘీక చట్టాన్ని క్రైస్తవ జీవితానికి వర్తింపజేసి, చేయకూడని మరొక తప్పును మన మిత్రుడు చేశాడు. "ఆ తప్పేమి?" అని అడుగుతావేమో? క్రొత్త ద్రాక్షారసాన్ని (క్రొత్త నిబంధన-క్రైస్తవ్యాన్ని పాత తిత్తులలో (యూదుల ధర్మశాస్త్రపు ఆచార వ్యవహారాల్లో) అతడు పోశాడు. దీన్ని బైబిలు నిషేధించింది (మత్తయి 9:27: మార్కు 2:22: లూకా 5:35 చూడు). బైబిలు నిషేధించిన దాన్ని చేసి, దానిలో సమస్య ఉందంటాడేమి? ఇలాటిదేనా హేతువాదమంటే?

     క్రొత్త నిబంధన ప్రకారం- సంఘపు పెద్దలు మద్యపానీయులు కాకూడదు (తీతు 1:6-7:1తిమోతి 3:3), క్రైస్తవ సాంఘీక జీవనంలో త్రాగుబోతుల విందులు నిషేధమే (1 పేతురు 4:3) "మరియు మద్యముతో మత్తులై యుండకుడి అందులో దుర్వ్యాపారము కలదు" అని క్రైస్తవులు వ్యక్తిగతంగా హెచ్చరింపబడ్డారు (ఎఫెసీ, 5:18) క్రైస్తవులు ఈ నియమాన్ని ఎంత జాగ్రత్తగా పాటించారో తిమోతి నిజ జీవిత అనుభవమే సూచిస్తుంది. - తిమోతికి తరచుగా బలహీనత, కడుపు జబ్బు వచ్చేది. అది వచ్చినపుడెల్లా, వైద్యం అంతగా అందుబాటులో లేని ఆ దినాల్లో తన కడుపు జబ్బును అణచుకొనడానికి తిమోతి నీళ్ళే త్రాగుతుండేవాడట. ఆ పరిస్థితిని ఎరిగిన పౌలు అతనిని యిలా ఆదరించాడు: “ఇకమీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము” (1తిమోతి 5:23). అయితే యిది త్రాగుడుకైన లైసెన్సు ఏ మాత్రం కాదు సుమీ!

     ఇలాటి పరిస్థితుల్లో- ప్రశ్న ఎవరికి? అనేది కూడా నిర్దేశింపకుండా, క్రైస్తవుల మీద దాన్ని విసరినట్టు -ద్రాక్షారసం నిషేధమా! కాదా? అని అడగడం నియమం ఎరుగకుండా మాట్లాడటమే అవుతుంది. నియమం ఎరుగకుండా మాట్లాడేదాన్నే హేతువాదమంటారు కాబోలు!
31. శోధన అంటే యాకోబుకు ఆనందం; యేసుకు?
     మీరు నానా విధములైన శోధనలతో పడునప్పుడు అది మహానందమని యెంచుకొనుడి, యాకో. 1:2, 3. 

     మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి మమ్ము తప్పించుము. మత్త. 6:13. 

     గమనిక: మన మిత్రుడు కోట్ చేసిన పై రెండు లేఖనాలు - రెండు నిబంధనల్లో నిలిచియున్న జనులకు సంబంధించిన హెచ్చరికలు; ఈ సంగతి చదువరికి అర్థమయ్యిందా? వేరు వేరు నిబంధనల మధ్య అసంబద్ధం చూడడం అసమంజసం. అర్థం కాకపోతే జాగ్రత్తగా చూడు.

     యేసు సశరీరుడైయున్న దినాల్లో - ఆయన ధర్మశాస్త్రం క్రింద ఉన్నారు (గలతీ. 4:4-5), ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల వచనాలను నెరవేర్చుతున్నారు (మత్తయి 5:17-18) ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి తీసివేస్తేనే (కొలస్సీ 2:10-13) క్రొత్త నిబంధన అమల్లోకి వస్తుంది (హెబ్రీ. 8:13; గలతీ 4:21-30; రోమా 7:1-4 వగైరాలు చూడు). దానికి ముందు ధర్మశాస్త్ర కాలంలో యేసు తన అపొస్తలులకు బోధిస్తూ "మమ్మను శోధనలోనికి తేక దుష్టునినుండి తప్పించుము" అని తెలిపారు. మత్తయి 6:13; మత్తయి 6:17-18, అనే లేఖనాలు ఆ సమయ సందర్భాన్నిసూచిస్తున్నాయ్ చూడు. అప్పటికి యేసు నామమున ప్రార్థించడం యింకా ప్రారంభం కాలేదు.

     మత్తయి 6:13 సందేశాన్నియేసు తన అపొస్తలులకు యిచ్చిన తరువాత సుమారు 3 సంవత్సరాలు గడచిపోయాయి. యేసు లోకమునుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చిందని గుర్తించారు (యోహాను 13). ఒకనాటి రాత్రి (ఆయన అప్పగింప బడకముందు) భోజనం దగ్గర కూర్చున్న తన అపొస్తలులతో మాట్లాడుతూ .వారితో “ఇదివరకు మీరేమియు నా పేరట అడుగలేదు; మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును" అని చెప్పారు (యోహాను 13:1; 16:23, 24). గనుక యేసు నామము లేకుండ అపొస్తలులకు ఆయన నేర్పించిన ప్రార్థన ధర్మశాస్త్ర కాలానికి సంబంధించినది. అయితే యేసు నామమున వారు చేసిన ప్రార్థనయే క్రొత్త నిబంధనకు సంబంధించినది (కొలస్సీ 3:17). ఈ వ్యత్యాసాన్ని గుర్తించాలి.

    అయితే "మీరు నానా విధమైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని యెంచుకొనుడి" అనే యాకోబు హెచ్చరిక క్రొత్త నిబంధనకు సంబంధించినదే (యాకోబు 1:2,3). అతడు హెచ్చరించిన సందర్భం: క్రైస్తవుల విశ్వాసానికి కలిగే పరీక్షను, దానివలన వారికి కలిగే మేలును సూచించింది. గనుక - “నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి. మీరు సంపూర్ణులును అనూనాంగులును, ఏ విషయములోనైనను కొదువలేనివారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి” అని యాకోబు హెచ్చరించాడు (యాకోబు 1:2-4).

    గనుక యేసు - తన శిష్యులను శోధన విషయమై హెచ్చరించిన సమయం, సందర్భం, నిబంధన, వగైరాలు వేరు: యాకోబు శోధన విషయమై హెచ్చరించిన సమయం, సందర్భం, నిబంధన, వగైరాలు వేరు. పైగా బైబిల్లో, "పాతబట్టను - పాత నిబంధనకూ; క్రొత్త బట్టను క్రొత్త నిబంధనకు దీటుగా పోల్చి - ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు; వేసినయెడల ఆ మాసిక బట్టను వెలితి పరచును, చినుగు మరి ఎక్కువగునని" ఆ యేసే తేటపరిస్తే, బైబిలు చదివినప్పుడు ఈ సంగతి మన మిత్రునికి తెలియ లేదా? (మత్తయి 9:16).

    ఏది చేయకూడదని బైబిలు నిషేధించిందో, దాన్నే చేస్తూ - అంటే (పాతబట్టకు క్రొత్త బట్ట మాసిక వేసి); క్రొత్తది పాతదానిని వెలితిపరచగా చూచి-ఇటు చూడు ఈ రెండు కలవలేదని మన మిత్రుడు పలకడం అర్థరహితంగా ఉండలేదా? ఇలాటి అవివేకపు మాటలు పండితుని చర్చలా ముమ్మాటికీ లేదు. ఆయా సమయ, సందర్భాల్లో బైబిలు ఏది చెప్పిందో అదే ఖాయం! బైబిలు ఖాయం చేసిన దానిని కాదని మన మిత్రుని హేతువాదం రుజువు చేయలేకపోయింది! ఒక రాజ్యాంగ చట్టాన్ని పూర్ణంగా ఎరిగిన న్యాయవాదియే దాన్ని చర్చించ, వ్యాఖ్యానించ సమర్దుడైనట్టు -బైబిల్లో ఉన్న రెండు వేర్వేరు రాజ్యాంగ చట్టాలను క్షుణ్ణంగా ఎరిగినవాడే దాన్ని వివరించ సమర్దుడు! మన విమర్శకునికి యిలాటి జ్ఞానం శూన్యంగా ఉన్నట్టు అడుగడుగునా కన్పిస్తుంది. ఇలాటి వాడు బైబిలును విమర్శింపదగునా? కాకపోతే తనకు స్వాతంత్య్రం ఉన్నదని ఈ అజ్ఞానపు పనికి దిగాడు. గాని, నిజంగా, జ్ఞానియైనందున, సత్యాన్నిఎరిగినవాడైనందున, పాఠకులకు మేలు చేయగోరినందున ఈ పనికి పూనుకోలేదని తేలిపోయింది. - జ్ఞానం లేనిదాన్నే జ్ఞానమైనట్టు ప్రోత్సహించే మన మిత్రుని కోవకు చెందినవారిని గూర్చి యింకా ఏమనాలో తెలియకుంది.
32. మూగవాడి కేక!
     అతడు (యేసు) కేకలు వేయడు; అరవడు; తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. యెష, 42:2.

     యేసు-ఎలోయి, ఎలోయిలామా, సబక్తానీ, అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నాదేవా, నాదేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్ధము. మార్కు 15:34. 

     గమనిక: మన విమర్శకుడు తన రచనలోని మొదటి భాగంలో - అంటే అవతారికలో యిలా అన్నాడు - "ప్రవక్తలు క్రైస్తవ మతానికీ పట్టుకొమ్మలు. ఎందుకంటే క్రీస్తు రాకను గూర్చి ముందుగనే వారు ప్రవచించినట్లు బైబిలు అనునాయులు విశ్వసిస్తున్నారు కాని నిజానికి ప్రవక్తలు ఆలాంటి ప్రవచనాలు చేయలేదు" (అవతారిక పేజీ 21:26– 28 లైన్లు)

     మొదటి భాగంలో మన మిత్రుని వాదమేమో చదువరి గుర్తించి ఉంటాడా? లేకపోతే చూడు: పాత నిబంధనలో క్రీస్తు రాకను గూర్చి ముందుగా ప్రవచించిన ప్రవచనాలు లేవని స్థాపించడానికి అతడు ప్రయత్నించాడు. అయితే యిక్కడ, తన అసంబద్ధాల్లో ఏమి జరిగింది? తన అవతారికలో తాను చెప్పినదానికి వ్యతిరేకమైన దానిని తానే తన అసంబద్ధాలలో స్థాపించబూనుకున్నాడు! బైబిల్లో అసంబద్ధాలంటూ ప్రారంభించి వాటిలో ఏ ఒక్కటీ రుజువు చేయలేకపోగా, బైబిలును విమర్శించడంలో ఉపయోగించుకున్న తన కత్తితో తానే పొడుచుకున్నాడు చూడు!

     అది ఎలాగంటావేమో! పాత నిబంధన ప్రవక్తలు, అందులో ప్రత్యేకంగా ప్రవక్తయైన యెషయా యేసును గూర్చి ప్రవచించినట్టు మన మిత్రుడు తన అసంబద్ధాలలో స్థాపించ బూనుకున్నాడు.

     యెషయా 42:2ను మన మిత్రుడు పైన కోట్ చేశాడు గమనించావా? "అతడు (యేసు) కేకలు వేయడు, అరవడు తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు" - అతడు” అనే ఈ లేఖనంలోని మాటకు భావంగా- "యేసు" అనే పదం బైబిలులో వ్రాయబడలేదు. “అతడు" అనే పదానికి యేసు అనే భావం మన మిత్రునికి ఎక్కడనుండి వచ్చింది? పాత నిబంధనలో యేసును గూర్చిన ప్రవచనాలున్నాయని అంగీకరించకపోతే - తన రచనలో - అతడు అంటే "యేసు" అని మన మిత్రుడు ఎలా వ్రాయ గలుగుతాడు. అంటే యిప్పుడైనా మన మిత్రుడు చేసిన పని అర్థమయ్యిందా?

     యెషయా అనే పాత నిబంధన ప్రవక్త యేసును గూర్చి ముందుగా ప్రవచించాడనీ, ప్రవచనానికి నెరవేర్పుగా వచ్చిన యేసు తన్ను గూర్చిన ప్రవచనాన్ని ఉల్లంఘించాడనీ మన మిత్రుడు యిక్కడ మాట్లాడుతున్నాడు. తనను గూర్చిన ప్రవచనాన్ని యేసు ఉల్లంఘించాడో లేదో తరువాత చూద్దాం కాని; మిత్రుడు బ్రహ్మం తన వాదాన్ని తానే ఉల్లంఘించి తన్ను తానే ఖండించుకొంటున్నాడే! అది గమనించావా? ఇదే అతని రచనలోని తమాషా! అసంబద్ధమంటే, దాని అసలు రూపం యిదే! ఇలాటివి బైబిలులో ఎవడూ చూపలేడు! పైగా యిది అసంబద్ధం కాదని ఎవడూ దీన్ని తిప్పి వేయలేడు!

     "అతడు కేకలు వేయడు అరవడు తన కంఠస్వరము వీధిలో వినబడనియ్యుడు" అని అంటే - అతడు అల్లరి చిల్లరిగా ప్రవర్తించేవాడు కాదని దాని భావం. అయినా యేసు - "ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ" అని కేక వేసింది వీధిలో కాదే; అది కల్వరి సిలువలోనే! పైగా ఆయన ఆ కేక వేస్తూ పాత నిబంధనలో మరో ప్రవచనాన్ని నెరవేర్చాడు, కీర్తన. 22:1 చూడు. ఏ భాషలో ఆ కేక వ్రాయబడిందో, ఆ భాషలోనే ఆయన దాన్ని నెరవేర్చాడు. ఈ నెరవేర్పును కూడా మన మిత్రుడే తెలిపాడు చూడు (మార్కు 15:34). ఇవి తన మెడకు చుట్టుకుంటాయని తెలియక, వాటిని ఒక చోటికి తెచ్చాడు.

     ఇంతకు మన మిత్రుడు విడ్డూరంగా మాట్లాడాడు కాని, యేసు మూగవాడెలా అవుతాడు? ఆయన వేలాదిమందికి బోధించాడు (మత్తయి 5:1-2; 8:28, 29). తన్ను బంధించి పట్టుకొని పోవడానికి పంపబడిన బంట్రౌతులు ఆయన మాటలకు మంత్రముగ్దులైనట్టు, తాము వచ్చిన పనిని సయితం మరచి తిరిగి వెళ్లి - "ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదనిరి" (యోహాను 7:45-49), గనుక యేసును మూగవాడని అనటం బైబిలుకు విరోధంగానే జరిగింది.

     ఏదియెలాగున్నా యేసు సిలువపై కేక వేసినట్టు మన మిత్రుడే ఒప్పుకున్నాడు. అతడు దాన్ని కేవలం ఒప్పుకొనడం మాత్రమే కాదు; అతడు దాన్ని స్థిరపరచడానికి కూడా ప్రయత్నించాడు. ఆ కేక హెబ్రీ భాషలోనిది; దాని మూలం కీర్తన. 22:1లో ఉంది. దాని నెరవేర్పు - మార్కు 15:34లో ఉంది! మన మిత్రుడు ఎటుపోయినా తప్పించుకోలేని వలను తనకొరకు తానే పన్నుకొని, అందులోబడి తన్నుకులాడుతున్నాడు. చూచావా?

     క్రీస్తును గూర్చిన ప్రవచనాలు లేవని వాదించినవాడు, తిరిగి బైబిలులో ప్రవచనాలున్నాయని వాదింప బూనుకున్నాడంటే - అంతకంటే అసంబద్ధం మరొకటి లేదు. పైగా బైబిలులో ప్రవచనాలున్నాయని ఒప్పుకున్న మన మిత్రుడు తన నాస్థిక వాదాన్నీ మానవతా వాదాన్నీ తనే నరికి వేసుకొంటున్నాడు. బైబిలు బండారమనే మన మిత్రుని రచనలో ఉన్న తార్కిక జ్ఞానం యిలాటిదే! కావాలంటే మళ్ళీ చూచుకో! దీన్ని గురించి పరిచయంలో యింకా తేటగా ఉంటుంది చూడు.
33. కట్టిన గుడిలో వశిస్తాడా, లేదా?
    ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు, అపొ.  7:47_50.
     నీవు నివాసము చేయుటకు నేను మందిరముకట్టించియున్నాను. సదాకాలము అందులో నీవు నివసించుటకై నేనొక స్థలము యేర్పరచియున్నాను. 1 రాజు 8:13. 

     గమనిక: పై లేఖనాల్లో అసంబద్ధానికి తావులేదు. పైన చూపబడిన లేఖనం సర్వోన్నతుడు హస్తకృతాలయాల్లో నివసింపడు అని తెలిపింది. దానికి విరోధంగా ఉందని మన మిత్రుడు కోట్ చేసిన రెండవ లేఖనం సర్వోన్నతుడు హస్తకృతాలయాల్లో నివసిస్తాడని ఒకవేళ వ్రాయబడియుంటే, అపుడు కూడా ఆ రెండింటిని ఆయా సమయ సందర్భాలను బట్టి పరిశీలించి-అవి పరస్పర విరుద్ధాలుగా ఉన్నాయో లేవో తేల్చుకొనేవారమే. అయితే రెండో లేఖనం, 1 రాజులు 8:13లో - సర్వోన్నతుడు హస్తకృతాలయాల్లో నివశిస్తాడని లేదే! అలా లేనప్పుడు అవి అసంబద్ధంగా ఉన్నట్టు తార్కిక జ్ఞానానికి ఎలా తోస్తుంది? అంటే మన మిత్రుని విమర్శ తార్కిక జ్ఞాన శూన్యమైన విమర్శయని తేలిపోయింది కదూ? మన మిత్రుని
హేతువాదం తార్కిక జ్ఞాన శూన్యమేనేమో!

     అదలావుంచి, పై లేఖనాలకు సంబంధించిన బైబిలు ఉపదేశమేమో పరిశీలించి చూద్దాం. అపొ. 7:46-50లో -"అతడు (దావీదు) దేవుని దయపొంది యాకోబుయొక్క దేవుని నివాసస్థలము కట్టగోరెను. అయితే సొలొమోను ఆయనకొరకు మందిరము కట్టించెను. అయినను -ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము, మీరు నాకొరకు ఏలాటి మందిరము కట్టుదురు నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నియు నా హస్తకృతములు కావా? అని ప్రభువు చెప్పుచున్నాడు - అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు."పాత నిబంధన ప్రవక్తల వచనాల్లోనే కాదు; క్రొత్త నిబంధనలో కూడా దేవుని నివాస స్థలాన్ని గూర్చి అలాగే సూచింపబడింది చూడు: "జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు? (అపొ. 17:24).

     పోతే, మన మిత్రుడు కోట్ చేసిన రెండో లేఖనాన్ని పరిశీలించుదాం: "నీవు నివాసము చేయుటకు నేను మందిరము కట్టించియున్నాను." అని రాజైన సొలొమోను తన పనిని, తన హృదయ వాంఛను దేవునికి విన్నవించుకొన్నాడు (1 రాజులు 8:13) అయితే బైబిల్లో తప్పు కనిపెట్ట ప్రయత్నించిన, మన మిత్రుడు ఆగినట్టు - మాట్లాడుతున్న సొలొమోను అంతటితోనే ఆగలేదు. అతని తరువాత మాటలే సమస్యను పరిష్కరిస్తున్నాయి. నేను మందిరము కట్టించిన మాట వాస్తవమే గాని ఆయన అందులో నివసింపడనేది సొలొమోను యొక్క ఘోషయైయుంది. సొలొమోను అప్పుడే యిలా అన్నాడు: అయిన" నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశ మహాకాశముల సహితము నిన్ను పట్టజాలవు; నేను కట్టించిన యీ మందిరము ఏలాగు పట్టును?" అని సొలొమోను వినయంతో అక్కడే అంగీకరిస్తున్నాడు (1 రాజులు 8:27 చూడు) అంటే అతని హృదయ వాంఛ ఏమో - తాను కట్టించిన ఆలయంలో యెహోవా నివసించాలని కాని వాస్తవమేమో, నిశ్చయంగా ఆయన ఈ లోకమందు నివాసం చేయడని, సొలొమోను గుర్తిస్తే - "కట్టిన గుడిలో వశిస్తాడా? లేదా?" అని అడగడంలో జ్ఞానమేమైనా ఉందా? చూచావు కదూ మన మిత్రుని "...బండారం" ఇదీ, ఆయన హేతువాదపు స్థాయి!
34. సర్వాంతర్యామి దృష్టి లోపం!
     నాకు కనబడకుండ రహస్య స్థలములలో దాగ గలవాడెవడైన గలడా: నేను భూమ్యాకాశముల యందంతట నున్నవాడను కానా? యిర్మీ 23:34 (ఇంకా చూడు: సామె. 15:3; యిర్మీ 16:17).

     యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను. ఆది. 11:5 (ఇంకా చూడు: 18 20, 21).

     గమనిక: లేఖనాలను బట్టి, దృష్టి లోపం సర్వాంతర్యామికి కాదు, వాస్తవాలను గుర్తించలేని దృష్టి లోపం మన మిత్రుని మనో నేత్రాలకే వచ్చింది (2 కొరింథీ. 4:4). ఎలాగంటావేమో! నీ చుట్టూ ప్రకృతి లేదా? నీవు నిలిచియున్న స్థలంలో అనేక వస్తువులు లేవా? అనేకమైన దృశ్యాలు నీ కండ్లకు తాకుతున్నా ఏవి కావాలని కోరుకుంటావో, దాదాపు వాటిమీదనే దృష్టి నిలుపుతావు కదా? మిగిలినవాటిని సహజంగా పట్టించుకోవు! కేవలం నీవు పట్టించుకోనంత మాత్రాన అవి లేవని కాదు; పట్టించుకోలేదు - చూచి చూడనట్టు పోతున్నావన్నమాట!

     అలాగే దేవుడు కొన్నింటిని కొంత కాలం వరకు చూచి చూడనట్టుగా ఉంటాడు (అపొ. 17:30). అవిధేయతను, శరీర స్వభావాన్ని బట్టి జరిగే పొరపాట్లను, అవివేక కార్యాలను ఆయన చూచి చూడనట్టుంటాడు. ఆయన దీర్ఘశాంతాన్ని బట్టి ఈ కార్యం జరుగుతూ ఉంటుంది (2 పేతురు 3:15). అయితే ఆయన దృష్టి నిలిపితే, దానినుండి దాగగల వాడెవ్వడు లేడన్న మాట వాస్తవం. గనుక నరుల కుమారులు తన చిత్తానికి విరోధంగా కట్ట బూనుకున్న పట్టణాన్ని గోపురాన్ని గూర్చి ఆయన కొద్దిసేపు పట్టించుకోలేదు. ఆ తరువాత ఆయన దాని విషయం పట్టించుకున్నాడు; అదే అక్కడ విషయం. ఆయన వారి పనిని పట్టించుకొన్నాడు అని సూచించడానికే - "యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును చూడవచ్చెను" అని వ్రాయబడింది.

     దేవుని కార్యక్రమంలో “చూడడం" - "పట్టించుకొనడం" అనే రెండు వేర్వేరు చర్యలున్నాయని సూచించడానికే పై లేఖనాలు వినియోగించబడ్డాయి. గాని మన మిత్రుడు వర్ణించిన రూపంలో అవి వినియోగించబడలేదు. అయినా యిలాటి వాటిని అసంబద్ధ మనడం మతిహీనత కదూ ! మన మిత్రుని వాస్తవ వాదానికి యింత కంటే గొప్ప వింతలు బైబిల్లో దొరకలేదు కాబోలు!
35. నిష్కళంకంలో కళంకం!
     నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కంళంకమైనదికదా? బాధించు వారి బాధను నీవు దృష్టింపజాలవు గదా? హబ 1:13

     యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా? ఆమో. 3.6 (ఇంకా చూడు యోహె 20:25).

     గమనిక: పై లేఖనాలు ఆయా రచనల్లో ఎందుకు వ్రాయబడ్డాయో, అంటే వాటి ఉద్దేశంగాని, వాటి సమయ సందర్భాలుగాని, బైబిల్లో వాటి స్థానంగాని, మన మిత్రునికి తెలియక వెర్రి పలుకులు పలికేడే గాని, నిజానికి వాటిని చదివి అందులో వ్రాయబడిన సంగతులు గ్రహించి, జ్ఞానిగా మాటలాడినట్లయితే ఈలాటి మాటలు పలికేవాడు కాడు. ఒకవేళ ఈ సంగతి చదువరికి కూడా తెలియకపోతే, పై లేఖనాల్లోని వర్తమానమేమో చెప్పుతాను విను:

     (1) మొదట హబక్కూకు 1:3లోని సమయం, సందర్భం, ఉద్దేశం వగైరాలను గుర్తిస్తాం, ఎవరు? ఎవరితో? ఎందుకు మాట్లాడారో తెలుసుకొందాం. దేవుని ప్రజలన బడిన యూదా రాజ్యం మానని దుష్టత్వములో దిగిపోయింది. దానికి ఫలితంగా దేవుడైన యెహోవా వారిని బబులోను చెరకు పంపడానికి నిశ్చయించి, రాజైన నెబుకద్నెజరు చేతికి వారిని అప్పగింపబోతున్న సమయమది (యిర్మీయా 27:5-8). అయితే అట్టి దేవుని తీర్మానం ప్రవక్తయైన హబక్కూకు దర్శన రూపంగా బయలుపరచబడింది (హబక్కూకు 1:1-12). అయినా అలాటి దేవుని నిర్ణయంలోని జ్ఞానం ప్రవక్తయైన హబక్కూకు సరిగా గ్రాహ్యమైనట్టులేదు. గనుక అతడు (హబక్కూకు) దేవునికి యిలా మొర్రపెట్టనారంభించాడు (1:12) యూదులను అన్యజనులు (కల్దీయులు) బాధించుట వ్యక్తిగతంగా హబక్కూకు అంగీకారంగా లేదు గనుక - హబక్కూకు దేవునితో పలికిన పలుకులే 1:13లోదాఖలు చేయబడ్డాయి! అంటే, దేవుని తీర్మానాన్ని తాత్కాలికంగా జీర్ణించుకోలేని హబక్కూకు యొక్క సొంత ఆలోచనయే అది! ఇవి దేవుని మాటలు కావు; అవి మానవుని మాటలే! బైబిలు చదివినా అందులోని సందేశం గ్రహించలేనిది మన మిత్రుని జ్ఞాన స్థాయి! అతన్ని పొగిడేవాని జ్ఞానం ఎంతటిదో!!

     (2) ఆమోసు 3:6లోని వర్తమానమెవరిది? ఇది ఏ జనానికి సంబంధించినది? యూదావారికేనా? అయినా యిది ఎప్పటి వర్తమానం? హబక్కూకు కాలంలోదేనా? ఏ సందర్భంలో యిది వినియోగించబడింది? వగైరా సంగతులను ఆలోచన చేద్దాం: అమోసు వర్తమానం ఈ సందర్భంలో యూదావారికి కాదు; వారికి పొరుగువారుగా ఉండిన ఇశ్రాయేలు దేశానికి సంబంధించినది. ఇది హబక్కూకు కాలం కంటే సుమారు 150 సంవత్సరాలు ముందు సంగతి. ఇశ్రాయేలీయులు అష్షూరీయుల చేతికి అప్పగింప బడనైయున్న సమయమది కావాలంటే ఆమోసు 3వ అధ్యాయం వెనుక ముందు పరీక్షించి చూడు. దేవుడు ఇశ్రాయేలీయులను శిక్షింపబోయేది ఖాయమని స్థిరపరచడానికి ఈ లేఖన భాగం వినియోగింపబడింది. ఇది తన ప్రవక్తయైన ఆమోసుద్వారా దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన వర్తమానం (ఆమోసు 3:1-15).

     హబక్కూకులోనిదేమో నరుడు దేవునితో పలికే మాటలు: ఆమోసు లోనివేమో, దేవుడు ఇశ్రాయేలీయులతో (నరులతో) పలికే పలుకులు, అవి రెండు ఏకీభవించాలనే కోరిక మంచిదే కావచ్చు కాని; అవి రెండు అంగీకరించకపోతే బైబిలు మీద నేరంగా చూపేది మాత్రం మతిహీనతయే ఔతుంది!

     ఆమోసులో వర్ణింపబడిన ఇశ్రాయేలు రాజ్యం అన్యదేశములకంటే హీనంగా తయారయ్యింది (3:9,10). వారు తమ నగరులో బలత్కారం దోపుడు చేస్తూ ఉన్నారు గనుక ఇశ్రాయేలీయులు శిక్షింపబడేది ఖాయం. యెహోవాయే యీ కార్యం చేస్తాడు (3:10-12) ఈ సంగతిని సూచించడానికే- 'యెహోవా చేయనిదే పట్టణములో ఉపద్రవము కలుగునా?” అని అన్నాడు. ఇలాటి వర్తమానంలో నిష్కళంకంలో కళంకమనడం అర్థరహితం, బైబిలు వర్తమానమేమి? దాన్ని గూర్చి మన విమర్శకుడు మాట్లాడుతున్న మాటలేమి? అవి వెర్రి మాటలుగా లేవా? అది నిష్కళంకంలో కళంకం కాదు. మన మిత్రుని హేతువాదంలోని పామరత్వమే!
36. హృదయం లేని యెహెూవా
     హృదయ పూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను, బాధనైనను, కలుగజేయడు. విలా. 3:33 (ఇంకా చూడు: కీర్త 136:1, నిర్గ. 34:6).

     నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీ కీచ్చుచున్న యీ జనముల పురములలో ఊపిరికల దేనిని బ్రతకనియ్య కూడదు. ద్వితీ. 20 15-18 (ఇంకా చూడు: ప్రక. 21:8, ద్వితీ 7;2, 16)

     గమనిక: హృదయ పూర్వకంగా ఒక పని చేయడానికినీ గత్యంతరం లేక చేయడానికినీ తేడా లేదా? హంతకునికి మరణదండన విధించే న్యాయాధిపతి - హృదయపూర్వకంగా అతన్ని చంపనుద్దేశిస్తాడా? లేక అలాటి శిక్ష విధించడంలో న్యాయాధిపతి ఆ హంతకుని తన యిష్టప్రకారం చంపిస్తాడా? అది తన హృదయపూర్వకంగా జరిగే కార్యం కాదు, కానేరదు గదా? అతడు తన చట్టానికి బద్దుడై, న్యాయవంతుడై ఆ పని జరిగిస్తాడు. ఆ న్యాయాధిపతిలాగే హృదయపూర్వకంగా యెహోవా నరులకు విచారమునైనా బాధనైనా కలిగించడు" అనేది ముమ్మాటికి వాస్తవం.

     "దుష్టులు మరణము నొందుటచేత నాకెంతమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు” (యెహెఙ్కే లు 18:23) ఇలాటి తత్వంగల యెహోవా కనాను దేశాన్ని అనగా, కేనీయులు, కనిజ్జీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, రెఫాయీయులు, అమోరీయులు, కనానీయులు, గీర్గాషీయులు, యెబూసీయులను వారి దేశమును అబ్రాహాము సంతతికి యిస్తానని వాగ్దానం చేశాడు. అయినా ఆ జనములలో అమోరీయుల అక్రమం ఇంకను సంపూర్ణం కాలేదు గనుక ఆ వాగ్దానాన్ని ఆయన త్వరలో నెరవేర్చ పూనుకోలేదు. అలా నెరవేర్చినట్లయితే అక్రమం సంపూర్ణం కాని వారిని కూడా నశింపజేయవలసి వచ్చేదే! (ఆది. 15:18, 16) అంటే ఒకని అక్రమం పరిపక్వం కాకముందు, ఆయన ఎవడిని నశింపజేయడు; ఎవనికీ శిక్ష విధించడు. ఎవడును నశింపవలెనని యిచ్చయింపక అందరును మారుమనస్సు పొందవలెనని దీర్ఘశాంతం చూపు యెహోవా! ఆయన హృదయంలేని యెహోవా కాదు.

     ఆయన దుష్టుని శిక్షిస్తానని చెప్పినప్పుడు సయితం, దుష్టుడు తన దుష్టత్వంనుండి మరలి నీతిన్యాయాన్ని అనుసరించి నడుచుకొన్నట్టయితే, అతన్ని క్షమించి, చేర్చుకొను యెహోవా (యెహెజ్కేలు 18:27); ఆయన అతనికి చేయనుద్దేశించిన తీర్పును “చేయక మానును (యిర్మీయా 18:1-8). అయితే మానవుడు తన దుష్టత్వంనుండి మరలక తన అతిక్రమ క్రియల్లోనే ముదిరిపోతే; యిక గత్యంతరంలేక, యెహోవా నీతిగల న్యాయాధిపతిగా ఆయన తీర్పులు తీర్చుతాడు, ఆయన తీర్పులను గూర్చి తెలియజేసిందే ద్వితీయో. 20:15-18!! అంతేగాని ఆయన హృదయం లేని యెహోవా కాదు.

     ఒక ఘోరమైన హత్యా జీవితాన్ని బట్టి - అతనికి మరణదండన విధించిన న్యాయాధిపతిని గూడా, మన మిత్రుడు - "హృదయములేని న్యాయాధిపతి" అని అంటాడు కాబోలు! అలా అంటే మాత్రం అది రైటౌతుందా? న్యాయానికి, హృదయానికి సంబంధం లేదు. హృదయాన్నే కేంద్రంగా ఆలోచన చేస్తే, ఒక న్యాయాధిపతి, న్యాయాన్ని తప్పి అన్యాయస్తుడుగా తీర్పు చేయవలసి వస్తుంది. అయితే యెహోవా నీతిగల న్యాయాధిపతి. ఆయన దీర్ఘశాంతం వహించి, తన ప్రవర్తనను దిద్దుకోమని కోరినా, ఆయన కృపను నిరాకరించి, మానవ దుష్టత్వంలో కొనసాగే ద్రోహులకు తీర్పు తీర్చునప్పుడు యెహోవా నిర్మలుడుగనే కన్పిస్తాడు (కీర్తన. 51:4 రోమా 2:1-10). న్యాయం విధించడం హృదయం లేకపోవటం కాదు. గనుక ఆయన హృదయంలేని యెహోవా కాడు గాని మన మిత్రునిదే వివేకంలేని విమర్శ ఇదే ఇక్కడి వాస్తవం - బైబిల్లో ఏ సమస్యాలేదు.
37. సంకెళ్లు త్రెంచుకొన్న సాతాను
     తమ ప్రధానత్వము నిలుపుకొనక తన నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహా దినమున జరుగు తీర్చువరకు కటిక చీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను యూదా. 6

     నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధియైన సాతాను గర్జించు
సింహమువలె యెవరిని మింగుదునా అని వెదకుచు తిరుగు చున్నాడు. 1 పేతు. 5:8.

     గమనిక: “తమ ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలు" అన్న యూదా 6లో, సాతాను ప్రస్తావన లేనే లేదే! సాతాను ప్రస్తావనలేని వచనాన్ని తీసి, సాతాను నిత్యపాశాలతో బంధింపబడ్డాడని మన మిత్రుడు లేనిదాన్ని ఎలా కల్పిస్తాడు? బైబిలును విమర్శిస్తున్నాననీ, హేతువాదిననీ అంటున్న మిత్రుడు బైబిల్లో లేనివాటిని అందులోకి ప్రవేశపెట్టి విమర్శింప బూనాడేం? ఇదేనా హేతువాదమంటే? అయితే అది భలే హేతువాదంలే.

     వాస్తవానికి బైబిలును బైబిలుగానే గ్రహించినవాడెవడూ దాన్ని విమర్శించలేడు. బైబిలు బోధగా మన ప్రపంచంలో వెలసిన కల్లకబుర్లను, పరిశీలించకుండానే, బైబిలు సందేశంగా నమ్మి ఆ కబుర్లు సత్యం కానందున, బైబిలు కూడా సత్యం కాదని భ్రమించిన మన మిత్రునిలాంటివారు హేతువాదులయ్యే అవకాశముందంటావా? సొంతబుద్ధి, వివేచన, పరిశీలన, గ్రహింపువంటివి లేనివాడు, చెప్పుడు మాటలు వినేవాడు హేతువాది ఎలా ఔతాడు?

     ఒకవేళ బైబిలులో సాతాను బంధింపబడ్డాడని ఉన్నా సాతాను భౌతికమైన వ్యక్తియని బైబిలు చెప్పలేదే! గనుక వాడు భౌతికమైన సంకెళ్లతో బంధింపబడే వీల్లేదు. సాతాను సంకెళ్ళతో బంధింపబడ్డాడని ఎక్కడైనా కనబడితే - దానికి ఒకే భావముంది. అదేమంటే - అపవాది చర్యలు అరికట్టబడ్డాయని; లేదా, వానికి పరిధులు నియమింపబడ్డాయనే భావమే గాని వేరే భావం లేదు. అంటే గత కాలంలో వాడు సర్వలోకాన్ని మోసపుచ్చేవాడనీ (ప్రకటన 12:9; ఆది. 3:1-6; 1 తిమోతి 2:13-14), సువార్త ప్రకటన ప్రారంభింప బడిన తరువాత - జనములను మోసపరచకుండునట్లు సాతానుకు పరిథులు ఏర్పరచ బడ్డాయనీ (ప్రకటన 20:2-3) అయినా, మహిమా స్వరూపియగు క్రీస్తు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపబడకుండునట్లు అపవాది అవిశ్వాసుల మనో నేత్రాలకి గ్రుడ్డితనం కలుగజేస్తాడనీ (2 కొరింథీ. 4:4) బైబిలు చెప్పింది. గనుక వాడు తన అనుచరులవరకే పరిమితి చేయబడ్డాడు గాని, దేవుని ప్రజలను అంధులుగా చేయడానికి వాడు విడిపింపబడలేదు. సాతానుకు సంకెళ్ళ వేయబడ్డాయంటే ఇదీ బైబిలు భావం.

     గొలుసుతో కట్టబడిన కుక్క తన గొలుసు మేరకు తిరుగుతున్నట్టు, సాతాను తనకు నియమింపబడిన పరిథుల్లో తిరుగుతాడు. వెలుగు సంబంధియైన వాడెవడైనా తన నీతిని నియమాన్ని వదలి అపవాది సమీపానికి వచ్చేలావుంటే, అలాటివానిని తన వశం చేసికోవాలని అపవాది తిరుగుతున్నాడనే భావాన్నిపేతురు తెలిపాడు. బైబిలు సందేశం యిలా ఉండగా సంకెళ్లు తెంచుకొన్న సాతాను అనడం అర్థరహితం - సాతాను సంకెళ్లు తెంచుకోలేదు; హేతువాదంతో మన మిత్రుడు పెట్టుకొన్న సంబంధాన్ని తానే దీనితో తెంచుకొన్నట్టున్నాడు.
38. యేసు శిష్యులు నరహంతకులేనేమో!
     ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు లూకా. 14:26. 

     ప్రేమలేనివాడు మరణమందు నిలిచియున్నాడు; తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు; ఏ నరహంతకుని యందును నిత్య జీవముండదని మీరెరుగుదురు. 1 యోహా. 3:15.

     గమనిక: మన మిత్రుడు తన్నుతాను పరిచయం చేసుకొంటూ యిలా అన్నాడు: "నేను హేతువాదిని మతద్వేషిని కాను ." (పునద్దర్శనం పేజీ 5). తాను మతద్వేషి కాకపోతే మంచిదే! దాని విషయంలో అతన్ని మనం అభినందించవచ్చు కాని, మన మిత్రుడు కనీసం - అబద్ధాన్ని అసత్యాన్నైనా ద్వేషిస్తాడో లేదో అసత్యాన్ని అబద్ధాన్ని కూడా ద్వేషించనివాడే హేతువాది యౌతాడా?

     ప్రేమ, ద్వేషాలనేవి పరస్పర స్వాభావిక విరుద్ధాలు. ఒకడు సత్యాన్ని ప్రేమిస్తున్నాడంటే అబద్ధాన్ని అసత్యాన్ని ద్వేషించి తీరాలి; కదూ? అబద్ధాన్ని అసత్యాన్ని ద్వేషించడమంటే - వ్యక్తిని ద్వేషించడం కాదు సుమీ! మన మిత్రుడు మత ద్వేషి కాకుండ - ఎలా మత వ్యతిరేకినని అన్నాడో, అలాగే వ్యక్తులను ద్వేషింపకుండ, ఆ వ్యక్తుల్లో ఉండే దుష్ట స్వభావాన్ని అసత్య ఆచార వ్యవహారాలను వ్యతిరేకించగలగాలి! ఈ భావంతోనే లూకా 14:26లో "ద్వేషింపకుంటే" అనే పదం వినియోగింపబడింది. ఈ పరిస్థితిని హేతువాదం వ్యతిరేకిస్తుందా? దీన్ని వ్యతిరేకించి అది హేతువాదమౌతుందా?

     బైబిల్లో "ద్వేషం" అనే పదం కనీసం రెండు రకాలుగా ప్రయోగింపబడింది. అందులో (1) తత్వ ద్వేషం (2) వ్యక్తి ద్వేషం. బైబిలు అసత్యతత్వాన్ని పిత్రుపారం పర్యాచారాలు, దుర్నీతి, దుష్టత్వం వగైరాలను ద్వేషించమన్నది. వ్యక్తులను మాత్రం ద్వేషింప వద్దన్నది. మన మిత్రుడు కోట్ చేసిన పై రెండు లేఖన భాగాలు వీటికే ఉదాహరణలుగా నిలిచి ఉన్నాయి. అంటే బైబిల్లో "ద్వేషం" అనేది positiveగాను negativeగాను వినియోగించబడింది.

     ఒకవేళ మన మిత్రుడు హేతువాదియే అనుకో! ఈ హేతువాదిని తన తల్లిదండ్రులో భార్యాపిల్లలో, అన్నదమ్ములో, యింకెవరో విగ్రహారాధనకు పురికొల్పారనుకో! అప్పుడు మన మిత్రుడు ఏమి చేస్తాడో? వారిని ప్రేమించువాడని రుజువు చేసికొనడానికి వారితో కూడ గుడిలోకి వెళ్లి విగ్రహారాధన చేసి వస్తాడా? లేక వారి సలహాలను వ్యతిరేకిస్తాడా? ఈ పరిస్థితులలో మన మిత్రుడు ఏమి చేస్తాడో గాని, వ్యక్తిని ద్వేషింపకుండ, జ్ఞాన విరుద్ధమైన, సత్య విరుద్ధమైన, వారి తత్వాన్ని ద్వేషింపగలిగి ఉండాలని అంటుంది బైబిలు. బిడ్డ ముద్దని, బిడ్డ పెంటకూడా ముద్దేనా? (బిడ్డ ముద్దయితే, వాని పెంట కూడా ముద్దు కావాలనేది బుద్ధిహీనత) వ్యక్తి తనకిష్టుడని అతని దుష్టత్వంతో, అసత్యంతో ఏకీభవించడమేనా? లూకా 14:26లో సూచింపబడిన సందేశమిదే! పాపిని ప్రేమించి, వానిలో పాపాన్ని ద్వేషింపగల; నీతిని ప్రేమించి, దుర్నీతిని ద్వేషింపగల; యేసు (హెబ్రీ. 1:9), తానే స్వయంగా తన శిష్యుల కిచ్చిన ఆనతి యిదే! తన శిష్యులు కూడా తనవంటివారై ఉండాలని కోరుకొనిన ప్రభువు యొక్క ఆజ్ఞ యిదే!

     వ్యక్తిగా తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడే. అందులో సందేహం లేదు. అయితే వ్యక్తి ద్వేషాన్ని యేసు తన శిష్యులకు బోధించలేదు. వ్యక్తులుగా తల్లిదండ్రులను సన్మానించుమని (ఎఫెసీ. 6:1-2), బిడ్డలను శ్రద్ధగా పెంచుమని (ఎఫెసీ. 6:4), భార్యను తన సొంత శరీరంలా పోషించి సంరక్షించి, ప్రేమించుమని (ఎఫెసీ. 5:28-29), క్రీస్తు యేసు యొక్క క్రొత్త నిబంధన ఖండితంగా ఆజ్ఞాపించింది. తన స్వకీయులను, విశేషంగా తన యింటివారిని సంరక్షింపనివాడు విశ్వాస త్యాగం చేసినవాడై అవిశ్వాసికంటె చెడ్డవాడై ఉంటాడని బైబిలు బోధించింది (1తిమోతి 5:8). సమాజంలో వృదుని తండ్రిగా భావించుమని; అన్నదమ్ములని యౌవనులను; తల్లులని వృద్ధ స్త్రీలను, అక్కచెల్లెండ్రని యౌవన స్త్రీలను భావించుమని బైబిలు ఆదేశించింది (1తిమోతి 5:1- 3)! పైగా అనాధలైన విధవరాండ్రను సన్మానించమంది; దిక్కులేని పిల్లలను విధవరాంద్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించమంది (యాకోబు 1:27). ఏ రూపంలో చూచినా వ్యక్తి ద్వేషాన్ని బైబిలు వ్యతిరేకించింది; వ్యక్తి ద్వేషిని నరహంతకుడన్నది; అది సత్యం.

     అయితే ఒక మాట! వారిలో ఎవరి తత్వమైనా, స్వభావమైనా, బోధయైనా, సలహాయైనా సత్యాన్ని అనుసరింపకుండ తనను ఆటంకపరచితే - వారి తత్వాన్ని అలాటివారి స్వభావాన్ని బోధను, సలహాను మాత్రం ద్వేషించుమని (లూకా 14:26) బైబిలు సూచించింది! వ్యక్తులుగా మనుష్యులను ప్రేమిస్తూ - సత్యానికీ, నీతికీ విరోధమైన వారి తత్వాన్ని ద్వేషింపగలవాడే సరియైన మానవుడు. అందుకే నేను మన మిత్రుని ప్రేమిస్తూ, తాను సత్యాన్ని ప్రేమపూర్వకంగా అవలంభించి రక్షింపబడాలని ఎంతో కోరుతూ అతని అసత్య వాదాన్ని వ్యతిరేకుస్తున్నా! బైబిలు బండారమనే మన మిత్రుని రచన సత్య విరుద్ధం, వాస్తవ విరుద్ధమని చాటుతున్నా! ఇలాటిది హేతువాద విరుద్ధం కాదుగదా? దాని సంగతి ఎలాగున్నా యేసు శిష్యులు మాత్రం నరహంతకులు కారు; కాలేరు; యిక కాబోరు!! అర్థంలేని మాటలతో తన అజ్ఞానాన్ని వెళ్లగక్కేవాడు మూఢుడు!
39. ప్రవేశం- సాధ్యమా, అసాధ్యమా?
     అడుగుడి, మీ కియ్యబడును; వెదకుడి, మీకు దొరుకును; తట్టుడి, మీకు తియ్యబడును. అడుగు ప్రతివాడును పొందును; వెదకువానికి దొరుకును; తట్టువానికి తియ్యబడును మత్త. 7;7, 8.

     ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి; అనేకులు ప్రవేశింప చూతురు కాని వారివలన కాదని మీతో చెప్పుచున్నాను. లూకా. 13:24. 

     గమనిక: పై లేఖనాలను చదివి గ్రహించలేనివారికి (మన మిత్రుడు వేసిన) ప్రశ్న వస్తుందేమో కాని, తానుగా చదివింది గ్రహించుకోగలిగే ఎవడికీ ఆ ప్రశ్నరాదు. దీన్నిబట్టి బైబిల్లో అసంబద్ధాలున్నాయని అంటున్న మన మిత్రుడు విద్యావిహీనుడని రుజువు చేసికొంటున్నాడు. విద్యావిహీనులు లేఖనాలను ఏమి చేస్తారని వ్రాయబడిందో 2 పేతురు 3:16 చూడు!

     పై లేఖనాలు వేర్వేరు సందర్భాల్లో పలికిన మాటలు. ముందు లూకా 13:24 యొక్క సందర్భం చూడు! అది ప్రభువు ప్రయాణం చేస్తున్న సమయం - ఆ సమయంలో ఒకడు ఆయన్ని యిలా ప్రశ్నించాడు; -"రక్షణ పొందువారు కొద్దిమందేనా?" దానికి సమాధానంగా "ఆయన వారిని చూచి-ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి; అనేకులు ప్రవేశింప జూతురు గాని వారివలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపువేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి-అయ్యా, మాకు తలుపు తీయమని చెప్ప నారంభించినప్పుడు, ఆయన- మీ రెక్కడివారో మిమ్మును ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును." (లూకా 13:22-30).

      అయితే మత్తయి 7వ అధ్యాయం (యేసు) కొండమీద ప్రసంగంలోని భాగం. అందులో ఆయన అనేక సంగతులను (5వ అధ్యాయంనుండి) చర్చించుతూ, వారికి (జన సమూహానికి) వివరించిన ఒక అంశం 7:7, 8లో దాఖలు చేయబడింది. అసలు 7:7-12వరకు “యీవులు” gifts యిచ్చి పుచ్చుకొనడమనేది చర్చించబడింది. దేవుని యొద్దనుండి నరుడు "ఈవులను" పొందేది ఎలాగో వివరించబడింది. ముందుగా లూకా 13:23, 30లో చర్చింపబడిన అంశం వేరు; మత్తయి 7:7-12లో చర్చింపబడిన అంశం వేరు గదా? ఈ రెండింటి మధ్య అసంబద్ధమనటం - విద్యావిహీనత కాక మరేమౌతుంది?

     లూకా 13:24లో చర్చింపబడిన అంశం - మత్తయి 7:13, 14లో ఉదహరించ బడింది చూడు! ఒకే విధమైన అంశాలు ఆయా లేఖనాల్లో చర్చింపబడినప్పు డు అవి ఏకీభవిస్తున్నాయ్. వాటిలో ఎవరూ సమస్యలను చూపలేరు. అంశాలు వేరైనప్పుడు అవి ఏకీభవించలేదనడం అజ్ఞానమే అవుతుంది.

     ఏదియేమైనా, ప్రవేశం-సాధ్యము, అసాధ్యం కూడా! ఎందుకంటే ప్రతి దానికి ఒక సమయము ఒక విధానముంటుంది. ఏదైనా, దొరికే సమయంలోనే అడగాలి వెదకాలి తట్టాలి. అంతేకాదు, అది దొరికే విధానంలోనే అడగాలి వెదకాలి తట్టాలి. దీనికి యెషయా 55:6-7లో జవాబుంది. దొరికే కాలం కాకుండా, అడిగినా వెదకినా తట్టినా ప్రయోజ నముండదని బైబిలు చెప్పింది (హెబ్రీ 12:15-17).

     ఇక పోతే, ప్రవేశమంటావా, దీనికి ఒక సమయం ఒక పద్ధతి ఉంది. ప్రవేశించే మార్గం యిరుకు మార్గం! దానికి తగిన త్యాగం చేయకుండ ప్రవేశింపజూస్తే, అది వారివలన కాదు -అనేది సత్యం కాదా? దానికి సంబంధించిన షరత్తులను లక్ష్యపెట్టకుండ ప్రవేశింపజూచి, ప్రవేశం పొందలేక, షరత్తులమీద విరుచుకుపడి -ప్రవేశం సాధ్యమా అసాధ్యమా అని అడగడాన్ని ఏమంటారు? అదే మన మిత్రుని ప్రశ్నలోని జ్ఞాన విశేషం!!
40. చెప్పేదొకటి, చేసేదొకటి!
     ఈ తరమువారు ఎందుకు సూచక క్రియ నడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచక క్రియయు ననుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మార్కు 8:12 (ఇంకా చూడు; మత్త 12:39).

     వేరు అనేకమైన సూచకక్రియలను యేసు తన శిష్యుల యెదుట చేసెను. యోహా. 20:30 (ఇంకా చూడు: యోహా. 3:2 అపొ. 2:22).

     గమనిక: ఆరోగ్యంగా ఉన్న ఒక యువకుడు - చిన్నతంతి వాయిద్యం వాయించుతూ అడుక్కోడానికి అలవాటుపడ్డాడు. అతడు రాజు (అనే ఒక వ్యక్తి) దగ్గరకు వచ్చి డబ్బులు అడిగితే, రాజు అతనికి ఏమీ యియ్యక పోగా, అతని గద్దించి - ఈలాటి సోమరులకు ఒక పైసా కూడా యియ్యకూడదన్నాడు. అయితే తన క్లాసులో ప్రథమ శ్రేణిని పొందుతున్న రాజు యొక్క కుమారుడు వచ్చి అతన్ని అడిగినప్పుడు రాజు వానికి అయిదువందల రూపాయలు స్కూలు ఫీజుకు యిచ్చాడు. రాజు చెప్పేదొకటి చేసేదొకటి! అని అనడానికి తావుందా? ఒకవేళ అలాగంటే అది హేతువాదమౌతుందా? బైబిలు మీద ప్రదర్శించిన మన మిత్రుని హేతువాదం - యిలాటిదే కావాలంటే పై లేఖనాలను పరిశీలించి చూడు.

     మార్కు 8:12; మత్తయి 12:39 వగైరాల్లో యేసు తన సూచక క్రియలు ఎక్కడ ఎప్పుడు చేయడానికి యిష్టపడలేదో? (యోహాను 20:30; అపొ. 2:22 వగైరాల్లో) యేసు ఎక్కడ సూచక క్రియలు చేశారో? అనే విషయాలు మాత్రమే చర్చించబడ్డాయి. ఒక రచనలోని సంగతులను ఉన్నవి ఉన్నట్టే తెలిసికోవాలనుకుంటే - ఆయా భాగాలను ఆయా సమయ సందర్భాల్లోనే పెట్టి శ్రద్ధగా చూడాలి. అలా చూడకపోతే రచనలు అపార్థం చేయబడతాయి.

     మొదటిగా మార్కు 8:12ను దాని సందర్భంలో పెట్టి చూద్దాం. 11వ వచనంలో దాని సందర్భమేదో కన్పిస్తుంది చూడు. "అంతట పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు, ఆకాశమునుండి యొక సూచకక్రియను చూపమని ఆయన నడిగి ఆయనతో తర్కింపసాగిరి." ఇది దాని సందర్భం! పైగా మన మిత్రుడు 12వ వచనాన్ని యథార్థంగా కోట్ చేయలేదు. బైబిల్లో 12వ వచనం యిలా ఉంది. "ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి - ఈ తరమువారు ఎందుకు సూచకక్రియ నడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచక క్రియయు ననుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి, వారిని విడిచి మరల దోనె యెక్కి అద్దరికి పోయెను."

     ఈ “తరమువారు" అనే మాటను మన మిత్రుడు అపార్థం చేసుకొన్నట్టున్నాడు. “తరమువారు” అనే పదం "GENEA - GENESIS" అనే మూలంనుండి తర్జుమా చేయబడింది. "GENESIS-denotes an origin, a lineage, of birth translated as generation" - Vine's Expository Dictionary of New Testament words P - 484.

     గనుక "ఈ తరమువారికి” అనడంలో ఆ కాలంలో జీవించిన వారికందరికనే భావాన్ని ఆయన ఉద్దేశింపలేదు. "ఇంకా చూడు" అని మిత్రుడు సూచించాడే, ఆ మత్తయి 12:39లో చూద్దాం. అక్కడ ఈ సంగతి మరింత తేటగా కన్పిస్తుంది. పరిసయ్యులు - వ్యభిచారులైన చెడ్డ తరం వారట! శోధించువారు; వాదించువారట! అక్కడ ఈ తరమువారని ఆయన మాట్లాడుతుంది ప్రత్యేకించి వీరిని గూర్చియే. వారి శోధనకూ,వాదనకు ఆయన లొంగిపోక - "ఈ తరమునకు (to this stock lineage, birth) ఏ సూచక క్రియయు అనుగ్రహింపబడదని" నిశ్చయముగా ఆయన వారితో చెప్పారు.

     పై మాటలను యేసు తన అపొస్తలులకు ఉద్దేశింపలేదు. తనవారు వ్యభిచారులు కారు; వారాయనను శోధించువారు కారు; వాదించువారూ కారు. పైగా వారు సూచక క్రియలను ఊరకేసరదాగా చూడగోరినవారు కారు; వింతలు వినోదాలకోసం ఆయన్ను వెంబడించినవారు కారు (They were yet of a different stock). గనుక ఆయనను శోధించుటకు, తర్కించుటకు, వచ్చిన పరిసయ్యుల కోర్కెను తీర్చడానికి వారియెదుట ఆయన సూచకక్రియలను చేయ నిరాకరించాడు గాని; తనకు సాక్షులుగా తమ ప్రాణాలను సయితం లక్ష్యపెట్టక నిలువబోయే తన అపొస్తలుల యెదుట ఆయన సూచక క్రియలు చేయలేదని బైబిలు చెప్పనేలేదు.

     ఆయన తన వ్యతిరేకుల సవాలుకు లొంగలేదు; వారి మాటలను బట్టి ఆయన రెచ్చిపోలేదు. అయితే ఆయన తన అపొస్తలులను తనకు సాక్షులుగా సిద్ధపరచుటకు అవసరమైనవాటిని ఆయన చేయక మానలేదు. పై లేఖనాలు ఈ సత్యాన్నే సూచిస్తున్నాయ్. గనుక యేసు చెప్పేదొకటి; చేసేదొకటి కాదు. గాని బైబిల్లో ఉన్నదొకటైతే, దానిలో ఉన్నట్లు మన మిత్రుడు చూపేది మరొకటి! దీనినే కాబోలు మన మిత్రుడు హేతువాద మంటుంది! ఇదే నిజంగా హేతువాదమైతే, యింత కంటే మౌఢ్యం మరొకటి ఉండబోదు.

     మరో సంగతి “తరమనే పదం" - పై సందర్భంలో వారి"తత్వానికి" సంబంధిం చిందిగా వినియోగింపబడితే, అది కాలానికి సంబంధించిందిగా మన మిత్రుడు అపార్థం చేసుకున్నాడు. అందుకే అతడలా మాట్లాడాడు? నేడు మనం జీవిస్తున్న కాలాన్ని రకరకాలుగా ఆయా పరిథుల్లో వినియోగిస్తున్నారు. ఉదా: అణు యుగం (atomic age), అంతరిక్ష యుగం (Space age), విజ్ఞాన యుగం (scientific), కంప్యూటర్ యుగం (computer age), యుగమనే పదం మన మధ్య ఆయా పరిధులను సూచించడానికి ఎలా ఉపయోగించబడుతుందో తరమనే పదం క్రొత్త నిబంధనలో ఆయా పరిధులను సూచించడానికి ఉపయోగింపబడింది. ఉదా: శాస్త్రుల, పరిసయ్యుల స్వభావాన్నీ చర్యలను సూచించడానికి - "వ్యభిచారులైన చెడ్డ తరం"వారనీ (మత్తయి 12:39; మత్తయి 16:4); తన అపొస్తలుల అల్ప విశ్వాసాన్ని సూచించినప్పుడు “విశ్వాసం లేని మూర్ఖ తరము"వారనీ (మత్తయి 17:17); ఆయన్ని బహిరంగంగా ఒప్పుకోలేనివారిని సూచించునపుడు "వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము” వారనీ (మార్కు8:38) ఒకరు క్రీస్తుకు శిష్యుడు కాగోరినప్పుడు "మూర్ఖులగు ఈ తరము"వారికి వేరై యుండుమని వ్రాయబడింది (అపొ. 2:40) గనుక యిట్టి సందర్భాలలో తరమనేది - ఆయా పరిధులను సూచించడానికి వాడబడిన పదమే!

     అయితే మన మిత్రునికి ఈ సంగతి తెలియక తరమంటే - వారు జీవించిన కాలమన్నట్టు భావించి, తన అజ్ఞానాన్ని వెళ్లగ్రక్కుతూ - “చెప్పేదొకటి చేసేదొకటి" అని తన ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఇలా చేసి, "బైబిలు బండారమంటూ" అతడు తన బండారాన్నే బయటపెట్టుకున్నాడు. అదే అతని ఆశ్చర్యార్థకంలో ఉన్న విశేషం.
41. యేసు అడ్డమా, కాదా?
     యేసు - నేనే మార్గమును, సత్యమును, జీవమునై యున్నాను. నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు. యోహా. 14:6

     దేవుడు పక్షపాతికాడని నిజముగా గ్రహించియున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి, నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును. అపొ. 10:34, 35.

     గమనిక : మన మిత్రుడు పై లేఖనాలను కోట్ చేసి వేసిన ప్రశ్నను చదువరి గ్రహించియుంటాడా? అలా ప్రశ్నించడంలో మన మిత్రుని ఉద్దేశమేమైయుంటుంది? అతడు కాకమ్మ కథలను చెప్పబూనుకున్నాడా? లేక బైబిలు చదవను చేతగానివారి కళ్ళు కప్పి తాను పండితుడననిపించుకో బూనుకున్నాడా? లేదా, బైబిలు చదవను తనకు చేతగాక ఎవడో చెప్పిన మాటలను పట్టుకొని ఊగులాడుతున్నాడా? మన మిత్రుడు చేయతలంచింది వీటిలో ఏదీ కాకపోతే, పై లేఖనాలు ఒకదానినొకటి బలపరచుకుంటున్నట్టు కనుగొనేవాడే గదా! అలాటప్పుడు అతనికి యిలాటి ప్రశ్న ఎందు కొచ్చియుంటుంది?

     "యేసు - నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు" అని అంటే, అవును "ఆయన ద్వారా దేవుడు తన సమాధానకరమైన సువార్తను పంపియున్నాడు" అని అపొ. 10:36 అంటుంది, చూడు.

     దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించియున్నాను. "ప్రతి జనములోను ఆయనకు భయపడి, నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించు"నని పేతురు కొర్నేలీ యింట మాట్లాడుతూ, ఆగకుండా యింకా ఏమంటున్నాడో చూడు- "యేసుక్రీస్తు అందరికి ప్రభువు. ఆయన (యేసు) ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు." (అపొ. 10:36) ఇందులో దాపరికం లేదు.

     దైవ మానవులకు మధ్య మధ్యవర్తిత్వానికి దేవుడు ప్రభువైన యేసును నిలుపుకో గోరితే, కాదనే హక్కు ఎవనికి ఉంటుంది? (1తిమోతి 2:5; హెబ్రీ. 2:11, 12; 1 యోహాను 2:2). 2 కొరింథీ 5:18-19 చూడు: “సమస్తమును దేవునివలనైనవి; ఆయన మనలను క్రీస్తుద్వారా తనతో సమాధానపరచుకొని, ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు, ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను." బైబిలు యిలా బోధిస్తుంటే యేసు అడ్డమా? కాదా? అని మన మిత్రుడు వెల్లడి చేసింది ఏది? తన అవివేకమనే కదూ? హేతువాదిగా మన మిత్రుడు పయనిస్తున్న విజ్ఞాన బాట యిదేనా!
42. యేసు రాజ్య మెక్కడ?
     (యేసు) గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగముల నేలును. ఆయన రాజ్యము అంతము లేనిదైయుండును. లూకా. 11:32, 33.

     యేసు - నా రాజ్యము యీలోక సంబంధమైనది కా(దనెను). యోహా 18:36. 

     ఆయన (యేసు) తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయన నంగీకరింపలేదు. యోహా. 1:11. 

     గమనిక: పై లేఖనాలను మాత్రమే కోట్ చేసి, 'యేసు రాజ్యం లేదు చూడు!" అని మన విమర్శకుడు చెప్ప బూనుకున్నాడు. అయినా యీ పెద్ద మనిషి బైబిలును విమర్శింప బూనుకున్నాడు కదా! అలాటప్పుడు - యేసు రాజ్యాన్ని గూర్చి బైబిల్లో ఉన్న సమాచారమంతా తెలిసికోనవసరం లేదా? ఎక్కడో తనకు యిష్టం వచ్చిన లేఖనాలను అసందర్భంగా కోట్ చేస్తేనే సరిపోతుందా? లేదు గనుక, ఒక గ్రంథాన్ని చదివి ఆయా అంశాలపై ఆ గ్రంథం వివరించిన వాస్తవాలను తెలిసికోలేనివాడైయున్నట్లు మన మిత్రుడు తనకు తానే రుజువు చేసికొన్నాడు. అంతేగాని యిలాటి ప్రశ్న వేసినందున తాను జ్ఞానియని అనిపించుకోడు. ఒక గ్రంథాన్ని విమర్శింప బూనినప్పుడు ఒక అంశంమీద ఆ గ్రంథం చెప్పిన సమాచారమంతటిని ముందు పరిశీలనగా తెలుసుకొని, ఆ అంశం మీద ఆ గ్రంథం యొక్క సందేశమేదో తేటగా తెలుసుకొనిన తరువాత - ఆ గ్రంథం యొక్క సందేశం ఆ విషయంలో సత్య దూరమో; వాస్తవ దూరమో; లేక విజ్ఞాన దూరమో తార్కికంగా చూపగలిగేదే హేతువాదం కదా? అలాటిది బైబిలు బండారంలో ఎక్కడా కన్పించదే! యేసు రాజ్యాన్ని గూర్చి బైబిల్లో ఏముందో చూడు; ఆ తరువాత సంగతులు నీకు నీవే తేల్చుకో.

1. యూదుల పూర్వ చరిత్ర
     శరీరాన్ని బట్టి యాకోబు వంశస్థులైనంత మాత్రన వారు దేవుని ప్రజలుగా అంగీకరింపబడలేదు (మత్తయి 3:7-12; లూకా 3:7-9; యోహాను 8:39-47; రోమా 2:28–29; 9:6; ప్రకటన 2:9 వగైరాలు చూడు)

     ఇది క్రొత్త నిబంధనలోనే కాదు; ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి వచ్చినది మొదలు ఈ వాస్తవం బైబిల్లో యిలాగే సూచింపబడింది (యెహోషువ 5:4-6). అవిశ్వాసం, అవిధేయతవంటి స్వభావాలను వారు ప్రదర్శించినప్పుడు, అరణ్య ప్రయాణంలో రాలిపోయిన వారు రాలిపోగా, మిగిలినవారే యెహోషువ నాయకత్వంలో వాగ్ధాన భూమిని స్వతంత్రించు కొన్నారు (యెహోషువ 14:1-4).

     కాలక్రమంలో యాకోబు వంశస్థులు దోషులు కాగా, శత్రువులచే యెహోవా వారి నణచి, న్యాయాధిపతులను లేపుట ద్వారా, ఆయన తిరిగి వారిని ఆదరించాడు (న్యాయాధి. 2:10-16). మెట్టుకు సీనాయి కొండవద్ద జరిగిన ఒప్పందాన్ని బట్టి (నిర్గమ. 19:5- 6; ద్వితీయో. 5:1-3). ఇశ్రాయేలు దేవునికి ప్రజగా, యెహోవా వారికి రాజుగా, ధర్మశాస్త్రం వారి రాజ్యాంగ చట్టంగా కొనసాగింది. అలా జరుగుతూ, వారి చివరి న్యాయాధిపతియైన సమూయేలు కాలం వచ్చేసరికి, యెహోవా తమకు రాజైయున్నట్టు చూడలేని దృష్టి యాకోబు వంశస్థులకు ఏర్పడింది. ఇతర జనాంగాలవలెనే - తాము కూడ ఉండాలనే కోర్కె వారికి కలిగింది. గనుక "సకల జనుల మర్యాద చొప్పున" తమకు కూడా రాజు కావాలని వారు సమూయేలు నడిగారు (1సమూ. 8:5).

     అలాటి కోర్కె వారికి కలిగినప్పుడు, తమ రాజులను నియమించుకొనే విధానం వారి రాజ్యాంగ చట్టంలో ముందుగనే సూచింపబడింది. గనుక పెద్ద సమస్య లేకుండానే పోయింది. అయినా - యెహోవా సూచించినవాడే వారికి రాజు కావాలి; అతడు వారి సహోదరులలోనివాడై యుండాలి. అతని ఏలుబడికి సహా ధర్మశాస్త్రమే రాజ్యాంగ చట్టంగా ఉండాలి. ఆ చట్టాన్ని అనుసరించే, వారి రాజు కూడా నడుచుకోవాలి. దానిబట్టే పరిపాలన కూడా జరిగించాలి. అన్యుని మాత్రం వారిమీద నియమించుకోకూడదు (ద్వితీయో. 17:14–22). పరిస్థితులు అలా ఉండగా, యాకోబు సంతతికి తొలి రాజుగా సౌలు నియమింపబడ్డాడు (1 సమూ. 10:17-22). అయితే రాజైన సౌలు తనకు అనుగ్రహింపబడిన దేవుని కృపను నిలుపుకోలేకపోయాడు (1 సమూ, 15:1-16; ద్వితీయో. 25:17-19).

2. యూదాలో దావీదు సింహాసనం
     గనుక వారి పరమ ప్రభువు యాకోబు సంతతికి ఏలికగా దావీదును నియమించాడు (1 సమూ, 16:11-16; 17:32-54). అటు తరువాత "దావీదు సంతానం" - “దావీదు సింహాసనం" అనేవాటిని గూర్చి ఆయన అతనితో యిలా వాగ్దానం చేశాడు: "... నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో నిద్రించిన తరువాత నీ గర్భములోనుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును; నేనతనికి తండ్రినై యుందును. అతడు నాకు కుమారుడైయుండును; అతడు పాపము చేసినయెడల నరుల దండముతోను మనుష్యులకు తగులు దెబ్బలతోను అతని శిక్షింతునుగాని, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలుకు నాకృప దూరమైనట్లు, అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును" (2 సమూ. 7:12-16).

     యెహోవా దావీదునకు యిలా వాగ్ధానం చేసిన తరువాత, అతని కుమారుడైన సొలొమోను రాజౌతాడు (1 రాజులు 1:39–48) తన ప్రారంభ సంవత్సరాల్లో సొలొమోను యోగ్యమైన ప్రవర్తన గలవాడై నడిచాడు. అయితే యెహోవా రాజ్యసింహాసనం మీద అతడు స్థిరపడిన తరువాత తన మార్గాలను చెరుపుకున్నాడు, గనుక సొలొమోను చేసిన అతిక్రమాన్నిబట్టిన్నీ ఆ తరువాత అతని కుమారుడైన రెహబాము ఇశ్రాయేలీయుల పట్ల అనుసరించిన వైఖరిని బట్టిన్నీ ఆ రాజ్యం రెండుగా విభజింపబడింది (1 రాజులు 11, 13 అధ్యాయాలు). ఆ విభజనలో ఉత్తర భాగాన్ని “ఇశ్రాయేల"న్నారు; దావీదు సంతతివారికి వచ్చిన భాగాన్ని "యూదా" అన్నారు. ఏదియెలాగున్నా ఈ విభజనలో దేవుని ప్రజలుగా ఉండగోరినవారు దావీదు సంతతి నాశ్రయించారు (2 దినవృ. 11:13-17; 13:8-10). అప్పటినుండి దావీదుకు దీపంగా అతని సంతతిలోనుండి ఒకడు అతని సింహాసనం మీద కూర్చుంటూనే వచ్చాడు.

3. దావీదు సంతతితో క్రీస్తు సంబంధం
     సంవత్సరాలు గడిచే కొద్ది, తన ప్రజలనేలే ఆధిక్యత నిచ్చిన దేవునికి, దావీదు సంతతివారు నమ్మకంగా ఉంటూ, తమ విశ్వాస విధానంలో అభివృద్ధి పొందడానికి బదులు వారు తమ దేవుని విసర్జించే వైఖరికి దిగారు. "చెట్టు చెడు కాలానికి కుక్కమూతి పిందెలా?” అన్నట్టు రాను రాను దావీదు సంతతికి కుక్కమూతి పిందెలు పుట్ట నారంభించాయ్. వారిలో యోతాము కుమారుడగు ఆహాజు ఒకడు (2 దినవృ. 28:1- 2). అతని దినాల్లో ఆహాజుకు శత్రువులుగా ఉండిన సిరియా, ఇశ్రాయేలు దేశాలవారు దావీదు సింహాసనంనుండి అతని సంతతిని దించాలని తలపెట్టారు. ఆ సంగతి దావీదు వంశస్థులకు తెలియవచ్చింది. అప్పుడు "గాలికి అడవి చెట్ల కదలినట్లు" వారి హృదయాలు కదిలాయ్ (2 దినవృ. 28:5; యెషయా 7:1-2).

     యూదాలోనున్న “దావీదు సింహాసనం" అసలు యెహోవా రాజ్య సింహాసనమే కదా? (2 దినవృ. 13:8). దాన్నికాపాడవలసిన బాధ్యత ఎవరిది? యెహోవాదే! అయితే దేవుని ప్రతినిధులుగా దావీదు సంతతివారు ఆ సింహాసనాన్ని పరిశుద్ధంగా నిలుపవలసిన వారేగాని, దాని కాపుదల విషయమై చింతించవలసినవారు కారు. అంతగా పరిస్థితులు విషమించినప్పుడు, గొల్యాతు నెదుర్కొనిన దావీదువలె (1సమూ. 17) ఉండకపోయినా, కనీసం-తన గర్భవాసమున పుట్టిన హిజ్కియా యెహోవా నాశ్రయించినట్టు, ఆహాజు చేసియుంటే బాగుండేదే (యెషయా 37:1-5). కాని ఆపత్కాలంలో అతడు హిజ్కియాలా యెహోవాను ఆశ్రయించుటకు మారుగా, ఒక అన్యుని ఆశ్రయింప బూనుకొన్నాడు.

     అయినను దావీదు సింహాసనమునందు శ్రద్ధగల పరమ దేవుడు, శత్రు బారినుండి దాన్నికాపాడనెంచాడు. పరిస్థితులను బట్టి భయపడుతున్న ఆహాజును ధైర్యపరచడానికి ఆయన తన ప్రవక్తయైన యెషయాను అతని యొద్దకు పంపాడు (యెషయా 7:3-9) సింహాసనాన్ని కాపాడుతానని ఆయన వాగ్దానం చేశాడు. పరిస్థితులనుబట్టి ఒకవేళ ఆహాజుకు అనుమానం వస్తే, తాను కోరుకొనిన యొక సూచక క్రియను మహోన్నతుడు కనుపరచి తన మాటను రుజువు చేసికొంటానని కూడా యెహోవా ఆహాజుకు కబురు పంపాడు. అయితే మాటపైన నమ్మకాన్ని అటుంచి, కనీసం ఆయన మాటను ఆలోచించే మనస్సు కూడా ఆహాజుకు లేకుండాపోయింది (యెషయా 7:10-12).

     అది చాలదన్నట్టు, యెహోవా మందిరములో కనబడిన వెండి, బంగారులను ఆహాజు కానుకగా యిచ్చి “-నేను నీ దాసుడను నీ కుమారుడనైయున్నాను గనుక నీవు వచ్చి, నా మీదికి లేచిన సిరియారాజు చేతిలోనుండియు, ఇశ్రాయేలురాజు చేతిలోనుండియు నన్ను రక్షింపవలెనని అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరునొద్దకు దూతలను పంపెను" (2 రాజులు 16:7- 9).

     ఈ వైపరీత్యం చూచారు కదూ! రాజ్య సింహాసనాన్ని కాపాడతాననే వాగ్ధానంతో యెహోవా తన దూతగా యెషయాను పంపితే ఆహాజు దాన్ని త్రోసివేశాడు. తనను లక్ష్యపెట్టని అష్షూరు రాజునొద్దకేమో ఆహాజు తన దూతను బహుమానంతో పంపాడు. దావీదు సంతానంతో యెహోవా చేసిన నిబంధననుబట్టి ఆయనకు సేవకుడుగా, కుమారుడుగా ఉండవలసిన ఆహాజు, ఆయన్ను విసర్జించి, అష్షూరురాజైన తిగ్లత్పిలేసెరుకు దాసుడుగా, కుమారుడుగా తన్నుతాను సమర్పించుకొన్నాడు. ఇలాగున దావీదు సంతతితో చేయబడిన నిబంధనను ఆహాజు భంగము చేయగా - అతని బీజమునుండి గాక, మెస్సీయా ద్వారా దావీదు సంతాన నిబంధనను పరమ ప్రభువు నెరవేర్చబూనుకొన్నాడు.

     అందువలన- "నీవు వద్దన్నా కద్దన్నా దేవుడు తన ఉద్ధేశాన్ని నెరవెర్చుకోబోతున్నాడని సూచిస్తూ - "ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టునని" (యెషయా 7:14; మత్తయి 1:21-23) యెషయా ఆహాజుకు తెలియజేశాడు.

    (అయితే దీన్ని కూడా వక్రంగా త్రిప్పడానికి మన మిత్రుడు ప్రయత్నం చేశాడనుకో, దాన్ని ముందు రచనలో చర్చించాం గనుక యిక్కడ వదలివేశాం).

     అదేలాగున్న దావీదు సంతతితో క్రీస్తు యిలా లింకు చేయబడ్డాడు. ఇట్టి దేవుని ఏర్పాటును స్థిరంచేస్తూ, యెషయాకు సమకాలికుడైన విూకా కూడా ప్రవచించి యిలా అన్నాడు - "బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను" (మీకా 5:2; మత్తయి 2:1-5). దీనితో దావీదు భౌతిక బీజం మార్చబడింది.

4. యూదాలోనుండి తొలగింపబడిన దావీదు సింహాసనం
     దావీదు వంశవృక్షానికి కుక్కమూతి పిందెలు పట్టడం అప్పటికి యింకా మానలేదు. గనుక యెహోవా యూదాలోనుండి తన రాజ్య సింహాసనాన్ని ఎత్తివేయవలసి వచ్చింది. దానికి ముందు యూదా దేశంలో తనను ఆశ్రయించిన వారిని క్షేమకరమైన స్థలానికి తరలించాలి. గనుక జనములలో బబులోను రాజైన నెబుకద్నెజరును హెచ్చించి యూదులను అతని వశం చేశాడు (యిర్మీయా 27:5-8). మేలు పొందదగినవారిని నెబుకద్నెజరు తన దేశానికి చెరగొనిపోతాడు. మిగిలినవారిని అతడు బొత్తిగా నశింప జేస్తాడు (యిర్మీయా 24:1-10)

     అతని కాలంలో యెహోయాకీము కుమారుడగు ఎకొన్యా (కొన్యా, యెహోయాకీను) దావీదు సింహాసనంపై ఉంటాడు. క్షేమ కాలంలో యెహోవా అతనితోకూడా మాట్లాడాడు కాని ఆయన మాట విననని అతడన్నాడు. పైగా ఆయన మాట వినకపోవడమే బాల్యంనుండి అతడు వాడుకచేసికొన్నాడు (యిర్మీయా 22:21). యెహోవా మాట వినని వాడు ఆయన సింహసనం మీద కూర్చుండ తగునా? అందువలన యెహోవా అతని గూర్చి యిలా సెలవిచ్చాడు. “-యూదా రాజైన యెహోయాకీము కుమారుడైన కొన్యా నా కుడిచేతికి శిఖా ఉంగరముగా ఉండినను దానిమీదనుండి నిన్ను ఊడదీసెదను." (యిర్మీయా 22:22-27: 24:1-8; 2 దినవృ. 36:9-10).

     అంతేనా? అంటే అంతే కాదు. “-కొన్యా అను ఇతడు హేయమైన ఓటికుండ వంటివాడా? పనికి మాలిన ఘటమా? అతడును అతని సంతానమును విసరివేయబడి తామెరుగని దేశములోనికి ఏల త్రోయబడిరి? యెహోవా మాట వినకపోవుటవలననే గదా! గనుక యెహోవా యూదాలోనున్న దావీదు సింహాసనాన్ని గూర్చి మార్చబడని తీర్మానం చేసి, యూదా దేశానికే యిలా దాన్ని వినిపించాడు: "దేశమా, దేశమా, దేశమా, యెహోవా మాట వినుము. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు-సంతానహీనుడనియు, తన దినములలో వర్ధిల్లనివాడనియు ఈ మనుష్యునిగూర్చి వ్రాయుడి; అతని సంతానములో ఎవడును వర్ధిల్లడు; వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చుండడు; ఇక మీదట ఎవడును యూదాలో రాజుగా నుండడు" (యిర్మీయా 22:28-30). దానితో "యూదాలో? దావీదు సింహాసనం శాశ్వతంగా ఎత్తివేయబడింది.

     అయినా, దావీదు సింహాసనాన్ని గూర్చిన దేవుని వాగ్ధానాన్ని ఆయన దీనితో రద్దు పరచలేదు. కాని తన ప్రజలనేలే ఆధిపత్యం యికమీదట యూదాలో ఉండదని ఆయన సూచించాడు. ఈ దావీదు సింహాసన వాగ్దానాన్ని కూడా క్రీస్తునందు నెరవేర్చడానికే మహోన్నతుడు యిష్టపడ్డాడు (యిర్మీయా 23:5; జెకర్యా 6:13–15) గనుక కొన్యా దినములనుండి, యూదా స్వతంత్ర రాజ్యంగా ఉండకుండ అణచివేయబడింది. అయితే ఈ యెకొన్యాసంతతినుండి మెస్సీయా వచ్చే ఏర్పాటును మహోన్నతుడు నెరవేర్చుకొంటూ వచ్చాడు. దావీదుకు నీతి చిగురైన యేసు యెకొన్యాసంతతిగా కలుపబడ్డాడు (కొన్యా అన్నాయెకొన్యా అన్నా ఒకడే; యిర్మీయా 22:24; 24:1; మత్తయి 1:11). అయినా, క్రీస్తు భూమీమీద రాజుగా ఉండునా? చూద్దాం.

     యూదావారు స్వతంత్ర రాజ్యంగా ఉండకుండ త్రోసివేయబడిన దినమునుండి మెస్సీయా వచ్చేవరకు గల మధ్యకాలంలో యూదులు బబులోను - మాదీయ పారసీకము - గ్రీకు రోమా సామ్రాజ్యాల వశంలో ఉంటూ వచ్చారు (దానియేలు 2:25:47). ఇది కూడా ముందుగానే ప్రవచింపబడింది. ఎంత ఆదర్శమైన మూలంనుండి వచ్చిన జనమైనా కేవలం శరీర సంబంధులు నరమాత్రులు దేవుని రాజ్యంగా ఉండలేరని ఇశ్రాయేలు - యూదా రాజ్యాలు రుజువు చేశాయ్. గనుక భౌతిక రాజ్యవిధానాన్నిదేవుడు నిరాకరించి, తన అనాది సంకల్పాన్ని బట్టి ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని క్రీస్తునందు ఆయన ప్రారంభింప బూనుకున్నాడు (ఎఫెసీ. 1:3-6; 1 పేతురు 1:18–20). ఇదే క్రొత్త నిబంధన క్రైస్తవ్యం!

5. పరలోక సంబంధమైన దేవుని రాజ్యం
     వాగ్ధానాలు నెరవేర్చబడేకాలం వచ్చింది. దావీదు సంతానం కన్యగర్భమందు అవతరించే సమయం ఆసన్నమయ్యింది. అప్పుడు దేవుడు తన వాగ్ధానాన్ని మరల జ్ఞాపకం చేస్తూ మరియకు యిలా తెలియజేశాడు- "ఇదిగో నీవు గర్భముధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు; ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండును..? (లూకా 1:31-33). 

     ప్రవచనముల నెరిగిన యేసు, దేవుని రాజ్యాన్ని భౌతిక రాజ్యంగా కాక, పరలోక సంబంధమైన రాజ్యంగా సూచించాడు (మత్తయి 4:17, మార్కు 1:14–15). అయిదువేల మందికి అద్భుత రీతిగా ఆయన ఆహారం పెట్టిన తరువాత, యూదులు రాజుగా చేయుటకు తన్ను బలవంతముగా పట్టుకొనబోతున్నారని యేసు ఎరిగి కొండకు ఒంటరిగా వెళ్ళాడు (యోహాను 6:14–15). 

     చివరికి రోమా అధిపతియైన పిలాతు ఎదుట నిలిచి అతని ప్రశ్నలకు సమాధానం చెప్పినప్పుడు, "యేసు-నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు; నా రాజ్యము ఈ లోకసంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహసంబంధమైనది కాదనెను. అందుకు పిలాతునీవు రాజువా? అని ఆయనను అడుగగా యేసు -నీవన్నట్టు నేను రాజునే; సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని సత్యసంబంధియైన ప్రతివాడును నా మాట వినుననెను" (యోహాను 18:36–38) సత్య సంబంధి కానివాడు (లేక యూదుడు) ఆయన మాట వినకపోవడంలో ఆశ్చర్యపడ నవసరంలేదు (యోహాను 1:1, 8:24-42). 

6. పరలోకమందున్న దావీదు సింహాసనం
     యేసు శరీరధారిగా ఉన్న దినాల్లో దేవుని రాజ్యాన్ని గూర్చి ఆయన బోధిస్తూ ఉంటే, అది భౌతిక రాజ్యమన్నట్టే ఆయన అపొస్తలులు భావించారు. ఆ రాజ్యమందు వారిలో ఎవడు గొప్పవాడై ఉంటాడో అనే తగవులుపడ్డారు (మత్తయి, 18:1-4); దానికై సిఫారసులు తెచ్చుకొన్నారు (మత్తయి 20:20-21) నిరీక్షించారు; ఆయన మరణించగా వారి ఆశ నిరాశ చేసికొన్నారు (లూకా 24:19-21). అయితే పునరుత్థానుడైన క్రీస్తు వారికి తన్ను తాను సజీవునిగా కనుపరచుకొంటూ, మునుపటివలెనె నలభైదినాలవరకు దేవుని రాజ్యాన్ని గూర్చి మరల బోధించాడు (అపొ. 1:3). ఆరిపోయిన వారి ఆశాజ్యోతిని ఆయన తిరిగి వెలిగించాడు.

     “కాబట్టి వారు కూడివచ్చినప్పుడు- ప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా?" అని వారాయన్ను అడిగారు (అపొ. 1:6) అందుకు -"కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొనియున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు." అయినా పరిశుద్ధాత్మ మీమీదికి వచ్చునప్పుడు సంగతులు మీకే అర్థమౌతాయిలే అనే భావాన్ని సూచిస్తూ, ప్రభువు ఆరోహణుడై తేజోమయుడయ్యాడు (అపొ.1:6-7; 1తిమోతి 3:16). అలా పరలోకానికి వెళ్ళిన క్రీస్తుకు దేవుని సముఖంలో పట్టాభిషేకం జరిగింది (దానియేలు 7:12-13). ప్రభువు వెళ్లిన పది (10) దినాలలోగానే పరిశుద్ధాత్మ వచ్చి పరలోకమందు జరిగిన సంగతులను అపొస్తలులకు బయలుపరచాడు (అపొ. 2:1-4). అపొస్తలుల పక్షంగా పేతురు నిలిచి యాకోబు వంశస్థులకు సంగతులను యిలా వివరించాడు (అపొ. 2:14-41): 

     “.....సహోదరులారా, మూలపురుషుడగు దావీదునుగూర్చి మీతో నేను ధారాళముగ మాటలాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను; అతని సమాధి నేటివరకు మన మధ్య నున్నది. అతడు ప్రవక్తయైయుండెను గనుక -అతని గర్భఫలములోనుండి అతని సింహాసనముమీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణ పూర్వకముగా ఒట్టుపెట్టుకొనిన సంగతి అతడెరిగి, క్రీస్తు పాతాళములో విడువ బడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలిసికొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను; దీనికి మేమందరము సాక్షులము" (అపొ. 2: 29-31).

     "కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్ధానమును తండ్రివలన పొంది, మీరు చూచుచు వినుచునున్న దీనిని కుమ్మరించెను. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు; అయితే అతడిట్లనెను- నేను నీశత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచువరకు నీవు నా కుడిపార్శ్యమున కూర్చుండుమని ప్రభువు (తండ్రియైన దేవుడు) నా ప్రభువుతో (క్రీస్తుతో) చెప్పెను. మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను" (అపొ. 2:33–38). దావీదు సంతతికి, అతని సింహాసనానికి సంబంధించిన వాగ్ధానం యిక్కడ నెరవేర్చబడింది. క్రీస్తు దేవుని ప్రజలకు ఏలికగా పరలోకమందు దేవుని కుడిపార్శ్యమునకు హెచ్చింపబడ్డాడు.

     ఆనాటి యాకోబు వంశస్థులకు యిది తేటగా అర్థమయ్యింది. యేసు ఎవరో ఎరుగకనే గతంలో ఆయన్ను అవమానపరచి, సిలువకు అప్పగించారు. గాని ఆయన వాస్తవంగా ఎవరనేది వారికిప్పుడు తేటగా తెలిసిపోయింది. అందుకే వారి అంతరంగం వారిని బలవంతపెట్టింది. గనుక దీనికి పరిష్కార మార్గమేదో చూపండని వారు ఆయన అపొస్తలులనడిగారు (అపొ. 2:37).

     అందుకు పరిశుద్ధాత్మ పూర్ణుడైన పేతురు మూడు ముఖ్యాంశాలను తెలియజేశాడు. (1) "మీరు మారుమనస్సు పొందండి" అంటే -యేసునిగూర్చి, నీతినిగూర్చి, పాపం వగైరాలను గూర్చి కలిగిన మీ భావాలను మీ అంతరంగంనుండి ఖాళీచేయండి. సాతానును సేవించడం మాని; క్రీస్తు యేసు యొక్క అధికారానికి లోబడండి. (2) "పాపక్షమాపణ నిమిత్తం మీలో ప్రతివాడు యేసు నామమున బాప్తిస్మం పొందండి." ఆయన అధికారాన్ని స్వీకరించినట్టు దాని ద్వారా రుజువు చేయండి. (3) మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి." ఆ జనుల్లోనుండి మిమ్మును బయటకు పొమ్మని కాదు. వారి ఆచారా వ్వవహారాల నుండి మీరు వేరుకండి అని పేతురు వారికి సూచించాడు (అపొ.2:38-40). 

     అతని మాటలనంగీకరించినవారు బాప్తిస్మం పొందారు (అపొ. 2:41) అంటే, వారు నీటి మూలంగాను ఆత్మమూలంగాను జన్మించినవారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని ప్రభువు తెలిపారు (యోహాను 3:5). పునర్జన్మ సంబంధమైన స్నానముద్వారాను, పరిశుద్ధాత్మ వారికి నూతన స్వభావం అనుగ్రహించుట ద్వారాను రక్షింపబడినవారితో తిరిగి దేవుని ఆత్మ సంబంధమైన రాజ్యం ప్రారంభమయ్యింది. ఇలాటి వారే దేవుని ఇశ్రాయేలు (గలతీ 6:15-16). పరలోకమందు ఆసీనుడైయున్న క్రీస్తు ప్రభువే వారికి రాజు (కీర్తన. 110:1-2; అపొ. 2:34-35; 1 కొరింథీ. 15:25), క్రొత్త నిబంధన వారి రాజ్యాంగ చట్టం (యిర్మీయా 31:31-36). 

     ఈ రాజ్యం ఖడ్గంతోనో, భౌతికమైన యుద్ధంతోనో ప్రారంభమయ్యేది కాదు. ఈ రాజ్యానికి విత్తనం దేవుని వాక్యం (లూకా 8:10-11) సువార్త ప్రకటనవలన యిది విత్తబడుతుంది (లూకా 8:5; మత్తయి 13:3-4), సువార్తకు విధేయత చూపుటవలన రాజ్యం విస్తరిస్తుంది. సువార్తకు నమ్మకమైన జీవితాలు జీవించడంవలన అది ఫలిస్తుంది. (మత్తయి 13:23). కొందరు రాజ్య పౌరులైన తరువాత కానట్టు బ్రతికితే ఆశ్చర్యపడ నవసరంలేదు (మత్తయి 13:20-22) ఒకవేళ ఈ రాజ్యపౌరుల మధ్య కానివారు కూడా రాజ్య పౌరులుగా కనబడినంత మాత్రాన విమర్శించ పనిలేదు. అట్టిది అపవాది చర్యయేగాని దేవుని చర్య కాదు (మత్తయి 13:24-30). 

     ఇది ఆత్మ సంబంధమైన రాజ్యం గనుక దీని ప్రారంభం బహు సాధారణంగానే ఉంటుందని పరలోకపు రాజు సూచించాడు (మత్తయి 13:31-32). అలాగే అది పెంతెకొస్తు రోజున ప్రారంభమయ్యింది. ఇంచుమించు మూడువేలమంది దానిలో చేర్చబడ్డారు (అపొ. 2:41) లేఖనాలు ఎరుగని మన విమర్శకునిలాటివారికి ఈ సంగతులు తెలియకపోయినందున ఏర్పడ్డ పెద్ద వింతేమి లేదు: గాని నేను భక్తికలిగినవాడను, లేఖనాలు నాకు బాగా తెలుసు, నేను క్రొత్తగా జన్మించినవాడనని తలంచుతూ ఈ వాస్తవాలను నీవు ఎరుగలేదంటే నీవు తప్పక నీకొదేమువలె ఉన్నావనేది సత్యం. నీవు నిజంగా క్రొత్తగా జన్మించి యుంటే, క్రీస్తు ఏలుతున్న దేవుని రాజ్యాన్ని యిలా నీవు చూచియుండేవాడవే! దేవుని రాజ్యం భౌతికమైనదని ఎంచి, అది యేసు మాత్రమే అనుగ్రహించగలడని గుర్తించి, దానిలో తానును ఉండగోరి, ఆయనయొద్దకు రాత్రివేళ వచ్చిన యూదులకు బోధకుడును, అధికారియైన నీకొదేములాగే నీవు కూడా ఉన్నావని రుజువు చేసికొంటున్నావు కదూ? అందుకే "వెయ్యేండ్ల పరిపాలన? అనేదాని అర్థం నీకు తెలియక పోయినా, అది ఎప్పుడొస్తుందా? అని కనిపెడుతున్నావ్; లేక వస్తుందని తలంచుతున్నావ్. దీనిని బట్టి -"నేను ఎత్తాను" అని నీవనుకున్న క్రొత్త జన్మ క్రొత్త జన్మ కాదని నీకు తెలియడం లేదా? (యోహాను 3:3 మరలా చూడు). 

     భౌతికమైన రాజ్యం క్రీస్తు వారికనుగ్రహిస్తాడని భ్రమించిన అపొస్తలులే దాని విషయమై మారుమనస్సు పొంది, ఆత్మ సంబంధమైన క్రీస్తు రాజ్యంలో స్థిరపడ్డారు (హెబ్రీ. 12:28– 29). దానిలో నిలిచి వారు శ్రమపడ్డారు (ప్రకటన 1:9). పునర్జననమునొందిన దేవుని ప్రజలమీద వారి ప్రభువు రాజై ఏలుతూ ఉండగా, ఆ రాజ్యంలో వారు కూడా ఆయనతో సింహాసనాలమీద కూర్చున్నారు (మత్తయి 19:26-28). అందుకే క్రీస్తును ప్రభువుగా అంగీకరించి, ఆయన అధికారాన్ని బట్టి బాప్తిస్మముపొందిన జనులు- "అపొస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుట యందును యెడతెగక” ఉండనారంభించారు (అపొ. 2:42). అందులకే నేడుకూడా ఆత్మసంబంధమైన సంగతులకొరకు, అందులో ప్రాముఖ్యంగా క్రీస్తు నియమంలో నిలిచి నడిచేదానికి మనం క్రొత్త నిబంధనకు (అపొస్తలుల లేఖనాలకు) వెళుతున్నాం. క్రీస్తు రాజుగాను, నీటిమూలముగాను ఆత్మమూలముగాను జన్మించిన ద్విజులు ఆ రాజ్యపౌరులుగాను (ఫిలిప్పీ 3:20); భూభాగము సార్వత్రికమయ్యిందిగాను (ప్రకటన 5:9-10); క్రొత్త నిబంధన రాజ్యాంగ చట్టంగాను గలదే దేవుని రాజ్యము! దాన్ని నీవు చూడలేకుంటే అది నీ దురదుష్టం! అది యిప్పుడు ఉనికిలో ఉంది, ఆ రాజ్య పౌరులే బైబిలు బండారానికి వ్యతిరేకంగా తమ ఖడ్గాన్ని దూశారు!
43. యాజకుడు ఎవరు?
     దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నొద్దకు వచ్చెను.... అంతట యెహోవా సన్నిధినుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు వేయు దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికిచ్చెను. అయితే అహీటూబు కుమారుడైన అహీమెలెకు కుమారులలో అబ్యాతారు అను నొకడు తప్పించుకొని పారిపోయి దావీదునొద్దకు వచ్చెను. 1సమూ 21:1-6; 22:20. 

     తానును తనతోకూడ నున్నవారును ఆకలిగొనినందున దావీదుకు అవసరము వచ్చియున్నప్పుడు అతడు చేసినది మీరెన్నడును చదవలేదా? అబ్యాతారు ప్రధాన యాజకుడై యుండగా యాజకుడే గాని యితరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతోకూడ ఉన్నవారికిచ్చెను గదా? మార్కు 2:25,26. 

     గమనిక: ఇక్కడ మన విమర్శకుని పాయింటేమో అర్థమయ్యిందా? దావీదు సముఖపు రొట్టెలు తీసుకున్న సమయంలో యాజకుడు అహీమెలెకు అని మొదటి లేఖనం (1సమూ 21:1-6) చెప్పింది; అయితే అతని (అహీమెలెకు) కుమారుడైన అబ్యాతారు ఆ కాలమందు ప్రధాన యాజకుడని రెండో లేఖనం (మార్కు 2:25-26) చెప్పింది. ఇలా చెప్పడం పరస్పర వ్యతిరేకతను రుజువు చేయదా? అని మన మిత్రుడు అడుగుతున్నాడు. కొండను త్రవ్వి ఎలుకను పట్టినట్టు, మన మిత్రుడు బైబిల్లో ఎంత తప్పును పట్టాడో చూచావు కదూ? అయినా బైబిల్లో ఈలాటి పరిస్థితి ఏ మూలంగా ఏర్పడిందో చూద్దామా? ఈ క్రింది సంగతులను జాగ్రత్తగా గమనించాలి సుమీ!

     (1) మొదటి లేఖనమందు [జరిగి] వర్ణింపబడిన సంఘటనకూ, రెండో లేఖనంలో అది వ్రాయబడ్డ సమయానికి మధ్య రమారమి (1000) వెయ్యి సంవత్సరాలు గతించిపోయాయని గుర్తించాలి.
     (2) మొదటిది హెబ్రీలోను, రెండోది గ్రీకులోను వ్రాయబడ్డదని జ్ఞాపకముంచుకోవాలి.
     (3) ఇప్పుడు మన మిత్రుడు చర్చించుతున్నది ఆ గ్రంథ మూలాలనుండి గాక అనేకవందల సంవత్సరాల తరువాత జరిగిన తర్జుమాలను ఆధారం చేసికొని మాట్లాడుతున్నాడని గమనించాలి: ఇలాటి ఆలోచనలు లేకపోతే అతని మాటలచేత బైబిలును అపార్థం చేసుకునే అవకాశముంది. తిరిగి సంగతులు చర్చించుదాం.

     మొదటి సంభవాన్ని మరోసారి ఆలోచన చేద్దాం. నోబు అనేది యాజకులకు యివ్వబడిన పట్టణం. మన మిత్రుడు ముందు లేఖనంలో సూచించినట్టు -అహీమెలెకు -అబ్యాతారు అనే యిరువురు తండ్రీ కుమారులే! వీరిద్దరిలో ఎవరు యాజకుడు? అనేది మన సమస్య కానవసరంలేదు. వాస్తవంగా వారిరువురు ఆ కాలంలో యాజకులే. ఈ సందర్భంలో తండ్రి చంపబడతాడు. అతని కుమారుడు అతని స్థలంలో ఆ ప్రధాన యాజకుని స్థానాన్ని ఆక్రమించాడు. అసలు సంగతులు ఎలా సంభవించాయో చూడు.

     దావీదు తనకు కీడు చేయనుద్దేశించాడన్న చెప్పుడు మాటలను బట్టి, సౌలు దావీదును చంపే ప్రయత్నాల్లో ఉన్నాడు. గనుక అతని బారినుండి తప్పించుకోడానికి దావీదు తన అనుచరులతో పాటు అరణ్య ప్రాంతంలో తిరుగుతున్నాడు. అలా తిరుగులాడుతూ, ఒకానొక రోజున ఆకలి బాధతో నోబుకు వచ్చి అబ్యాతారు తండ్రియైన అహీమెలెకు ఆధ్వర్యంలో సముఖపు రొట్టెలను దావీదు అందుకుంటాడు. తాను ద్వేషించి చంప తలపెట్టిన దావీదుకు అహీమెలెకు ఆ రొట్టెలనిచ్చి ప్రాణం నిలుపుకునేలా సహాయపడ్డాడని, అతడు చేసిన ఆ కార్యాన్ని రాజద్రోహంగా భావించిన సౌలు కేవలం, ఆ అల్ప కారణాన్నిబట్టి అహీమెలెకును మాత్రమే గాక, యాజకులలో 85 మందిని కూడా ఒకే సమయంలో చంపిస్తాడు. తన తండ్రియూ, తన యింటివారై మిగిలిన యాజకులును హతులౌగా, వారిలో అబ్యాతారు మాత్రమే తప్పించుకొని పారిపోయి దావీదును ఆశ్రయిస్తాడు.

     ఆ సమయంలో దావీదు- "నీ తండ్రి యింటివారందరికిని మరణము రప్పించుటకు నేను కారకుడనైతిని గదా, నీవు భయపడక నా యొద్ద భద్రముగా ఉండుము; ...నా ప్రాణము తీయజూచువాడును నీ ప్రాణము తీయజూచువాడును ఒక్కడేయని అబ్యాతారుతో చెప్పెను" (1సమూ 22:22-23). అప్పటినుండి ఏఫోదును ధరించుకున్న ప్రధానయాజకుడు అబ్యాతారే (1సమూ 23:6). దావీదుకు సముఖపు రొట్టెలనిప్పించిన అహీమెలెకు హత్య, అతని కుమారుడైన అబ్యాతారు అతని స్థానానికి ఎక్కించబడటం, అనేవి ఆనాటి సంభవాలే. అయితే దావీదు అబ్యాతారులు కలిసి ఏకంగా వున్నందున అబ్యాతారు కాలంలో దావీదు సముఖపు రొట్టెలను తిన్నాడన్న ఆలోచన యూదులకు వ్యతిరేకమయ్యింది కాదు. అర్థమయ్యిందా?

     అయినా ఈ సంఘటన ప్రస్తావింపబడిన సందర్భానికి వద్దాం (మార్కు 2) పంటచేలలో గుండా పోతూ, వెన్నులు తుంచుకొని తింటున్న యేసు శిష్యులపై పరిసయ్యులు నేరము మోపుతున్న సమయమది. అలా వెన్నులు తుంచుకొని తినడంలో తప్పులేదు (ద్వితీయో. 23:25); అయితే ఆ పని వారు సబ్బాతు దినాన చేస్తున్నారని పరిసయ్యులు విమర్శిస్తుంటే, ప్రభువైన యేసు దానికి సమాధానం చెప్పిన సందర్భమది!

     సంఘటన జరిగిన దానికి, సంభవం ఉదహరించిన దానికి మధ్య రమారమి 1000 సంవత్సరములు గతించిపోయాయ్. అయినా ఈ సందర్భంలో ఆయన బహు సాధారణమైన ధోరణిలో మాట్లాడుతూ, దావీదును అతనితోకూడా నున్నవారును తినకూడని సముఖపు రొట్టెలను తిని, నిర్దోషులుగా ఉండిన సంగతి మీరు చదువలేదా? అని వారినడిగారు. ఆ సంఘటనను గూర్చి యూదుల మధ్యనున్న జ్ఞానాన్ని బట్టి'అబ్యాతారు ప్రధాన యాజకుడుగా ఉన్నదినాల్లో" అని సందర్భ జ్ఞప్తికై ప్రభువైన యేసు ప్రయోగిస్తే, తప్పులు పట్టటానికి ప్రయత్నిస్తున్న ధర్మశాస్త్రోపదేశకులకే ఆయన ఉదహరించిన విధానం తప్పుగా కన్పించలేదు.

     అందులో భాషలు మారిపోయాయ్. ఆ నాడు హెబ్రీ భాషలో దాఖలు చేయబడ్డ సంభవాన్ని ప్రభువు ప్రస్తావించితే, ఆయన ఈ మాటలు పలికిన తరువాత సుమారు 30 సం||లకు మార్కు తన సువార్తలో దాన్ని రికా ర్డు చేసాడు. ఆ రికార్డయిన తరువాత రమారమి 1900 సం||లకు అది తెనిగించబడింది. తర్జుమా బహు జాగ్రత్తగా చేయబడిందే. అయితే మానవ దోషం (human error) తర్జుమాల్లో అక్కడక్కడ తొంగి చూచింది. ఇక్కడ జరిగిన తర్జుమానుబట్టి- 'అబ్యాతారు ప్రధాన యాజకుడై యుండగా" అనే పదాల ప్రయోగం సమస్యగా తోచవచ్చు. అయితే ఆది (గ్రీకు) భాషలోనుండి ఇంగ్లీషు లోనికి తర్జుమా చేయబడినట్లు "In the days of Abiathar, the High Priest"- "ప్రధాన యాజకుడైన అబ్యాతారు దినములలో" అని తెలుగు తర్జుమా ఉన్నట్లయితే, విషయం యింకా తేటగా వుండేదే అయినా ఆనాటి విమర్శకులకు తప్పులు వెదకినా కన్పించనివి యిప్పటికి మన మిత్రునికి కన్పిస్తుందంటే అది కేవలం వాస్తవాలను అంగీకరించ లేని మానసిక స్థితినుండి కలిగిన సమస్యయేనని చెప్పక తప్పదు.

     ఒకవేళ అది తర్జుమా వలన కలిగిన అపార్ధమే అనుకున్నా వాస్తవాలను వాస్తవాలుగా చూడాలనే మనస్సుంటే, ఆది భాషలో అది ప్రయోగింపబడ్డ రూపాన్ని చూడవచ్చు. అది భాష తెలియక పోయినా, లేక ఆ రచన అందుబాటులో లేకపోయినా, వేరే తర్జుమాలను చూచి లేక దాని పూర్వ చరిత్రను గమనించి సంగతులను తెలుసుకొని యుండవచ్చు. అలా చేసేది పండితుల లక్షణం. అంటే మనమిత్రుని హేతువాదం పాండిత్యదూరమా? కానప్పుడు అతడు ఎందుకు బైబిలును పరిశీలించి యుండకూడదు?

     ఒకవేళ అదే హేతువాదమైతే దాని నిజ స్వరూపమేలాటిదో కన్పించిందిగాని, అదే హేతువాదం కాకపోతే- రెండు వేర్వేరు ప్రాచీన రచనల మధ్య అందులో ఒకటి హెబ్రీ, మరొకటి గ్రీకు భాషల్లో వ్రాయబడ్డ రచనలమధ్య, మొదటిది ప్రాచీన యూదుల రాజ్యాంగ చట్టానికి సంబంధించినది. రెండవది క్రైస్తవ్యానికి సంబంధించిన రచనల మధ్య భేదాలను లేక వ్యత్యాసాలను ఆలోచించే సందర్భంలో ఎంతటి విశాలమైన దృష్టిని, దృక్పథాన్ని కనుపరచాలో పాండిత్యమున్న ఎవడికైనా తెలిసియుంటుంది. గనుక ఇక్కడ మన మిత్రుడు బైబిలుపై తప్పు మోపడానికి ప్రయోగించిన మాటలు విద్యలేని పామరుని మాటల్లా ఉన్నాయి గనుక; బైబిలుపై అతని విమర్శను ఎవడూ లక్ష్యపెట్టనక్కర లేదు.

     బైబిలు రచనలో ఎన్ని ఆటంకాలు అడ్డులూ ఎదురైనా, అది ఏక గ్రంథంగా నిలిచి వాస్తవాలను ప్రతిధ్వనిస్తుంది. గనుక బైబిలు దేవుని గ్రంథం అనడానికి ఏ సంశయం లేదు. వాస్తవాలను అంగీకరించే మనస్సు లేకపోతే, అది వేరే విషయం: అలాటి వారు మానవ చరిత్రలో ఎప్పుడూ వుంటూనే వస్తున్నారు. వారిలో వీరు కొందరౌతారు. అంతకంటే వారిలో గొప్ప విశేషమేమి లేదు.

     సరే; యింతకు యాజకుడెవరట? అహీమెలెకు, అబ్యాతారు అనే తండ్రి బిడ్డలిద్దరు యాజకులే. తండ్రి ప్రధానయాజకుడై యుంటాడు. అతని ఆధ్వర్యంలో దావీదు సముఖపు రొట్టెలను పొందుతాడు. అయితే వాటిని దావీదుకు అందించినవాడు అబ్యాతారేనేమో తెలియదు. ఏదియెలాగున్నా అహీమెలెకు చంప బడటం, అబ్యాతారు ప్రధాన యాజకుడవ్వటం ఒకే సందర్భానికి సంబంధించిన కార్యం గనుక అక్కడ ప్రశ్నించే సమస్య ఆనాటి విమర్శకులకు కనబడలేదు. అందులో అది కేవలం సందర్భ జ్ఞప్తికై ప్రయోగింపబడిన మాట. గనుక తప్పులేని చోట తప్పులు పట్టటానికి ప్రయత్నించి మనమిత్రుడు హేతువాదాన్ని నవ్వులపాలు చేశాడు. అంతకంటే తన రచనలో హేతువాదం అనుభవించే ఏ గౌరవమూ లేదు!
44. వద్దన్నా కద్దన్నా - ఒకటే అర్ధం!
     ప్రయాణ సన్నాహము కొరకు చేతికర్రను తప్ప రొట్టెనైనను జాలెనైనను, సంచిలో సొమ్ము నైనను, తీసుకొనక చెప్పులు తొడుగుకొనుడనియు, రెండంగీలు వేసుకొన వద్దనియు వారి కాజ్ఞాపించెను. మార్కు 6:8-9,

     మీ సంచులలో బంగారునైనను వెండినైనను, రాగినైనను ప్రయాణముకొరకు జాలెనైనను, రెండు అంగీలనైనను, చెప్పులనైనను, కర్రనైనను సిద్ధపరచుకొనకుడి మత్త 10:9.

     గమనిక: ఒక వస్తువును యిద్దరి ముందు పెట్టి, దాన్ని గూర్చి రెండు వాక్యాలు వ్రాయండని వారినడిగితే, ఆ యిద్దరు వ్రాసే ఆ రెండు వాక్యాల్లో కూడా వ్యత్యాసం గోచరిస్తుంది. లేక యిద్దరు విలేఖరులు ఒక నాయకుని యెదుట నిలిచి రికార్డు చేసిన మాటలు తమ పేపర్లలో ప్రచురించేటప్పుడు వారి రిపోర్టుల్లో తప్పక వ్యత్యాసం కన్పిస్తుంది. అలాటప్పుడు మత్తయి, మార్కు రచనల్లో కన్పించే వ్యత్యాసం మూలంలోనిదే అనడం అర్థరహితం ఎందుకంటే, దేవుడు తన సందేశాన్ని మానవుల ద్వారా బయలుపరచ నుద్దేశించినప్పుడు, ఆయా లేఖకులకు ఆయన వదలిన స్వాతంత్య్రం మేరలోనే అవి ఉన్నాయ్. ఆ వ్యత్యాసం విషయంలో నీ భావం ఎలా ఉన్నా వాటిలో మన మిత్రుని దృష్టి మాత్రం ముఖ్యంగా - "చెప్పులు, చేతికర్ర" అనేవాటిమీదనే పడింది. వీటిని గూర్చే "వద్దన్నా కద్దన్నా ఒకటే అర్థం!" అని పరిహసిస్తున్నాడు, ఈ పండితుడు!

     అయితే మన ముందున్న లేఖనాలు రమారమి 2000 సంవత్సరాల నాటివని మరచిపోతే పొరపాటు చేసినవారమౌతాం. పక్షపాత దృష్టిలేని చదువరిగా వాటిలో నీకు సమస్య కన్పించదని భావిస్తున్నా! అవి నీకు ఎలాగున్నా పురాతన రచనలను పరిశీలించే తార్కికుడుగా, నాకు మన విమర్శకుడు పలికే పరస్పర వైరుధ్యం పై లేఖనాల్లో కన్పించడం లేదు. వాటిలో యిమిడియున్న అసలు సందేశమేమో ఎరిగినప్పుడు సమస్య ఎవరికీ లేకుండ తేలిపోతుంది, చూడు!

     సందేశం: "అన్నవస్త్రాల కొరకు ప్రయాణ ఖర్చుల కొరకు ప్రయాసపడకు; చేతికర్ర ఉంటే తీసుకో చెప్పులుంటే తొడుక్కో ఒకవేళ సమయానికి అవి అందుబాటులో లేకపోతే, వాటిని సిద్ధపరచుకోడానికి ప్రయత్నించకు; మీరు పోయే స్థలాలలో మీ అవసరతలు సాధారణంగా తీర్చబడతాయ్." ఇదే ఆ రచనల్లో ఈ సందర్భంలో చర్చించబడిన సమాచారం. ఇందులో పరిహాసానికి తావేది? పరస్పర వైరుధ్యమనడానికి చోటేది? పరిహాసాలాడడానికి తావులేని చోట పరిహసించేదేనా - హేతువాదమంటే? పరిహసించే పామరులకంటె పరిశీలించే పండితులను అనుసరించడం శ్రేష్టం కదూ?

     ఆయా రచనలు చదివి వాటిలోనున్న సందేశాన్ని గ్రహించలేక, తనకు తోచిన మాటలను పలికి మన మిత్రుడు - వాస్తవవాది నంటున్నాడే! మన మిత్రుని వాస్తవవాదం యిలాటిదేనేమో! ఏది యెలాగున్నా పై లేఖనాలలో అసంబద్ధముంది; అవి రెండు ఒకదానికి మరొకటి పరస్పర విరుద్ధంగా ఉన్నాయంటే మాత్రం - అది వాస్తవ వాదం కాదు.
45. కూట సాక్ష్యం
     నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను నా సాక్ష్యము సత్యమే. యోహా. 8:14. 

     నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనిన పక్షమున నా సాక్ష్యము సత్యము కాదు యోహా. 5:13. 

     గమనిక: అలా వ్రాయబడ్డ లేఖనాల్లో అంతర్గత వైరుధ్యం లేదా? అని మన మిత్రుడు అడుగుతున్నాడు. సందర్భ రహితంగా చూస్తే ఉన్నట్టే గోచరిస్తుంది. ఒకవేళ సందర్భ రహితంగా రచనలను విమర్శించడమే మన మిత్రుడు పలికే హేతువాదం కాబోలు! అయితే పై లేఖనాలు సందర్భ రహితంగా ఉపయోగించబడలేదే! పై లేఖనాల సమయ సందర్భాలను ఆలోచన చేయకముందు ఒక ఉదాహరణను చూద్దాం.

    "నేను రాను" - "నేను వస్తాను" అనేవి పరస్పర విరుద్ధాలు కానవసరం లేదు. "నేను మూఢుల వితర్కాలకు రాను; నేను జ్ఞానుల గోష్టికి వస్తాను” అనేవాటిలో తార్కిక విరుద్ధం లేనట్టే - పై రెండు లేఖనాల్లో కూడా సమస్య కన్పించదు, చూడు!

     అయితే మరొక ముఖ్య గమనిక: కాలక్రమంలో - యోహాను 5:13 ముందా? లేక యోహాను 8:14 ముందా? యోహాను 5:13 ముందు కదూ? మన మిత్రుడు పై లేఖనాలను కోట్ చేసిన రూపం చూడు! ఈ హేతువాదం, వెనుకది ముందు, ముందుది వెనుకపెట్టి వాస్తవాలను తారుమారు చేసి సత్యాన్ని అబద్ధంగా చూప ప్రయత్నించేదేనా? అలా కాకపోతే హేతువాదిననుకుంటూ మన మిత్రుడు చేసిన పనేమి? హేతువాదులు ఈ రచనను చదివి ఉంటారు గదా? వారిలో ఎవడూ ఈలాటి అర్థరహితమైన విమర్శకు తన నోరు తెరువలేదంటే - వారి హేతువాదం యిలాటిదని అంగీకరించినట్టేకదూ?

     ఒకడు నిజంగా హేతువాదియే అయ్యుంటే - ఒక గ్రంథాన్ని ఉన్నది ఉన్నట్టు చూడగలిగి ఉండాలి. అలా చూట్టానికి చర్చింపబడ్డ విషయాలు ఆయా సందర్భాల్లో పెట్టి పరిశీలించాలి. పరిశీలించకుండనే అది తప్పైయుండాలి అనే భావంతో విమర్శలో దిగేవాడు హేతువాది కాడు. ఒక రచనలో వాస్తవాలుంటే పరిశీలనా పూర్వకంగా వాటిని బయట పెట్టడానికే హేతువాదం గాని, సత్యాన్ని మభ్యపెట్టడానికి, తన సొంత భావాలకు వ్యతిరేకమైన వాస్తవాలను కప్పిపెట్టడానికి వినియోగించేది నిజానికి హేతువాదమనబడదు.
     ఏదియేమైనా, బైబిలు లేఖనాల్లో మన మిత్రుడు చూప ప్రయత్నించిన ఏ సమస్యా లేదు. మొదటిగా యోహాను 5:30నుండి పరిశీలన ప్రారంభిద్దాం, చూడు. ఇశ్రాయేలీయుల ధర్మశాస్తాన్ని బట్టి - యిద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థాపింపబడాలి (సంఖ్యా 35:30; ద్వితీయో. 17:5, 6) అందుకే, యూదులతో మాట్లాడుతూ - నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పకొనిన పక్షమున నా సాక్ష్యము సత్యము కాదు అంటూ, తనకున్న యితర సాక్ష్యాలను యేసు సూచించారు. వాటిలో (1) బాప్తిస్మమిచ్చు యోహాను సాక్ష్యం (యోహాను 5:33); (2) తాను చేయుచున్న క్రియల సాక్ష్యం (5:36); (3) తనను పంపిన తండ్రి సాక్ష్యం (5:37)అనేవి, సూచింపబడ్డాయి! ఈ సందర్భంలో యేసు తనను గూర్చిన సాక్ష్యాలను చూపి, తన మాటలను తాను రుజువు చేసుకొన్నాడు. ఇదీ యోహాను 5వ అధ్యాయంలో చర్చింపబడింది. అంటే, సాక్ష్యాన్ని గూర్చి యేసు ముందుగా సూచించిన మాటలు ఈ సందర్భంలోనివే! యథార్థవంతునికి యిందులో ఏ సమస్యా కన్పించదు. ఆ తరువాతనే 8వ అధ్యాయానికి వెళ్లాలి.

     యోహాను 8లో - "మరల యేసు - నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను. కాబట్టి పరిసయ్యులు- నిన్నుగూర్చి నీవే సాక్ష్యము చెప్పకొనుచున్నావు; నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా, యేసు- నేను ఎక్కడనుండి వచ్చితినో యెక్కడికి వెళ్లదునో నేనెరుగుదును గనుక నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను నా సాక్ష్యము సత్యమే.” (సందర్భాన్ని చదువరి గ్రహించి ఉంటాడు కదూ?) యేసు ఆ మాటలతోనే ఆగలేదు. ఆయన యింకా మాట్లాడుతూ - "నేను ఒక్కడనైయుండక, నేనును నన్ను పంపిన తండ్రియు కూడ నున్నాము. గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. మరియు ఇద్దరు మనుష్యుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది గదా, నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనువాడను; నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడని చెప్పెను" (యోహాను 8:12-18).

     మన మిత్రుడు కోట్ చేసిన యోహాను 8:14 యొక్క సందర్భమిది. ఇందులో పరస్పర వైరుధ్యమెక్కడో కన్నులున్నవానికి కన్పించడంలేదు. అయితే వీటిని "కూట సాక్ష్యం" అని వర్ణించిన మన మిత్రుని వైజ్ఞానిక స్థాయి ఎట్టిదో చదువరికి తెలియడం లేదా? బైబిలును యిలా విమర్శించిన మన మిత్రుడు చదువురానివాడు! అందుకే అతని రచనలో మౌఢ్యం కన్పిస్తుంది. బైబిల్లోది కూట సాక్ష్యం కాదు; అది మేటి సాక్ష్యమే; అది నమ్మకమైన సత్య సాక్ష్యం కూడా! సత్యం ఎంత తేటగా రుజువు చేయబడినా, దాన్ని అంగీకరించే మనస్సు లేనివారు ప్రతి తరంలో కన్పిస్తారు. మొదటి శతాబ్ధంలో ఈ సంగతులు జరుగుతున్నప్పుడు సత్యాన్ని ఎంత తేటగా చూపినా, తామేర్పరచుకొని, నిలిచిన మార్గాలను మార్చుకొనే మనస్సులేని యూదా మత నాయకులు సత్యాన్ని వ్యతిరేకించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. మరి నేడు మన మిత్రుడు ఏమి చేయాలను కుంటాడో? ఎవరేమి చేయదలచుకున్నా సత్యం తల వంచకుండా, అబద్ధానికి, అసత్యానికి వ్యతిరేకంగా నిలుస్తుంది! మరి మన చదువరి ఏమి నిర్ణయించుకుంటాడో అది తనకే వదలివేయబడుతుంది.
46. చలామణి లేని అప్పగింత
     తండ్రి కుమారుని (యేసును) ప్రేమించుచున్నాడు, కనుక ఆయన చేతికి సమస్తము అప్పగించియున్నాడు. యోహా. 3:35. 

     నా కుడివైపునను నా యెడమవైపునను కూర్చుంటనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రిచేత యెవరికి స్థిరపరచబడెనో వారికే దొరకును. మత్త 20:23.

     గమనిక: దేవుని రాజ్యానికి సంబంధించి మూడు రకాలైన అధికారాలున్నట్టు లేఖనాలు సూచిస్తున్నాయి. (1) శాసించు అధికారం (Legislative authority). ఈ అధికారాన్ని తండ్రి వహిస్తున్నట్టుంది (అపొ. 1:6; మత్తయి 20:23; వగైరాలు చూడు). (2) కార్యాచరణ అధికారం (Executive authority). దీన్ని యేసుక్రీస్తు ప్రభువు వహిస్తున్నట్టుంది (యోహాను 5:19-20, 30; మత్తయి 28:18–20; వగైరాలు చూడు) (3) చట్టాన్ని వ్రాయించి, దాన్ని వివరించే అధికారం (మనుష్యుల ద్వారా) పరిశుద్ధాత్మ వహించుతున్నట్టుంది (మత్తయి 12:31-32; యోహాను 14:26-27; 1 కొరింథీ, 2:9-11; వగైరాలు చూడు). బైబిలు చదివి కూడా, ఈ అధికార విభజనను అందులో సూచించునట్లు గ్రహింపలేక మన మిత్రుడు లేఖనాలను అపార్థం చేస్తున్నాడు (2 పేతురు 3:15-19). అంతకంటె తన విమర్శలో విశేషమేమీ లేదు.

     ఏదియెలాగున్నా దేవుని (ఆత్మ సంబంధమైన) రాజ్యానికి నిర్ణయాలు మాత్రం భూమిమీద జరుగకుండ జాగ్రత్త వహింపబడినట్టు బైబిలు తేటపరుస్తుంది. అందుకే - “నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపనివానికి తీర్పు తీర్చువాడొకడు కలడు; నేను చెప్పినమాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు; నేను ఏమనవలెనో యేమి మాటలాడవలెనో దానినిగూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞ యిచ్చియున్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేనెరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పినప్రకారము చెప్పుచున్నానని యేసు తెలియజేశాడు (యోహాను 12:48-50).

     అంతేనా? అంతేకాదు! దేవుని రాజ్యాంగ చట్టాన్ని బయలుపరచడానికి పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ కూడా - "తనంతట తానే ఏమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి, సంభవింపబోవు సంగతులను మీకు (అపొస్తలులకు) తెలియ జేయును" అని ఆయనే సూచించాడు కూడా! (యోహాను 16:13-14).

     దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? శాసనసభ (Legislature); శాసనాలను చేసి వాటిని అమలు చేయడానికి కార్యాచరణకు (Executive) అప్పగించినట్టు - దేవుని రాజ్యాన్ని గూర్చిన శాసనాలను తండ్రి పరలోకమందే నిర్ణయించి, అప్పటిలో భూమిమీద ఉండిన తన కుమారునికి (క్రీస్తుకు) అప్పగించినట్టు తెలుస్తుంది కదా? (యోహాను 3:35). గనుక దేవుని రాజ్యంలో ఎలాటివారు యేసు కుడివైపున, ఎడమవైపున కూర్చుంటారో, అంటే, యేసు తరువాత దేవుని రాజ్యంలో ఎవరు మొదటి స్థానంలో, రెండో స్థానంలో ఉంటారో, అది - శాసన నిర్మాణంలోనే సూచింపబడుతుంది. ఆ నిర్ణయాలు తండ్రియైన దేవుడు మాత్రమే చేస్తాడు. అయితే ఆ నిర్ణయాలను అమలు చేసే హక్కును పూర్ణంగా ఆయన తన కుమారునికి అప్పగించాడు. ఈ సంగతినే యోహాను
8:355 లో) యేసు సూచించాడు (Jesus was given all executive powers).

     అయితే జెబెదయ కుమారుల తల్లి వచ్చి, శాసన నిర్మాణాధికారాన్ని వినియోగించి తన కుమారులకు దేవుని రాజ్యంలో హెచ్చు స్థానాలను యివ్వమని ప్రభువును వేడుకుంటే - శాసన నిర్మాణాధికారం నాయొద్ద లేదని యేసు తెలియజేశాడు (మత్తయి 20:23లోని సందేశమిదే! దీనిని చెలామణిలేని అప్పగింత అనడం అర్థరహితం కాదా?).

     అసలు యేసు భూమిమీదకి వచ్చింది తన యిష్టం నెరవేర్చుకోడానికి కాదు, తనను పంపిన తండ్రి చిత్తం నెరవేర్చడానికే (యోహాను 6:38). ఆయన నెరవేర్చటానికి వచ్చిన కార్యక్రమాన్ని మించి ఆయనను చేయమంటే, యేసు చేయడానికి వీలుపడదన్నాడు. ఆ సంగతి అలా వుంచి, యింతకు అసంబద్ధం ఎలాగుండాలో మన మిత్రునికి తెలిసే మాట్లాడేడా? మన మిత్రుని మాటల్లో జ్ఞానం లేదు. పై లేఖనాలను వాటి పరిధులలో ఆలోచిస్తే, చెలామణిలేని అప్పగింత అనడానికి తావేలేదు.
47. హతోస్మి ధన్యోస్మి!
     పాపము చేయనివాడెవడును లేడు, 2 దిన. 6:36, (ఇంకా చూడు; ప్రసం. 7:20; రోమా, 3:11;1 యోహా, 1:8).

     దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును. గనుక వాడు పాపము చేయడు; వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. 1 యోహా, 39, (ఇంకా చూడు; యాకో 5 16).

     గమనిక: మన మిత్రుడు నిజంగా ద్విజుడే అయ్యుంటే యిక్కడ సమస్య కనిపించేది కాదు. ఎందుకంటే పై లేఖనాలు మానవ జీవితంలోని రెండు రకాలైన జన్మలను గురించి మాట్లాడుతున్నాయ్: మొదట శరీరమునుబట్టి పట్టిన మానవ స్థితిని; తరువాత ఆత్మను బట్టి పట్టిన స్థితిని సూచిస్తున్నాయ్, గనుక వాటి మధ్య అసంబద్ధముందనడం - అవివేకం, అర్థరహితం, క్షయ బీజమునుండి పుట్టిన మానవ మాత్రులలో - పాపము చేయనివాడు లేడనేది వాస్తవం. "అపవాది మొదటనుండి పాపము చేయుచున్నాడు. పాపము చేయువాడు
అపవాది సంబంధి; అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను" (1 యోహాను 3:8).

     అలా ప్రత్యక్షమైన దేవుని కుమారుడు - ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యాన్ని చూడలేడని తెలియజేశాడు. (యోహాను 3:3-5) దాన్ని తొలిగా విన్నయూదుల అధికారియైన నీకొదేముకు ఈ క్రొత్త జన్మ భావన వింతగా తోచింది. కారణమేమంటే - యూదులు మధ్య అప్పటికి రమారమి 1500 సంవత్సరాలుగా పూజారులున్నారు గాని, వారు ఒకే ఒక గోత్రానికి చెందినవారుగానే ఉండిపోయారు. వారు శరీరాన్ని బట్టి లేవీ గోత్రికులు మాత్రమే. వారు ద్విజులు కారు. ద్విజులు, రెండో జన్మ ఎత్తినవారు అనే భావన యూదులకు క్రొత్తదనే చెప్పాలి. గనుకనే యూదుల్లో అనుభవంగల బోధకుడైన నీకొదేము, యేసు బోధలోని సంగతిని గ్రహించలేక యిలా ప్రశ్నించాడు - "ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవమారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా?"

     క్రొత్తగా జన్మించినవాడే (ద్విజుడే) దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడని యేసు సూచిస్తూ, నికోదేముతో యిలా అన్నాడు. ".. శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై యున్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు ." (యోహాను 3:3-8). క్రొత్త జన్మవలన పాపి పరిశుద్ధుడుగా తీర్చబడతాడు. "మన రక్షకుడైన దేవునియొక్క దయయు, మానవులయెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే - పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను" (తీతు 3:4-5).

     ఈ జన్మను గూర్చి పేతురు వివరించుతూ - "మీరు క్షయబీజమునుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవునివాక్య మూలముగా అక్షయబీజమునుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదరప్రేమ కలుగునట్లు, మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనినవారైయుండి, యొకనినొకడు హృదయపూర్వకము గాను మిక్కటముగాను ప్రేమించుడి. ఏలయనగా -సర్వశరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డి పువ్వువలె ఉన్నది; గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును." అని అన్నాడు (1 పేతురు 1:22-24). ఇందులో కూడా క్షయ, అక్షయ బీజాలవలన కలిగిన - శరీర, ఆత్మ సంబంధమైన జన్మలు వివరించబడ్డాయి.
యాకోబు యిలా అన్నాడు. - "ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యమువలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను" (యాకోబు 1:18). వీరే దేవుని రాజ్య పౌరులు (యోహాను 3:5); రక్షింపబడినవారు (తీతు 3:5). వంశం, గోత్రం, భాష, రంగు, కులం వగైరా భేదాలు ఏవియులేని ఒకే తండ్రి కుమారులు; వారు పాపము విషయమై చనిపోయి, నీతి విషయమై జీవించునట్టు క్రీస్తులోనికి బాప్తిస్మము పొందినవారు (రోమా 6:3–6; గలతీ. 3:26-28) గనుక ద్విజులైనవారందరు నేడు దేవునికి పూజారులై ఉంటారు (1 పేతురు 2:9); దేవుని మూలంగా పుట్టినవారంటే వీరే.

     మానవ సమస్యలకు దేవుని శాశ్వత పరిష్కారం - మానవుడు క్రొత్తగా జన్మించడమే (ద్విజుడవ్వడమే) నీటిమూలంగాను, ఆత్మమూలంగాను జన్మించడమన్నా పునర్జన్మ సంబంధమైన స్నానముద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతనమైన స్వభావము అనుగ్రహించడమన్నా దేవుని వాక్య మూలముగా అక్షయ బీజమునుండి పుట్టింపబడిన వారన్నా సత్య వాక్యము వలన (దేవుడు) ఆయన తన సంకల్పం ప్రకారం కన్నాడన్నా ఒక్కటే - "దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును, గనుక వాడు పాపము చేయడు; వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు? అని మన మిత్రుడు కోట్ చేసిన 1 యోహాను 3:9లోని భావమిదే! ఇది భౌతికంగా జన్మించడం కాదు.

     “దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును." ఆయన బీజమేది? ఆయన వాక్యమే! (1 పేతురు 1:22-24). “నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొనియున్నాను" (కీర్తన. 119:11). దేవుని కుమారునిగా బ్రతకాలని ఆశపడుతున్నప్పుడు అతడు పాపము చేయజాలడనేది వాస్తవం. అంతేగాని, ప్రకృతి సంబంధి, అపవాది సంబంధి, శరీర సంబంధి పాపము చేయడని బైబిలు చెప్పలేదు. ఇలాటివారిని గూర్చి మాట్లాడినప్పుడు - 'పాపము చేయనివాడెవడునులేడు” అని బైబిలంది.

     “హతోస్మి! ధన్యోస్మి! అనే మన మిత్రుని ఆశ్చర్యార్థకాలు - తన గ్రహింపులోని సమస్యనుండి పుట్టినవే. నిజంగా మన మిత్రుడు ద్విజుడే అయ్యుంటే - పై లేఖనాలను అర్థం చేసుకోడానికి యిలాటి యిబ్బందిపడియుండేవాడే కాదు. అపవాది సంబంధిగా, శరీర సంబంధిగా పాపం చేయనివాడెవడూ లేడు; దేవుని మూలంగా పడితే, అంటే క్రొత్త జన్మ ఎత్తితే వాడు పాపమునుండి విమోచింపబడతాడు గనుక – పాపానికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాడని లేఖనం అంటుంది. దేవుని మూలంగా పుట్టడమంటే భావమేమో తెలియలేదు గనుక మన మిత్రునికి తెలుగుపోయి సంస్కృతం వచ్చినట్టుంది. అంతేగాని బైబిలు లేఖనాల్లో సమస్యే లేదు.
48. వారసత్వం రుజువు కాలేదా?
     తండ్రికి కలిగియున్న వన్నియు నావి. యోహా. 16:15. 

     ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే తప్ప యే
మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను యెరుగరు. మార్కు 13:32.

     గమనిక: వారసత్వం రుజువు అవుతుందో లేదో ఆలోచింపక ముందు, ఏవి వారసత్వం క్రిందికి వస్తాయో, ఏవి వారసత్వం క్రిందికి రావో తెలుసుకోవాలి! నోటికి వచ్చినట్టు ప్రశ్నించి జ్ఞానమనుకో పనిలేదు. మానవ పరిథుల్లో వారసత్వం భౌతికమైనవాటికి పరిమితి చేయబడుతుంది కదా? సింహాసనం, అధికారం, ఆధిపత్యం లాంటివి కూడా వారసత్వంగా పొందవచ్చు. అయితే మానసికమైనవి వారసత్వంగా ఇచ్చినట్టు పుచ్చుకున్నట్టు ఏ న్యాయ చట్టమైనా ఎరిగి ఉంటుందా? నా చదువుకు, నా తార్కిక జ్ఞానానికి నా కుమారుడు వారసుడా? నేను ఎరిగిన సంగతులు నా కుమారుడు ఎరుగకపోతే వారసత్వం రుజువు కాలేదని భావమా? ఏంటి, మన మిత్రుడు మాట్లాడే ఈ వెర్రి మాటలు!?

     “ఎరుగుట" అనేది వారసత్వం క్రిందికి రాదే! ఆయినా, కాలములను సమయములను మార్చువాడు తండ్రియైన దేవుడనేది బైబిలు సందేశం (2:20-22; యింకా చూడు: ఎఫెసీ. 1:8-9; గలతీ. 4:4; మత్తయి 24:20, 22).”

     ఏదియెలాగున్నా యేసు రక్తమాంసాలలో తన్ను తాను పరిమితి చేసుకున్నాడు (ఫిలిప్పీ 2:5-8), శాశ్వితుడు, సర్వశక్తుడగు క్రీస్తు - కాలం, స్థలం అనేవాటిలో బిగింపబడి, మానవ చరిత్ర పరిథుల్లోనికి దిగి వచ్చాడు. గనుక కాలాన్ని గూర్చి తన శిష్యులు ప్రశ్నించినప్పుడు, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందుంచుకొని యున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు" అని తెలిపాడు (అపొ, 1:7) (అపొ. 1:6,7). కారణం? వారి అనాది తీర్మానాన్ని అనుసరించి (రోమా 16:25, 26) “కాల నిర్ణయం” అనే పని తండ్రిచే నిర్వహింపబడుతుంది (అపొ. 17:30-31). దానితో రక్త మాంసాలలో పాలివాడైన క్రీస్తు జోక్యం పుచ్చుకోలేదు.

     అయినా ఒక మాట! క్రీస్తు యేసుకు, తండ్రియైన దేవునికి గల సంబంధం భౌతికమైన తండ్రి కుమారుల సంబంధానికి సంబంధించింది కాదు.
49. యెహోవా, యేసు - ఒకటా? రెండా?
     నేనును, తండ్రియును ఏకమైయున్నామని (యేసు) వారితో చెప్పెను. యోహా. 10:30. 

     దేవత్వము యొక్క సర్వ వరిపూర్ణత శరీరాకారముగా క్రీస్తునందు నివసించుచున్నది. కొలొ, 2:9.

     మూడు గంటలకు యేసు - ఎలోయి, ఎలోయిలామా, సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము మార్కు 15:34. 

     గమనిక: "యెహోవా, యేసు - ఒకటా? రెండా? అని మన మిత్రుడు అంటాడే బైబిల్లో - యెహోవా, యేసు అనేవి అంకెల్లా లేక జడపదార్ధాల్లా వర్ణింపబడ్డాయా? యేమి? అలా కాకపోతే - యెహోవా, యేసు ఒకటా? రెండా? అని మన మిత్రుడు సూచించడంలో భావమేమి? బైబిల్లో - యెహోవా, యేసు అనేవారు వ్యక్తులు కారా? ఒకవేళ వారిని వ్యక్తులుగా నమ్మకపోయినా, బైబిలును విమర్శింపబూనినప్పుడు వారిని బైబిలు వర్ణించినట్టే తన విమర్శలో సూచించి, దానిలో జరిగిన లోపమేదో తేటగా చూపాలి గదా? యెహోవా, యేసు అనేవారు వ్యక్తులైనట్లు బైబిలు చూపుతుంటే, వారిని అంకెల్లాగానో లేక జడపదార్ధాల్లాగానో భావించి - “ఒకటా? రెండా?" అని మన మిత్రుడు అడగడం తన (మత) ద్వేషాన్ని వెళ్లగ్రక్కడమా? కాదా? పైగా - "ద్వేషించేవాడెవ్వడూ హేతువాది కాడు అని మన మిత్రుడే అన్నాడు" (పునర్దర్శనం పేజీ 5). ఇప్పుడు మన మిత్రుడు హేతువాదియేనంటావా? మత ద్వేషి హేతువాది కాడనేది వాస్తవమైనా, హేతువాదినని చెప్పుకున్నవాడెవడూ (నేనెరిగినంతవరకు) మత ద్వేషి కాకుండినవాడు లేడు. అయినా వారి సంగతి వదలి అసలు పాయింటుకు వద్దాం.

     యెహోవా, యేసుల ఏకత్వం ఎట్టిదో బైబిలే సూచించింది గనుక బైబిలును మన మిత్రుడు సరిగా ఎరిగియుంటే, యిలాటి ప్రశ్న వేయకపోయేవాడే! ప్రశ్నను బట్టే బైబిలునందు మన విమర్శకుని పరిజ్ఞానం బయటపడుతుంది. విషయ పరిజ్ఞానం లేనివాడు విమర్శకుడుగా ఉండతగడు. విమర్శింపతగని మన మిత్రుడు చేసిన చేతగాని పనియే - "బైబిలు బండారం."

     ఏదియెలాగున్నా యేసు ఆకాశమువైపు కన్నులెత్తి యిట్లనెను - "తండ్రీ, నా గడియ వచ్చియున్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికిని ఆయన నిత్యజీవము అనుగ్రహించునట్లు సర్వశరీరులమీదను ఆయనకు అధికారమిచ్చితివి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమపరచితిని. తండ్రీ, లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను యిప్పుడు నీ యొద్ద మహిమపరచుము....” (యోహాను 17:1-5)

     తండ్రీ కుమారులు - (యెహోవా, యేసు) అనేవారు దేవత్వంలో ఉన్న యిద్దరు వ్యక్తులు. వారి ఏకత్వం ఎలాటిదో చూడు!"మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున, వారును (అపొస్తలులు), మనయందు ఏకమై యుండవలెనని వారి (అపొస్తలులు) కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి (అపొస్తలుల) వాక్యమువలన నాయందు విశ్వాసముంచు వారందరును ఏకమై యుండవలెనని వారికొరకును (క్రైస్తవుల కొరకును) ప్రార్థించు చున్నాను" (యోహాను 17:20-21). మతశాఖలు వీరిలో చేరినవారు కారు!

     దైవ ఏకత్వం ఎలాటిదో అర్థమయ్యిందా? ఈ ఏకత్వం వ్యక్తిత్వపు ఏకత్వం కాదు; అది వారి తత్వం యొక్క ఏకత్వమే! They both share the same essence of deity. అందుకే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారముగా క్రీస్తునందు నివసించింది. అంటే వారి స్వభావ లక్షణాలన్నీ ఒకేవిధంగా ఉన్నాయ్. వారు ఏక ఉద్దేశం (oneness of purpose); ఏక భావం (oneness of meaning); ఏక మనస్సు (oneness of mind) గలవారై, జగత్తు పునాదికి ముందే వేసుకొన్న ఆ సంకల్పాన్ని బట్టియే సమస్త కార్యాలను జరిగించుతూ వచ్చారు! (1 పేతురు 1:19-20; ఎఫెసీ 1:3-6; రోమా 16:25-27; 1 కొరింథీ 2:6-8, మొదలైనై).

     నేనును తండ్రియు ఏకమై ఉన్నామంటే - వారిద్దరు ఒకే వ్యక్తియై ఉన్నారని దాని భావం కాదు; యిద్దరు ఒకే రకమైనవారని భావమే! తమ అనాది సంకల్పాన్ని బట్టి ఒక వ్యక్తి మానవ శరీరాన్ని ధరించి రక్తమాంసాలలో పాలివాడయ్యాడు; రెండో ఆయన ఆత్మ రూపిగనే పరమందుండి కార్యాలను జరిగించాడు. ఒకవేళ ఆత్మరూపి, అదృశ్యుడైన యెహోవా (తండ్రి) రక్తమాంసాలు ధరించి, మానవుల మధ్య జీవించినట్లయితే, యేసుక్రీస్తు కంటె ఆయన వేరుగా ఉండడు. గనుకనే, “-నన్ను చూచినవాడు తండ్రిని చూచి యున్నాడని" యేసు తన శిష్యులకు వివరించాడు (యోహాను 14:7-10; 20:30-31), సంగతులు పరిష్కారంగా ఎరుగలేని మన విమర్శకునిలాటివారు - తండ్రి కుమారుల సంబంధాన్ని రకరకాలుగా భావిస్తున్నారు. అయితే వాస్తవానికి యెహోవా (తండ్రి) యేసు క్రీస్తు ప్రభువు - అనేవారు వ్యక్తులుగా యిద్దరేగాని, తత్వంలో, దేవత్వంలో, సంకల్పంలో వారు ఏకమైయున్నారు (1 కొరింథీ. 8:5–6), "మేమిద్దరం ఒకటేననే పద ప్రయోగాన్ని ఎప్పుడైనా విన్నావా? అంటే యిద్దరు ఒకే వ్యక్తి అని దాని అర్థం కాదు కదూ? అలాగే వారు దేవత్వంలో ఏకమైయున్నా (one in essence) వారి అనాది ఏర్పాటును బట్టి, పాపంతో సంబంధం పెట్టుకోలేని పరమ దేవుడు పాపికి పాపానికి మధ్య వ్యత్యాసాన్ని చూచి, పాపిని ప్రేమిస్తూ, పాపాన్ని ద్వేషించి దానికి శిక్ష విధించే కార్యక్రమంలో క్రీస్తు నరరూపు దాల్చాడు. కల్వరిలో యేసు, దేవుని సంకల్పాన్ని అనుసరించి, మానవ దోష శిక్షను భరిస్తూ ఉంటే, పాపంతో సహవాసం చేయలేని (యెహోవా), క్రీస్తును సిలువలో ఒంటరిగా విడిచి వేయవలసి వచ్చింది (యెషయా 53:3–10; యెషయా 59.1-2).

     ఆ సందర్భంలో - ముందుగా ప్రవచింపబడినట్టే (కీర్తన. 22:1), యేసు కల్వరిపైనుండి -"ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ" అని కేక వేయడం జరిగింది. గనుక ఏ మూలనుండి చూచినా, బైబిల్లో సమస్య కనబడే అవకాశమే లేదు. "అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును యెరుగుటయే నిత్య జీవమని" పలికిన యేసు మాటల నంగీకరించాలి! నిజంగా బైబిల్లో సత్యాన్ని గ్రహించి, మేలు పొందాలనే భావం ఎవరికైనా ఉంటే వాస్తవాలను యిలాగే అంగీకరించి తీరాలి! “నేను ఒక్కడనైయుండక, నేనును నన్నుపంపిన తండ్రియు కూడనున్నాము. ఇద్దరు మనుష్యుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది గదా...” (యోహాను 8:17-19) అని క్రీస్తుయేసు స్వయంగా తెలిపాడు.
50. మొదట చచ్చి బ్రతికినవాడు క్రీస్తేనా?
     క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము (పొందువారి)లో మొదటివాడు అపొ. 26:22; (ఇంకా చూడు; ప్రక, 1:5).

     ఆయన (యేసు) ఆలాగు చెప్పి - లాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను. యోహా, 11:43, 44. 

     ఎలీషా ఆ యింట జొచ్చి బాలుడు మరణమై యుండి తన మంచము మీద పెట్టబడియుండుట చూచి - మరల మంచము మీద యెక్కి వానిమీద పొడుగుగా పండుకొనగా బిడ్డ యేడుమారులు తుమ్మి కండ్లు తెరచెను 2 రాజు 4:32-35.

     ఆయన (యేసు) - చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయినవాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను లూకా. 7:14, 15.

     గమనిక: యేసు మరణానికి ముందుగా మృతులలోనుండి ఆయన కొందరిని లేపినట్టున్నూ దానికి ఎంతో ముందుగా ఎలీషా ఒక విధవరాలి కుమారుని బ్రతికించినటున్నూ బైబిలు చెప్పుతూ కూడ మృతుల పునరుత్థానము (పొందువారి)లో యేసు మొదటివాడని సూచించడం అసంబద్ధం కాదా? అని మన విమర్శకుడు అడుగుతున్నాడు. అయితే అతని ప్రశ్న సరియైనదేనా? (పొందువారి)లో అనేది బ్రాకెట్లలో ఉందిగమనించు!

     "బైబిల్లో దోషముంది చూడు" అని చూపిన ప్రతి సందర్భంలోనూ మన మిత్రుడు తప్పు చేసినట్టే పరిశీలించినవారికి తేటపడుతుంది. పైగా, గతంలో తాను చూప ప్రయత్నించిన తప్పుల్లో, పరిశీలించినవారికి ఏ ఒక్కటీ తప్పుగా గోచరించ లేదు.

     మన మిత్రుని ప్రయాస చూస్తుంటే ఓ చిన్నసంఘటన గుర్తుకొస్తుంది. మన దేశంలోని కొన్ని సమాజాల మధ్య - క్రొత్త దంపతులకు "అరుంధతిని" చూపే వాడుకుందిట! వారి వైవాహిక పవిత్రతకు ఆ అరుంధతిని గుర్తించడం ముద్రగా ఉంటుందట. ఆలాటి సందర్భంలో కుడియెడమలు ఎరుగని పసి దంపతులు - "ఉంది, చూడు" అని చెప్పే పెద్దవారి మాటల్లోని వాస్తవాన్ని చూడలేక ఏది? ఏది? అని అడుగుతారట! అలా అడగడం వారి పవిత్రతకు ముప్పని సాంప్రదాయంగా భావించిన బంధువులు, వారు చూడకపోయినా, చూచినట్టు చెప్పండని ఆ దంపతులను ప్రోత్సహిస్తారట! ఇలాటి సాంప్రదాయమే నిజమైతే, అలా ప్రోత్సహించే రూపం ఏలాటిదో, బైబిల్లో తప్పులు ఉన్నాయని చూపడానికి మన మిత్రుడు చేసిన ప్రయత్నం కూడా అలాటిదే! గనుక తన పలుకుల్లో అమాయకులు పడిపోతే పడిపోతారేమో కాని, తార్కిక జ్ఞానంతో సంగతులు పరిశీలించగల వారెవ్వరూ అతనితో ఏకీభవించరు; ఏకీభవించలేరు.

     ఎలాగంటావేమో! అసలు వాస్తవాలను ఓ ప్రక్కనుంచి, ప్రస్తుతం మన మిత్రుని మాటల వద్దకే వద్దాం. ఈ అంశం క్రింద తాను చూపిన చివరి మూడు కొటేషన్లను, అంటే - (యోహాను 11:43-44; 2 రాజులు 4:33-35; లూకా 7:14-15లను) గమనించు. అవన్నీ క్రీస్తు పునరుత్థానానికి ముందటివే కదా?

     అయితే యిప్పుడు తాను కోట్ చేసిన మొదటి లేఖనం చూడు. ఇది క్రీస్తు పునరుత్థానాన్ని సూచించేది; ఔనా? రైటు. పైన చెప్పబడినవన్నీ దీనికి ముందటి సంభవాలే అయితే క్రీస్తు పునరుత్థానాన్ని గూర్చిన లేఖనం ముందు కోట్ చేయాలా? లేక వెనుక కోట్ చేయాలా? వెనుక జరిగిన సంగతిని వెనుక చెప్పడం క్రమం కదా? అయితే వెనుక పెట్టవలసినదాన్ని మన మిత్రుడు ముందు పెట్టాడేం? వెనుకది ముందు, ముందుది - వెనుక పెట్టి గలిబిలి చేసేదేనా మన మిత్రుని హేతువాదం? ఒకవేళ గలిబిలి చేసేదే ఆయన విజ్ఞాన బాటయైతే, పామరులు పడిపోతారు గాని, పరిశీలకులూ పండితులూ పడిపోరు! గలిబిలిని జ్ఞానమని భ్రమించే ప్రతివాడు మేల్కోవాలి!

     మన మిత్రుడు పైన కోట్ చేసిన లేఖనాలను కాలక్రమంలో ఉంచి వాస్తవాలను చూచామనుకో - "క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందువారిలో మొదట "వాడు" (అపొ. 26:22) అనేది, ఈ సందర్భంలో సమస్యకానవసరం లేదు. "పొందువారు" అనేది "భవిష్యత్ భావనను" సూచిస్తుంది. అంటే ఆ తరువాత ఎవరో పునరుత్థానం పొందబోతున్నారని, అలా పొందేవారిలో క్రీస్తు మొదటివాడని ఆ లేఖనం సూచించింది కదా? ఇక సమస్యేముంది?

     వాస్తవానికి మన మిత్రుడు సూచించిన రూపంలో - క్రీస్తు పునరుత్థానం తనకు ముందటి వారితో పోల్చబడలేదు; తనకు తరువాత పునరుత్థానం పొందబోయేవారితో మాత్రమే పోల్చబడినట్టుంది. క్రీస్తు తరువాత పునరుత్థానం పొందబోయేవారికి మాత్రమే దాన్ని వర్తింపజేసినట్లయితే - వ్రాయబడిన లేఖనంలో తప్పు పట్టటానికి గాని లోపం చూపడానికి గాని వీలు లేనేలేదు. అయితే బైబిలు బోధించిన వర్తమానం యిది కాదనుకో!

     అందుకే బైబిలు బోధించే అసలు సంగతికి వద్దాం. లేఖనాల్లో మృతుల పునరుత్థాన మనేది ఆత్మసంబంధంగాను (ఎఫెసీ. 2:1-2; యోహాను 5:25); భౌతిక సంబంధంగాను ఉపయోగింపబడింది (యోహాను 5:28). అయితే ప్రస్తుతం మన చర్చలో ఉన్న అంశం శరీర పునరుత్థానమే! గనుక ఆత్మ సంబంధమైనదాన్ని ప్రక్కన పెడదాం.

     శరీర పునరుత్థానం కూడా రెండు రకాలుగా బైబిల్లో కన్పిస్తుంది: వాటిలో మొదటిది తాత్కాలిక పునరుత్థానం (resurrection in time) రెండోది శాశ్వత పునరుత్థానం (resurrection for eternity or eternal resurrection). బైబిలు చూపిన ఈ వ్యత్యాసాన్ని మన మిత్రుడు చూడలేక తొట్రుపడ్డాడు.

     2 రాజులు 4:32-35; యోహాను 11:43, 44; లూకా 7:14-15 వగైరాలు తాత్కాలిక పునరుత్థానానికి చెందినవి. ఇలా బ్రతికింపబడినవారు కొద్దికాలం భూమిమీద జీవించి, మరల సహజమైన మరణం పొందువారు. ఇది వారికి శాశ్వతమయ్యింది కాదు గనుక, తాము శరీరమందు జరిగించిన వాటి ఫలము ననుభవించునట్లు శాశ్వతమైన పునరుత్థానంలో వారు తిరిగి పాలుపొందుతారు (యోహాను 5:28; That will be the general resurrection for all humanity మత్తయి 11:20-24 అపొ. 17:31).

     అయితే క్రీస్తు యొక్క శరీరపునరుత్థానం (1 కొరింథీ 15:3-4) శాశ్వతమయ్యింది. (This has to be the eternal bodily resurrection) ఈ పునరుత్థానాన్ని బట్టి దేవుని కుమారుడని ప్రభావంతో రుజువు చేయబడ్డాడు (రోమా 1:4). తన పునరుత్థాన సత్యాన్ని ఒప్పించడానికి ఆయన తన శిష్యులకు 40 దినాలు కన్పించాడు (అపొ. 1:1-6; 1 కొరింథీ 15:5-8) అటు తరువాత ఆయన ఆరోహణమై తేజోమయుడయ్యాడు (1 తిమోతి 3:16); ఆయన ఆరోహణమైనప్పుడు తన శిష్యులు ఆయన వైపు తేరి చూచారు (అపొ. 1:8-9). ఆ తరువాత ఆ కాలంలో పౌలుకు ఆయన కన్పించి, మాట్లాడాడు (అపొ. 26:14–20). ఆయన దేవుని కుడి పార్శ్యమునకు హెచ్చింపబడినవాడై (అపొ. 2:35, 36), సజీవుడై (ప్రకటన 1:18) ఏలుతూ, తన ప్రజల కొరకు యాజకుడైయున్నాడు హెబ్రీ. 2:14).

     ఇలాటి నిత్య పునరుత్థానం పొందినవారిలో మొదటివాడు క్రీస్తే (ప్రకటన 1:5), ఈయనను బట్టే శరీర పునరుత్థానం నరులందరికి ఒకసారే కలుగబోతుంది. అది శాశ్వతంగా నరుని బ్రతికిస్తుంది (1 కొరింథీ. 15:21-22). అది ఆయన రెండవ రాకడలో సంభవించుతుంది. అప్పుడు మరణం శాశ్వతంగా విజయమందు మ్రింగివేయ బడుతుంది (1 కొరింథీ. 15:50-58; 1 థెస్స. 4:14-17); దానితో కాలం అంతమౌతుంది - నిత్యజీవమో, నిందపాలో = ఏదియేమైనా నరులు నిత్యత్వంలో ప్రవేశిస్తారు (మత్తయి 23:34-46), గనుక మొదట చచ్చి బ్రతికినవాడు క్రీస్తేనా? అనే ప్రశ్న పునరుత్థానాన్ని గూర్చి బైబిలు సందేశం ఎరుగనివాడు వేసే ప్రశ్నయే! శాశ్వత పునరుత్థానం పొందువారిలో మొదటివాడు క్రీస్తేనా? ఔను! (ప్రకటన 1:5; అపొ, 26:22). "నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతినిగాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను. . . (ప్రకటన 1:18) ఇట్టి పునరుత్థానము పొందువారిలో మొదటివాడు క్రీస్తే (1కొరింథీ 15:20) అపొ. 17:30-31 కూడా చూడు).

Next >>

4 comments:

  1. 1. సార్! మనిషికి ముందే భూ,ఆకాశ జంతువులను సృజించి పేర్ల కోసం వాటిని ఆదాము వద్దకు తీసుకుని వచ్చి ఉంటే ఆ వాక్యము
    దేవుడు "తాను నిర్మించిన" భూ, ఆకాశ జంతువులను.. అని ఉంటుంది కాని..
    దేవుడు భూ, ఆకాశ జంతువులను "నిర్మించి తీసుకుని వచ్చెను" అని ఉండదు కదా?
    నిర్మించి అన్న పదం అదే సందర్భంలో జరిగిన క్రియను సూచిస్తుంది.
    నిర్మించిన అన్న పదం అంతకు ముందు సందర్భంలో జరిగిన క్రియను సూచిస్తుంది.
    ఉదాహారణకు.. 1. నేను బడి నుండి రాగానే మా ఆమ్మ "అన్నం వండి" పెట్టింది. 2. నేను బడి నుండి రాగానే మా అమ్మ "వండిన అన్నం" పెట్టింది. ఈ రెంటికి తేడా ఏముందో భాషా పరంగా మీరే చెప్పాలి...
    చేసిన/నిర్మించిన జంతువులను తీసుకుని వచ్చాడు..
    జంతువులను చేసి/నిర్మించి తీసుకుని వచ్చాడు..

    ReplyDelete
  2. సార్ పసుపులేటి చరణ్ గారూ,
    ఆదికాండము 2 అద్యాయం 3 వ వచనం తో సృష్టి అంతటినీ దేవుడు ఎలా చేసి ముగించాడో రాయబడింది....అవి భూ జంతువులు, ఆకాశ పక్షులు, అలాగే ఆదాము, హవ్వ (స్త్రీ పురుషులుగా మన స్వరూపమందు అని మాత్రమే రాయబడింది) గురించి కూడా రాయబడింది...
    అయితే ఆదికాండము....2 అద్యాయం, 4 వ వచనం నుండి మళ్లీ **వుత్పత్తి (సృష్టి) క్రమం తిరిగి రాయబడింది.**
    అందుకే హవ్వ ఎలా సృష్టించ బడిందో ...(పక్కటెముక నుండి) రాయబడింది...
    భూ జంతువులకు పేర్లు పెట్టు నపుడు వాటిని కూడా నేల నుండి నిర్మించినట్లు ఇక్కడ రాయ బడింది.....ముందు వచనాలలో అది రాయ బడలేదు...
    అర్ధమైందనుకుంటాను....

    ReplyDelete
  3. కష్టం
    మీరు మారరు కదా !

    ReplyDelete